21, జులై 2009, మంగళవారం

ఈ మాసం పద్య కవిత ... ( జులై 2009 )


ఈ మాసం పద్య కవిత ... ( జులై 2009 )

మహాకవి డా || దాశరథి వ్రాసిందే మరో పద్యాన్ని ఈ మాసం పద్య కవితగ అందిస్తున్నాను.

వెలుతురు మొగ్గవై బ్రదుకు వీధుల నూత్న పరీమళమ్ములన్
చిలికిన నీకుగాను విరచించితి గుండియ కొండ మీద ది
వ్వెల రతనాల మేడ; పదవే ! అట నుందువు గాని, కోటి గుం
డెల వెలిగించు దివ్య రమణిన్ _ నిను గాడుపు పాలొనర్తునే ?


మహాకవి ఒక దీపాన్ని వర్ణిస్తున్నాడు. దానిని " వెలుతురు మొగ్గ " అన్నాడు. మీరు గమనించారో .. లేదో ! దీప శిఖ ఉండేది " మొగ్గ " ఆకృతిలోనే. మొగ్గ పుట్టగానే వీధులలో పరిమళాలను వెదజల్లుతుంది. ఈ మొగ్గ " వెలుతురు " అనే కొత్త రకమైన పరిమళాలను బ్రతుకు వీధులలో చిలుకుతుంది. కవి ఆ దీపాన్ని ప్రేమిస్తున్నాడు. అవును ... దీపమే ఆయన ప్రేయసి. ఆ ప్రేయసిని గుండెలో దాచుకొంటాను _ రమ్మంటున్నాడు. అదీ దీపాల కోసమే ప్రత్యేకంగా ఒక రతనాల మేడ నిర్మించి, అందులో ఉండడానికి ఆహ్వానిస్తున్నాడు. మనందరికీ ఏ జూబిలీ హిల్స్ కొండ మీదో లేక బంజారా హిల్స్ కొండ మీదో ఒక పెద్ద మేడ కడితే _ అదే గొప్ప ! కాని ఆ మహా కవి కట్టింది ఎక్కడనుకొంటున్నారు ? ఆయన గుండె అనే కొండ మీద ! ఆయన ఆ దీప రమణిని అంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు ? ఎందుకంటే అది కోటి గుండెలను ఒక్క సారిగా వెలిగించగల దివ్య జ్యోతి. అదే జ్ఞాన జ్యోతి ! మరి ఆ దీపాన్ని గాలిలో పెట్టి, ఆరిపోతుంటే చూడగలడా ? అందుకే అపురూపంగా చూసుకొంటాను _ " పదవే " అంటూ ఆత్మీయంగా ప్రేమతో పిలుస్తున్నాడు.

ఎంత చక్కని భావుకత ! అంతర్లీనంగా ఎంతటి తాత్త్వికత !
జ్ఞాన దీప ప్రేమికా ! నీకు జోహారులు !

(ఈ రోజు - 21 జులై, డా.దాశరథి గారి జయంతి సందర్భంగా ... )

_ డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

17, జులై 2009, శుక్రవారం

" ఆణిముత్యం" ... ( జులై 2009 ) "


" ఆణిముత్యం" ... ( జులై 2009 ) "

" విషయ సంకలనము విజ్ఞానమా ? కాదు !
ఇటుక వాము వేరు _ ఇల్లు వేరు !
అస్థి పంజరమ్ము అసలు దేహము కాదు !
ప్రత్తి వేరు _ నూలు పంచె వేరు !
"


మా గురువు గారు డా || నండూరి రామకృష్ణమాచార్య రచించిన పద్యం ఇది.
మానవుడు వివిధ విషయాలపై సమాచారాన్ని సేకరించి, మెదడులో దాచుకొన్నంత మాత్రాన _ అది అతడు సాధించిన విజ్ఞానంగా భావించలేము. ఆ సమాచారాన్ని అంతా తన ఇంగిత జ్ఞానంతో మెదడులో సమన్వయం చేసుకొని, అవసరానికి సత్ఫలితాలిచ్చేలా దానిని ప్రయోగించగలిగినప్పుడే అది అతడు సాధించిన విజ్ఞానంగా పరిగణించబడుతుందని గురువు గారు ఈ పద్యంలో ప్రబోధించారు. దీనికి రూఢిగా ఆయన మూడు ఉదాహరణాలను ఇచ్చారు.
1. మన దగ్గర ఇటుకలెన్నైనా ఉండవచ్చు. కాని వాటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి, మధ్యలో సిమెంటుతో సంధానిస్తూ, నివసించడానికి అనువుగా రూపొందించిన నిర్మాణాన్ని మాత్రమే ఇల్లు అంటారు.
2. అస్థి పంజరం మనిషి దేహంలో ఉండవచ్చు. కానీ అదే దేహమై పోదు. అందులో రక్త, మాంసాలను కూర్చి, జీవ లక్షణం తోడైనప్పుడే అది దేహమౌతుంది.
3. అలాగే, మన వద్ద కావలసినంత పత్తి ఉండవచ్చు. కాని దానిని కట్టుకోడానికి అనువుగా చక్కగా నేసినప్పుడే అది పంచె అవుతుంది.
ఆ విధంగానే మనం సేకరించిన సమాచారాన్ని ఉపయుక్తంగా మలచి, మెదడులో తీర్చి దిద్దుకొన్నప్పుడే _ అది విజ్ఞానమవుతుంది అని ఈ పద్య భావం.

14, జులై 2009, మంగళవారం

" శలవు " కాదు _ " సెలవు "

" శలవు " కాదు _ " సెలవు "
--------------------------

బ్లాగులలో కొందరు " శలవు " అని వ్రాస్తున్నారు. అది తప్పు.
దానిని " సెలవు " అని వ్రాయాలి. అదే సాధు రూపం !
అలాగే, కొంత మంది ఈ శబ్దాన్ని పూర్తిగా తొలగి పోతున్నప్పుడే ప్రయోగిస్తారన్న అపోహలో ఉన్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు. తాత్కాలికమైన వీడుకోలుకు కూడా దీనిని వాడవచ్చు.
దీని అర్థం ఏమిటనుకొన్నారు ?
ఆజ్ఞ లేక అనుమతి.
సెలవు అంటే వీడుకోలు తీసుకొనేందుకు అనుమతి కోరడం అన్న మాట !

అందరూ తప్పుగా వ్రాసే మరొక పదం " అమాయికుడు ". దీనిని అందరూ " అమాయకుడు " అని వ్రాస్తారు, పలుకుతారు. ఇది తప్పు. " అమాయికుడు " సాధు రూపం.

డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

12, జులై 2009, ఆదివారం

సంపాదకీయం ( జులై 2009 ) "

" సులువుగా పద్యం వ్రాయండి " శీర్షికలో ట్యూన్ కి పాట వ్రాసినంత సులువుగా పద్యం వ్రాయడమెలాగో నేర్పుతున్నాను. అయితే పాఠకుల నుండి ఆశించినంతగా స్పందన రాలేదు. బహుశః దానికి కారణం _ చాలా మందికి ట్యూన్ కి పాట వ్రాయడం కూడా ఎలాగో తెలియదేమో అన్న అనుమానం కలుగుతున్నది. అటువంటి వారి అవగాహనార్థం " ఆకలి రాజ్యం " సినిమాలోని ఒక పాట సన్నివేశం ఈ క్రింద ఇస్తున్నాను. అది చూచి మన " ఉత్పల మాల " ను కూడా అలాగే అభ్యాసం చేసి, మంచి పద్యాలు వ్రాస్తారని ఆకాంక్షిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకులు )

Aakali Rajyam-Kanne Pillavani Kannulunnavani

8, జులై 2009, బుధవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( జులై 2009 )

సులువుగా పద్యం వ్రాయండి ... ( జులై 2009 )
లఘువులు, గురువులు, గణాల గోల లేకుండా కేవలం ఒక పాటలా ట్యూనిచ్చి, ఆ ట్యూన్ లోని ఒక్కొక్క భాగానికి ఎలాంటి పదాలు ఇముడుతాయో మూడు, నాలుగు పదాలు ఉదాహరణలుగా చూపి, మళ్ళీ మొత్తంగా ఒక ప్రసిద్ధ పద్యాన్ని ఆ ట్యూన్ ప్రకారం ఎలా కుదిరిందో వివరించి, తప్పులున్నా సరే _ సరిదిద్దుతానని హామీ ఇచ్చినా ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఒక్క పద్యాన్ని (తప్పో _ ఒప్పో _ ) వ్రాయక పోవడం నన్ను నిరాశకు గురి చేసింది. వ్రాయలేక పోవడం అనే కన్న అసలు ప్రయత్నమే చేసినట్టుగా కనిపించడం లేదు. ఫరవా లేదు. మరి కొన్ని ఉదాహరణలు చూపుతాను.
ఇప్పుడు మన ప్రధాన మంత్రి " మన్మోహన్ సింగ్ " పై " ఉత్పల మాల " పద్యం వ్రాయాలనుకోండి. ముందుగా ఆయనను తలచుకోగానే మనకేం గుర్తొస్తుంది ? ఆయన ముఖంలో గడ్డం అనుకోండి. ఇప్పుడా విషయం పద్యంలో చెప్పుదాం.
ఉత్పల మాల ట్యూన్ ఏంటి ?
తానన తాననా తనన తానన తానన తాన తాననా
ఇప్పుడు పైన అనుకొన్న భావం ట్యూన్ లో ఇలా చెప్పవచ్చు.
తానన : మోమున
తాననా : గడ్డముం
తనన : డు _ _ ( తనన లో "త" వరకే నింపాము. ఇంకా " నన " మిగిలి ఉంది.
ఇంత వరకు వ్రాసిందేంటి ?
" మోమున గడ్డముండు ..."
మన మనుకొన్న భావం వచ్చింది. ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? నెత్తి మీద " పగ్డి " ఉంటుంది.
తనన : డు ... శిర
తానన : మున్ ధరి
తానన : యించును
తాన : పగ్డి
ఇప్పుడు మళ్ళీ పద్యం చూదాం.
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ ... " ( ఇక్కడ మొదటి అక్షరం " మో " కి, పదో అక్షరం _
" మున్ " కి యతి కుదిరింది. గమనించండి. )
ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? ... ఎప్పుడు చిరునవ్వులను చిందుతుంటాడు. అయితే పద్యం రెండో పాదంలోకి వెళుతోంది కాబట్టి ప్రాసాక్షరం సరి పోయేలా పదం వేయాలి. " మందహాసామృతము " పదమయితే " మృ " ప్రాసాక్షరంగా పడి సరిపోతుంది. ఎలాగో చూడండి.
తాననా : మందహా ( ఇక్కడికి మొదటి పాదం పూర్తయింది.)
మళ్ళీ ... రెండో పాదం ప్రారంభిస్తే ...
తానన : సామృత
తాననా : మున్ సదా
తనన : కురియు
ఇప్పుడు పద్యం ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ..."
ఇప్పుడు రాబోయే అక్షరం రెండో పాదంలో పదో అక్షరం కాబట్టి మళ్ళీ యతి చూసుకోవాలి. రెండో పాదం " సామృత " అని ప్రారంభమైనా, అక్కడ సంధి వల్ల " సా " వచ్చింది గాని, నిజానికి అక్కడ ఉన్నది " అమృత " లోని " అ "... కాబట్టి " అ " కే యతి వేయాలి.
సరే ! ఇంతకీ ఆయన గురించి ఇంకేం చెప్పవచ్చు? ఆయన ఆర్థిక శాస్త్రంలో మేటి.
తానన : ఆర్థిక
తానన : శాస్త్రము
తాన : నందు
తాననా : మేటియౌ ( ఇక్కడికి రెండో పాదం కూడా పూర్తయింది )
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం _
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ఆర్థిక శాస్త్రము నందు మేటియౌ "
మన్మోహన్ సింగ్ ను గూర్చి ఇంకా ఏం చెప్పవచ్చో ఇలాగే ఆలోచిస్తూ మూడు , నాలుగు పాదాలను కూడా ఇలా పూర్తి చేయవచ్చు.
తానన : " శ్రీ మన
తాననా : మోహనా "
తనన : ఖ్యుడను
తానన : " సింగు " యె
తానన : " కింగ " యి
తాన : నేడు
తాననా : దీటుగా ( దీంతో మూడో పాదం అయిపోయింది. )
ఇక్ నాలుగో పాదం ...
తానన : క్షేమము
తాననా : గా సుపా
తనన : లనము
తానన : సేయుచు
తానన : నుండెను
తాన : భార
తాననా : తావనిన్ ( నాలుగో పాదం కూడా పూర్తయిపోయింది )
ఇప్పుడు మొత్తం పద్యాన్ని చూద్దాం ...

" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ఆర్థిక శాస్త్రమునందు మేటియౌ
శ్రీ మనమోహనాఖ్యుడను " సింగుయె కింగయి " నేడు దీటుగా,
క్షేమముగా సుపాలనము సేయుచునుండెను భారతావనిన్ ! "

చూసారా ? మన ప్రధానిపై ఎంత చక్కని పద్యం రూపు దిద్దుకొందో ! ఇది నేను ఇప్పటికిప్పుడు పాఠం వ్రాస్తూ అల్లిన పద్యమే ! ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మీరు కూడా మీకిష్టమైన నాయకుని మీద ఒక " ఉత్పల మాల " పద్యం వ్రాయండి ... అది _ ఇందిరా గాంధి కావచ్చు. లేక పోతే వాజపాయి, లేక చంద్రబాబు, ఇంకా ... రాజశేఖర రెడ్డి, కాకపోతే సచిన్ టెండూల్కర్, ధోనీ ... ఎవరైనా కావచ్చు. వ్యాఖ్యగా ప్రచురించండి. తప్పులుంటే సరి దిద్దుతాను. అవసరమైతే సూచనలిస్తాను. ఒక్క పద్యం వ్రాయండి ... తరువాత చూడండి _ ఆ అనిర్వచనీయమైన ఆనందం ఎలా ఉంటుందో !

ALL THE BEST !

_ డా . ఆచార్య ఫణీంద్ర
సంపాదకుడు

5, జులై 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... ( జులై 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ !"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 జులై 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)