12, ఆగస్టు 2010, గురువారం

సరస సల్లాపం - 3





1960.. 70 ల నాటి సంగతి. నా చిన్ననాట ... మా పెద్దలు చెప్పుకొంటుంటే విన్న మాట! అప్పటికి ప్రసార సాధనాలుగా ఉన్నవి వార్తా పత్రికలు మరియు ఆకాశవాణి మాత్రమే. అవీ అంతంతమాత్రంగానే ఉండేవి. ఆ రోజుల్లో ప్రసిద్ధ కవి, ’పోతన చరిత్రము’ మహాకావ్య కర్త, డా. వానమామలై వరదాచార్యులు క్షయ వ్యాధి సోకి, చాలా జబ్బుపడ్డారు. అంతలో ఎవరో ఆగంతుకుడు ఆనాటి యువకవి, ఔత్సాహికుడు అయిన సి. నారాయణరెడ్డికి ఆచార్యులవారు పరమపదించినట్టుగా వార్త మోసారు. అశనిపాతంగా తాకిన ఆ వార్తకు ఎంతో కుందిన నారాయణరెడ్డి కవి వెంటనే సంతాప సభకు ఏర్పాట్లు చేసారు. కాని... నిజానికి ఆ వార్త అసత్యం. వరదాచార్యులవారు అప్పుడే కొద్దిగా కోలుకొన్నారు. ఇంతలో మరొక వార్తావహుడు ఈ విషయాన్ని ఆచార్యులవారికి అంటించాడు. ఆచార్యులవారు కోపంతో ఊగిపోతూ, సంతాపసభ కరపత్రాన్ని చేతిలో పట్టుకొని, సరిగ్గా సభామందిరంలోకి అడుగుపెట్టారు. అక్కడ సభాసదులు వక్తలతోబాటు యువకవి నారాయణరెడ్డి ఈ విషయం తెలుసుకొని ఒకింత నిశ్చేష్టులైనా, మళ్ళీ తమాయించుకొని, వానమామలై వారికి ఎదురుగా వెళ్ళారు. వరదాచార్యులు గారు కట్టలు తెంచుకొన్న ఆగ్రహంతో " నారాయణరెడ్డీ! నేను ... పోతనా? " ( " నేను అంత సులభంగా పోతాననుకొన్నావా? " అని.) అన్నారు. అప్పుడు నారాయణరెడ్డి కవి సమయస్ఫూర్తి, చాకచక్యాన్ని రంగరించి " అన్నా! నీవు పోతనే! మా పాలిట అభినవ పోతనవు! " అన్నారు. వెంటనే సినారె ఆ సంతాపసభను సన్మానసభగా మార్చి, వానమామలై వరదాచార్యులు గారికి ’అభినవ పోతన’ బిరుదప్రదానం చేయడంతో ఆ విద్వత్కవి శాంతించారు.