6, జనవరి 2013, ఆదివారం

సరస సల్లాపము - 22



                   ఒక పండితుడు కిరాణా కొట్టుకు వెళ్లి, "మా ఆవిడ బిర్యానీ చేయాలనుకొంటుంది. శ్రేష్ఠమయిన బియ్యం చూపవయ్యా!" అని అన్నాడట. ఆ కొట్టు యజమాని -"వసుమతి" అన్నాడు. "వసుమతా? బాసుమతా?" అని ప్రశ్నించాడు ఆ పండితుడు. దానికి ఆ 'కొట్టు'వాడు "పండితులు! మీకు చెప్పాలా? ఉత్తరాది వారు 'వ'ని  'బ'గా పలుకుతారు.వసుమతేనండి!" అన్నాడు. ఆ పండితుడు "వీడి పాండిత్యం కూలా!" అని మనసులో అనుకొని, బియ్యం తీసుకొని ఇంటికి వెళ్లాడు.       
                  మరో రోజు... ఆ పండితుడు మళ్ళీ ఆ కొట్టుకే వెళ్లి "మా ఆవిడ నువ్వుల లడ్డులను చేయాలనుకొంటుంది. మేలు రకం నువ్వులను చూపించు" అన్నాడు. వెంటనే ఆ  కొట్టు యజమాని "తిలోత్తమ" అన్నాడు. అర్థం కాక ఆ పండితుడు "అదేమిటి?" అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కొట్టు యజమాని "పండితులు! మీకు చెప్పలా? తిలలలో ఉత్తమమైనది." అన్నాడు. దానికి ఆ పండితుడు "ఓరి నీ తెలివి మండ!" అని మనసులో అనుకొని, మారు మాట్లాడకుండా నువ్వులను తీసుకొని ఇంటి దారి పట్టాడు.  

(ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలలో కవి మిత్రులు 'రసరాజు' గారితో సంభాషిస్తుంటే  , నా మస్తిష్కంలో మెరిసిన చిన్న ప్రహసనం ఇది.
- డా.ఆచార్య ఫణీంద్ర )