20, అక్టోబర్ 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి ... ( అక్టోబరు 2009 )

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.

ఈ మాసం సమస్య :
" జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

18, అక్టోబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( అక్టోబర్ 2009 )

" లేడు దేవుడనెడు వాడెచ్చటను లేడు "
- అనుచు నొక్కి పలికె నాస్తికుండు !
" లేడు ధరణి మీద లేడురా కంసాలి "
- పసిడి ఉంగరమ్ము బదులు పలికె !!



ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన తాత్త్వికపరమైన పద్యాలలో ఒక ఆణిముత్యం.
" దేవుడున్నాడా? లేడా ? " అన్నది యుగయుగాలుగా సాగుతున్న మీమాంస. ఈ తర్కం అంతు లేకుండా తరతరాలుగా మానవులు చేస్తూనే ఉన్నారు. కాని ఏ అతీత శక్తి లేకుండా ఈ సృష్టి, ఈ మానవుడు ... ఇంత క్రమ పద్ధతిలో ఎలా నిర్మించ బడుతున్నాయి? ఒక కంసాలి బంగారు ఉంగరాన్ని తయారు చేస్తాడు. ఎవరూ చేయకుండా ఉంగరం తయారు కాదు కదా! కాని, ఆ ఉంగరానికి కంసాలి అనేవాడు ఉన్నాడని రూఢిగా తెలిసే అవకాశం లేదు. అది తన అస్థిత్వం ఒక సహజ పరిణామమనో, లేక ఉంగరాల మనశ్శక్తి ఫలితమనో భావించే అవకాశమూ లేక పోలేదు.ఆ ఉంగరాలలో కొన్ని (ఒక వేళ వాదించే శక్తి ఉంటే), " కంసాలి అనేవాడు లేడు " అని వాదించే అవకాశం ఉండదంటారా? మానవులు అంతే!కాని వైజ్ఞానికంగా ఆలోచించినా, " ఎటువంటి బాహ్య శక్తి ప్రమేయం లేకుండా, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనికి గాని, గమన స్థితిలోని వస్తువు నిశ్చల స్థితిలోనికి గాని మారవు " అన్న న్యూటన్ గమన సూత్రాలలో రెండవ సూత్రాన్ని నమ్మితే - ’ఉత్పత్తి’ అనే మార్పుకు కారణభూతమయ్యే ఆ బాహ్య శక్తి ( అదే అతీత శక్తి లేక దైవ శక్తి ) ఉందన్న విషయం ఒప్పుకోక తప్పదు. ఉంగరానికి కంసాలి ఉన్నాడన్న విషయం నిరూపించే శక్తి లేనట్టే, మానవునికి దేవుడున్నాడన్న విషయం నిరూపించే శక్తి లేక పోవచ్చు. అంత మాత్రాన కంసాలి లేడని, దేవుడూ లేడని చెప్పలేము కదా! అందుకే ఆధునిక కాలంలో ఉన్నత విద్యల నభ్యసించి, మేధావులైన వివేకానందుడు,అరవిందుని వంటి వారు ఆస్తికులై, దైవ శక్తి ప్రచారంలో తమ జీవితాలను సార్థకం చేసుకొన్నారు.
ఇంత చిన్న పద్యంలో ఇంత విస్తార విషయాన్ని ఇలా అందించడం నిజంగా విశేషం. పైగా, తరతరాలుగా కొనసాగుతున్న తర్కానికి ఇంత ’కన్విన్సింగ్’గా సమాధానం అందించడం గురువుగారి అసమాన ప్రజ్ఞా ధురీణతకు తార్కాణం.

12, అక్టోబర్ 2009, సోమవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( అక్టోబరు 2009 )

గత మాసం ’ చంపక మాల ’ పద్యం గురించి తెలుసుకొన్నాం కదా !
అదే ఛందస్సుకు మరో ఉదాహరణను చూద్దాం.
" అది రమణీయ పుష్పవన; మా వనమందొక మేడ; మేడపై
అదియొక మారుమూల గది; ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక - పోలిక రాచపిల్ల - జం
కొదవెడు కాళ్ళ తోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగాన్ ! "

’ చంపక మాల ’ ట్యూన్ -
" తననన తాననా తనన తానన తానన తాన తాననా " అని చెప్పుకొన్నాం. అలాగే ప్రతిపాదంలో 11 వ అక్షరం యతి స్థానం. ప్రాస నియమం ఉంటుంది. పై పద్యంలో ప్రతి పాదంలో ప్రాసాక్షరం ( 2 వ అక్షరం ) - ’ ది ’, ’ ది ’, ’ దు ’ , ’ ద ’ ... ఇలా ’ ద ’ అనే హల్లుకు చెందిన గుణింతాక్షరాలు ఉన్నాయి - గమనించారి కదా !
ఇప్పుడు మొదటి పాదాన్ని ట్యూన్ తో పోల్చి చూద్దామా !
తననన : అది రమ
తాననా : ణీయ పు ( ఇక్కడ ’ పు ’ తరువాత ’ ష్ప ’ అన్న సంయుక్తాక్షరం ఉండడం వలన ’ పు ’ దీర్ఘాక్షరంతో సమానమవుతుంది. )
తనన : ష్ప వన
తానన : మా వన
తానన : మందొక
తాన : మేడ
తాననా : మేడపై
ఇక యతి - మొదటి అక్షరమయిన ’ అ ’ కు, 11 వ అక్షరమయిన ’ మా ’ లోని
’ ఆ ’ ( ము + ఆ ) కు యతి కుదిరింది.
ఇలా అన్ని పాదాలను పోల్చి చూడండి.
పద్యం వ్రాయాలన్న తపన గల ఔత్సాహికులు పై విషయాన్ని అవగాహన చేసుకొని, తొలి ప్రయత్నం చేసి వ్రాసిన పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందజేస్తే నా కృషి ఫలించినట్టుగా భావిస్తాను.