1, ఆగస్టు 2020, శనివారం

సాహితీ సల్లాపాలు - 3 (విన్నవి .. కన్నవి ...)

ఇది పండితులు చెప్పుకోగా విన్నది. ఎంత సత్యమో .. ఏమో ... తెలియదు!
ధిషణాహంకారం అలంకారంగా శోభిల్లిన సుప్రసిద్ధ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి వద్దకు ఒక సాహిత్యాభిమాని వచ్చి .. మొన్నీ మధ్య ఫలానా సంస్థ వారు మీకూ, గుర్రం జాషువా గారికి కలిపి సన్మానం చేసారట కదా! .. అన్నాడట.
విశ్వనాథ వారు దానికి, తన సహజ ధోరణిలో .. "ఏం చేస్తాం? ఆ సంస్థ వారు గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కట్టారు." అని సమాధాన మిచ్చారట.
ఆ సాహిత్యాభిమాని అంతటితో ఆగక, మహాకవి గుర్రం జాషువా గారి వద్దకు చేరి ఈ విషయాన్ని అంటించాడు.
అప్పుడు గుర్రం జాషువా గారు "నేనయితే "గుర్రం"! మిగితాది ఎవరో మీరే చూసుకోండి." అన్నారట చమత్కారంగా తన ప్రతిస్పందనను తెలుపుతూ.
దీనికి మరో కొసమెరుపు ఉంది. ఆ సాహిత్యాభిమాని మళ్ళీ విశ్వనాథ వారికి ఈ విషయం చెప్పారట. దానికి ఆ మహానుభావుడు ఏమాత్రం నొచ్చుకోకుండా .. "ఏముంది!
నేను‌ అందరినీ తిడుతుంటాను. వాడు నన్ను తిట్టాడు." అన్నారట.
మహా కవుల అహంకార ధోరణులు కూడా ఆహ్లాదకరంగానే ఉంటాయి మరి!