30, ఆగస్టు 2011, మంగళవారం

ఈనాటి ’ఈనాడు’ లో...

మహాకవి, ’అభినవ పోతన’ బిరుదాంకితులు కీ.శే. వానమామలై వరదాచార్యుల శత జయంత్యుత్సవాల ప్రారంభ సభ వివరాలను ఈనాటి ’ఈనాడు’ దిన పత్రికలో ప్రచురించారు. రేపు (31 ఆగస్ట్ 2011) సాయంత్రం 6 గం.లకు ’రవీంద్ర భారతి’ (హైదరాబాదు)లో జరిగే ఈ కార్యక్రమానికి జంట నగరాలలోని సాహిత్యాభిమానులంతా విచ్చేసి, జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

22, ఆగస్టు 2011, సోమవారం

sarasa sallaapamu - 16



1953. అక్కినేని నటించిన 'దేవదాసు' విడుదలై, ఆ చిత్రంలోని పాటలు మారుమ్రోగుతున్నాయి. ఆ చిత్రానికి మాటలు, పాటలు రచించిన సముద్రాల రాఘవాచార్య చెన్నపట్నంలో ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళడానికి రిక్షా ఎక్కారు. ఆ రిక్షా కార్మికుడు అయ్యవారిని గుర్తించి రిక్షా తొక్కుతున్నంత సేపు ఆ చిత్రంలోని మాటలు, పాటల గురించి ఒకటే పొగుడుతూ ఉన్నాడు. రిక్షా దిగుతున్న సముద్రాల వారితో ఆ రిక్షా కార్మికుడు " అన్నీ బాగా అర్థమయ్యాయి గాని - ఆ 'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్' అన్న పాటే సరిగా అర్థం కాలేదు బాబయ్య - ఆ పాట అర్థం ఏంటండి? " అని అడిగాడు. ఎంతో తాత్త్విక దృష్టితో వ్రాసిన ఆ పాటకు అర్థం వివరించే ఓపిక, సమయం లేకో, లేక ఆ వివరణను అందుకొనే స్థాయి వాడికి లేదనుకొన్నారో గాని, ఆచార్యుల వారు నవ్వుతూ - " తాగుబోతు పాడే పాటకు అర్థమేముంటుందిరా అబ్బీ!" అంటూ వాడి చేతిలో డబ్బులు పెట్టి, ఇంటిలోకి వెళ్ళిపోయారు.

18, ఆగస్టు 2011, గురువారం

సరస సల్లాపము - 15




చాలా కాలం క్రితం ఆంధ్ర సచిత్ర వార పత్రికలో చదివిన జ్ఞాపకం -
’భక్త కన్నప్ప’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కథానాయిక వాణిశ్రీ డైలాగ్ చెబుతున్నారు ...
" నా మావను బ్రతికించు సామీ! "
దర్శకులు బాపు మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ వంక చూసారు.
ముళ్ళపూడి వాణిశ్రీతో " చూడమ్మా! ’బ్రతుకు’ కాదు - ’బతుకు’ అనాలి." అన్నారు.
వాణిశ్రీ మళ్ళీ చెబుతూ - " నా మావను బ్రతికించు సామీ! " అన్నారు.
బాపు గారు -" ఇది గిరిజన కన్య పాత్ర కదా! ’బ్రతుకు’ అనకూడదు. ’బతుకు’ అనాలి " అని వివరించారు.
సరేనన్న వాణిశ్రీ మళ్ళీ యథాలాపంగా - " నా మావను బ్రతికించు సామీ! " అనేసారు.
వెంటనే బాపు గారు చిరాకుగా - " చూడమ్మా! ఆ 'బ్ర' తీసేయ్ " అన్నారట.
షూటింగ్ సిబ్బంది పగలబడి నవ్వకుండా ఎలా ఉండగలరు?

1, ఆగస్టు 2011, సోమవారం

సరస సల్లాపము - 14











మహాకవి శ్రీశ్రీ కి ప్రసిద్ధ కవి ఆరుద్ర వరుసకు మేనల్లుడవుతారు. ఆరుద్ర కొంత శ్రీశ్రీ ప్రభావంతోనే తొలి అడుగులు వేసారని చెప్పవచ్చు. ఆరుద్ర తొలి కావ్యాన్ని శ్రీశ్రీ మెచ్చుకొని ఎంతో ప్రోత్సహించారు. ’తెలంగాణ’ అని ఆరుద్ర పెట్టుకొన్న ఆ కావ్య శీర్షికను ’త్వమేవాహం’ గా మార్చింది కూడా శ్రీశ్రీ యే.

అయితే తరువాతి కాలంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ పైన ఆరుద్ర స్వతంత్ర భావజాలంతో ఎదిగారు.

అలవాటు ప్రకారం శ్రీశ్రీ అడపాదడపా ఇతర కవుల మీద విసుర్లు విసిరినట్టు ( పింగళి గారి సినిమా పాటను మార్చి " ఎంత ఘాటు ప్రేమయో ... ఇంత లేటు వయసులో ..." అనడం, "ప్రధాన మంత్రి కాగోరు - రబీంద్ర నాథ్ టాగోరు", "సినారె... మూసీ కినారె" అని ప్రాసలు ప్రయోగించడం వంటివి అన్న మాట) ఆరుద్ర పైనా విసిరే వారు.

ఇది తెలియని ఒక సాహితీ మిత్రుడు శ్రీశ్రీ తో " మీ శిష్యుడు ఆరుద్ర ... " అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే శ్రీశ్రీ గట్టిగా నవ్వి - " వాడు నా శిష్యుడు అంటే ... నేనొప్పుకోను. నేను వాడి గురువంటే వాడొప్పుకోడు." అన్నారు.