1, ఆగస్టు 2020, శనివారం

సాహితీ సల్లాపాలు - 3 (విన్నవి .. కన్నవి ...)

ఇది పండితులు చెప్పుకోగా విన్నది. ఎంత సత్యమో .. ఏమో ... తెలియదు!
ధిషణాహంకారం అలంకారంగా శోభిల్లిన సుప్రసిద్ధ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి వద్దకు ఒక సాహిత్యాభిమాని వచ్చి .. మొన్నీ మధ్య ఫలానా సంస్థ వారు మీకూ, గుర్రం జాషువా గారికి కలిపి సన్మానం చేసారట కదా! .. అన్నాడట.
విశ్వనాథ వారు దానికి, తన సహజ ధోరణిలో .. "ఏం చేస్తాం? ఆ సంస్థ వారు గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కట్టారు." అని సమాధాన మిచ్చారట.
ఆ సాహిత్యాభిమాని అంతటితో ఆగక, మహాకవి గుర్రం జాషువా గారి వద్దకు చేరి ఈ విషయాన్ని అంటించాడు.
అప్పుడు గుర్రం జాషువా గారు "నేనయితే "గుర్రం"! మిగితాది ఎవరో మీరే చూసుకోండి." అన్నారట చమత్కారంగా తన ప్రతిస్పందనను తెలుపుతూ.
దీనికి మరో కొసమెరుపు ఉంది. ఆ సాహిత్యాభిమాని మళ్ళీ విశ్వనాథ వారికి ఈ విషయం చెప్పారట. దానికి ఆ మహానుభావుడు ఏమాత్రం నొచ్చుకోకుండా .. "ఏముంది!
నేను‌ అందరినీ తిడుతుంటాను. వాడు నన్ను తిట్టాడు." అన్నారట.
మహా కవుల అహంకార ధోరణులు కూడా ఆహ్లాదకరంగానే ఉంటాయి మరి!


6, మే 2020, బుధవారం

సాహితీ సల్లాపాలు - 2 (విన్నవి .. కన్నవి ...)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది 'కరెంట్' కోతల కాలం.‌ ఒక సభలో మహాకవి డా. సి. నారాయణ రెడ్డి గారు ధారాళంగా ప్రసంగిస్తున్నారు. సడెన్ గా కరెంట్ పోయింది. మైక్ పని చేయడం‌ ఆగిపోయింది. ఆయన ప్రసంగించడం ఆపుచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాసేపటికి, మళ్ళీ కరెంట్ వచ్చింది. నారాయణ రెడ్డి గారు తన ప్రసంగాన్ని పునఃప్రారంభిస్తూ - "ఈ రోజుల్లో సభలలో ప్రసంగించాలంటే .. విద్వత్ సహకారం ఉంటే సరిపోదు ... విద్యుత్ సహకారం కూడ కావాలి" అన్నారు. శ్రోతలు ఒక్కపెట్టున కరతాళ ధ్వనులను వినిపించారు.


30, ఏప్రిల్ 2020, గురువారం

నండూరి రామకృష్ణమాచార్యులు గారి శత జయంతి

"కరోనా" సమస్య లేకపోతే ... 27 ఏప్రిల్ 2020  నుండి 29 ఏప్రిల్ 2020 వరకు 3 రోజులపాటు మా గురువు గారు, మహాకవి
డా. నండూరి రామకృష్ణమాచార్యులు గారి శత జయంతి ఉత్సవాలను తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించాలని భావించాం.
గురువు గారి మహోన్నత వ్యక్తిత్వంపై పద్య కవి సమ్మేళనం, గురువు గారి సాహిత్య విశ్లేషణలతో కూడిన సమావేశాలు, గురువుగారి స్మారక పురస్కారాల ప్రదానాలతోబాటు గురువు గారు రచించిన "జ్యోత్స్నాభిసారిక" నృత్య రూపక ప్రదర్శన వంటి అనేక కార్యక్రమాలను ఇరు తెలుగు రాష్ట్రాలలోని ఎందరో లబ్ధ ప్రతిష్ఠ సారస్వత మూర్తుల సమక్షంలో గురువు గారి అభిమానులు, శిష్యులు, బంధువులు, కుటుంబ సభ్యుల సహకారంతో  నిర్వహించాలని ప్రణాళికను రచించాం.
కాని మేమొకటి తలిస్తే, భగవంతుడు మరొకటి తలచాడు.
ఆ కార్యక్రమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నందుకు విచారిస్తున్నాం.

ఎవ్వాని భావాల కివ్వేళయే గాక
    భావియున్ తల వంచి ప్రణతు లిడును -
ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై
    ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
     నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
     దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -

అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య  సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!

(29/04/2020 నాడు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారి శత జయంతి సందర్భంగా ఆ మహాకవి దివ్య స్మృతికి ప్రణమిల్లుతూ ...)

- డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి,
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం,
హైదరాబాదు.

10, మార్చి 2020, మంగళవారం

సాహితీ సల్లాపాలు - 1 (విన్నవి .. కన్నవి ...)


"ఆంధ్ర కల్హణ" బిరుదాంచితులు, మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఒకనాడు ఆయన శిష్యుని ఇంటికి వెళ్ళారు. ఆ శిష్యుడు సాదరంగా ఆహ్వానించి, కాసేపు ముచ్చటించిన తరువాత, "ఈ మధ్య రిఫ్రిజిరేటర్ కొన్నాం గురువు గారు! చూడండి." అంటూ క్రొత్తగా కొన్న రిఫ్రిజిరేటర్ ను చూపాడు. శాస్త్రి గారు ఆ రిఫ్రిజిరేటర్ ను పరిశీలిస్తూ, మెల్లగా దాని డోరును తెరిచే సరికి, దాని నిండా బీరు బాటిల్స్ కనిపించాయి. అప్పుడు శాస్త్రి గారు "ఇది రిఫ్రిజిరేటరా? లేక 'బీరు'వానా?" అని విసుక్కొన్నారు. పాపం! ఆ శిష్యుని మొహం మాడిపోయింది.

1, మే 2019, బుధవారం

గురువు గారి 99వ జయంతి సభ

మా గురువు గారి 99వ జయంతి సభలో నేను రచించిన "సాహితీ సల్లాపాలు" గ్రంథావిష్కరణం,
శ్రీ కె. సాగరరావు గారికి అంకితోత్సవంలతోబాటు, ప్రముఖ సాహితీవేత్త, "తెలుగు అకాడమి" పూర్వ సంచాలకులు డా. వెల్చాల కొండలరావు గారికి నండూరి వారి స్మారక పురస్కార ప్రదానం జరిగాయి. ఆ సభా విశేషాలు మీ కోసం ...

    - డా. ఆచార్య ఫణీంద్ర


19, మే 2018, శనివారం

గురువు గారి 98వ జయంతి సభా విశేషాలు

గురువు గారి 98వ జయంతి సభా విశేషాలు :

29 ఏప్రిల్ 2018 నాడు శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన "మహాకవి నండూరి రామకృష్ణమాచార్య జయంతి మహోత్సవ" సభా విశేషాలను, వివిధ పత్రికలలో  ప్రచురించిన అ యా భాగాలను దర్శించండి ...
సభాధ్యక్షులు : డా. రాపాక ఏకాంబరాచార్య గారు
(ప్రసిద్ధ సాహితీ పరిశోధకులు)
ముఖ్య అతిథి : శ్రీ దేవులపల్లి ప్రభాకరరావు గారు (తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు)
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పురస్కార స్వీకర్త : ఆచార్య ఎస్. వి. రామారావు గారు (సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు)

విశేష మేమిటంటే ... నన్ను కవిగా తీర్చి దిద్దిన మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి పేరిట ప్రదానం చేసిన పురస్కారం స్వీకరించింది నా మరొక గురువు గారు ఆచార్య ఎస్వీ. రామారావు గారు ( నా పి.హెచ్.డి. పర్యవేక్షకులు)
- డా. ఆచార్య ఫణీంద్ర








17, ఆగస్టు 2017, గురువారం

"నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం"

మా గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్య దివంగతులయ్యాక, వారి పేర అంతకు ముందే ఏర్పాటు చేయబడిన "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" ద్వారా 2004 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ సాహితీమూర్తికి "నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం" ప్రదానం చేయబడుతూ ఉంది. ఆ వివరాలు సాహిత్యాభిమానుల కోసం ...

- డా. ఆచార్య ఫణీంద్ర

   ప్రధాన కార్యదర్శి, 

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం 

  హైదరాబాద్. 



















---------------------------------------------------------------------------------------------

2004   డా. ఆశావాది ప్రకాశరావు, ప్రముఖ కవి, అవధాని.

2005   శ్రీ శిష్ట్లా వెంకటరావు, పద్య విద్యా ప్రచారకులు.

2006   డా. రాపాక ఏకాంబరాచార్య, అవధాన విద్యా పరిశోధకులు.

2007   డా. మల్లెమాల, ప్రముఖ కవి, సినీ నిర్మాత.

2008   ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం, ప్రముఖ కవి, భూభౌతిక శాస్త్రవేత్త.

2009   శ్రీ ముదివర్తి కొండమాచార్యులు, ప్రముఖ కవి.

2010   శ్రీ నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యులు, ప్రముఖ కవి.

2011   డా. తిరుమల శ్రీనివాసాచార్య, ప్రముఖ కవి.

2012   శ్రీ దుగ్గిరాల రామారావు, ప్రముఖ కవి.

2013   డా. మేడసాని మోహన్, ప్రముఖ అవధాని.

2014   ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ప్రముఖ కవి, విశ్వవిద్యాలయాచార్యులు.

2015   డా. జె. బాపురెడ్డి, ప్రముఖ కవి, ఐ.ఏ.యస్. అధికారి.

2016   శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరరసమ్మ, ప్రముఖ కవయిత్రి.

2017   శ్రీ డి. రంగారావు, ప్రముఖ ఆంగ్ల రచయిత, అనువాదకులు.

---------------------------------------------------------------------------------------------