తెలుగు సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఫిబ్రవరి 2012, సోమవారం

హాలాహల పానం


------------------------------------------------------------------------------
సురాసురుల్ చని, ''పాలవెల్లి మథింప హాలాహలంబు జనించె, ప్రాణి సందోహమున్ బ్రదికింపవే ఈశ్వరా!'' అని పరమేశుని ప్రార్థించగా -
ఆ భక్త రక్షకుడు పార్వతీదేవితో

''శిక్షింతు హాలహలమును,
భక్షింతును మధుర సూక్ష్మ ఫల రసము క్రియన్;
రక్షింతు బ్రాణికోట్లను;
వీక్షింపుము నీవు నేడు వికచాబ్జ ముఖీ!'' యనెను.

అప్పుడు

'' మ్రింగెడు వాడు విభుండని,
మ్రింగెడిదియు గరళమనియు, మేలని ప్రజకున్,
మ్రింగుమనె సర్వ మంగళ -
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!

తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీర రవంబుతో శివుడు - “లోక ద్రోహి! హుం! పోకు ర“
మ్మని కెంగేల దెమల్చి కూర్చి, కడిగా నంకించి, జంబూఫలం
బన సర్వంకషమున్ మహా విషము నాహారించె హేలాగతిన్!

కదలం బారవు పాప పేరు, లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు, నేత్రంబులు నెర్ర గావు, నిజ జూటా చంద్రుడుం గందడున్,
వదనాంభోజము వాడ, దా విషము నాహ్వానించుచో - డాయుచో -
బదిలుండై కడి సేయుచో - దిగుచుచో - భక్షించుచో - మ్రింగుచోన్ -

ఉదరము లోకంబులకును
సదనం బగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం
గుదురుకొన గంఠ బిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫల రసము క్రియన్!
---------------------------------------------------

ఈ ఘట్టాన్ని ఇంతకన్నా భావుకతతో, ఇంతకన్నా హృద్యంగా ఎవరైనా విరచించగలరా?
బమ్మెర పోతరాజుకు జేజేలు!
అందరికి ‘శివరాత్రి‘ పర్వదిన శుభాకాంక్షలు!

4, ఫిబ్రవరి 2012, శనివారం

నా స్మృతి పథంలో ..

[మా గురుదేవులు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారు తమ ఆత్మకథలో వ్రాసుకొన్న విషయం ఇది. చదివి ఆయన పద్య కవితా పారమ్యాన్ని గ్రహించి ఆనందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర ]




ఒకసారి అమలాపురంలో అష్టావధానం చేసేటప్పుడు నన్ను పృచ్ఛకుడు వేసిన ప్రశ్న.
" అవధాని గారూ! మీ స్మృతిపథాన తొలి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని పద్యంగా చెప్పండి. "
అది గడ్డు ప్రశ్న. కాని అది అవధాన సభ. కోరినది చెప్పక తప్పదు. అందుకే అప్పటికప్పుడు కొంటెగా ఒక సన్నివేశాన్ని కల్పించి పద్యం చెప్పాను.

" పాటలు పాడి నన్ను పసి బాబును ఊయలలోన ఊచుచున్
ఆటలు నేర్పు దాదిని రహస్యముగా పొదరింటి లోనికిన్
పైట చెరంగు బట్టి పరవాడెవడో తరలించు దృశ్యమున్
మాటలు వచ్చినంతటనె మాతకు చెప్పదలంచినాడనే! "

ఆ పృచ్ఛకుడు అన్నాడు. " అవధాని గారూ! నేను కోరినది అతిశయోక్తి లేని అచ్చమైన సత్యాన్ని. అదే ’ఉత్పలమాల’లో అదే ’ట’కార ప్రాసతో మీ జీవన స్మృతిపథంలోని తొలి సన్నివేశాన్ని ఉటంకిస్తూ మరో పద్యం చెప్పండి. "
అప్పుడు నేను ఆశువుగా చెప్పిన పద్యం -

" స్ఫోటక బాధచే ఒడలు సోలి పరుంటిని తల్లి ప్రక్కలో -
మాటికి మాటికిన్ మరల మంచముపై కెగబ్రాకు తేలు నన్
వ్రేటును వేయకుండ తన వ్రేళులతో విదలించి, ఎన్నియో
కాటులు తిన్న తల్లి కృప - కారణ జన్ముడనై తరించెదన్! "

ఆ సత్యం సభను మిక్కిలి ఆకర్షించింది. తల ఊపుతూ ఒక సదస్యుడు లేచి తన చేతి ఉంగరం నా చేతికి తొడిగాడు హర్షధ్వానాల మధ్య.
---***---

15, జూన్ 2009, సోమవారం

"ఆణిముత్యం" ... జూన్ 2009

"కుమిలి క్రుళ్ళుచు , నిరుపేద గుడిసె లెల్ల
నేడు కంపు గొట్టుచునుండు నిజము ; కాని
అద్యతన నాగరక హృదయాల కంటె
ఎంత పరిశుభ్రమైనవో ఎంచి చూడ !"


మా గురువు గారు డా || నండూరి రామకృష్ణమాచార్య రచించిన పద్యం ఇది.
నాగరకత పేర పతనమవుతున్న మనుషుల హృదయాల కంటె పేదరికంతో
క్రుళ్ళి ఉన్న slum areas ఎంతో పరిశుభ్రమైనవని ఆచార్యుల వారు ఈ పద్యం
ద్వారా తెలియజెప్పారు. ఎంత చక్కని భావన ! ఎంతటి అభ్యుదయం !

10, జూన్ 2009, బుధవారం

సమస్యను పరిష్కరించండి ... (జూన్ 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

"కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే!"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 జూన్ 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)