25, జులై 2023, మంగళవారం

మా గురువుగారి 103 వ జయంతి సభ వివరాలు వార్తా పత్రికలలో ...

మా గురువుగారు స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్య 103 వ జయంతి సభ వివరాలు వివిధ వార్తా పత్రికలలో ...   

                   - డా. ఆచార్య ఫణీంద్ర

                      ప్రధాన కార్యదర్శి

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం










డా.నండూరి రామకృష్ణమాచార్య గారి 103వ జయంతి సభ

నడిచే పద్యంగా కీర్తి గాంచిన స్వర్గీయ డా.నండూరి రామకృష్ణమాచార్య గారి 103వ జయంతి సభ ఏప్రిల్ 29, 2023 (శనివారం) నాడు సాయంత్రం నగరంలోని "శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం"లో ఘనంగా నిర్వహించబడింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణా చారి గారు తమ సందేశంలో - "మహాకవి నండూరి వారు భాషామతల్లికి చేసిన సేవలు శ్లాఘనీయం" అన్నారు. "దేశభాషలందు తెలుగు లెస్స" అని ఉటంకించినవారు శ్రీనాథుడు, శ్రీ కృష్ణ దేవరాయలు తరువాత మళ్ళీ నండూరి వారే అన్నారు. నండూరి  రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం పక్షాన అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ సాగర్ రావు గారు, డా.ఆచార్య ఫణీంద్ర గారు మున్ముందు కూడా ఈ జయంతి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆ మహాకవి పేరిట ఇచ్చే ఈ పురస్కారం ఈ సంవత్సరం కవి శ్రీ రసరాజు గారికి ఇవ్వడం సముచితమన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ఆచార్య టి.గౌరీ శంకర్ గారు మాట్లాడుతూ, "నండూరి వారు గతించిన తరువాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి వారిని తలచుకోవడం స్ఫూర్తి దాయకం" అన్నారు. వారు గొప్ప కవి, రచయిత, పరిశోధకులు మాత్రమే కాకుండా పది సంవత్సరాలకు పైగా అవధానాలు కూడా చేశారని కొనియాడారు. నిమ్న వర్గాలకు చెందిన వారిని కూడా శిష్యులుగా స్వీకరించి తనంతటి వాళ్ళను చేశారన్నారు.

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం అధ్యక్షులు సాగర్ రావు గారు మాట్లాడుతూ నండూరి వారు వారి రచనా ప్రచారం పరంపరగా కొనసాగించ వలసిందిగా ఆదేశించారన్నారు.

పురస్కార స్వీకర్త రసరాజు గారు హర్షం వ్యక్తం చేశారు. అనేక కోణాల్లో నండూరి వారి కవితా శక్తిని ప్రశంసించారు.

విశిష్ట అతిథి జి.వసుంధర గారు భాషకు పట్టం కట్టాల్సిన అవసరముందని,అందుకు పద్యం అందరికీ చేరువ కావాలని అన్నారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య మసన చెన్నప్ప గారు అతి సాధారణంగా ఉంటూ అసాధారణమైన ప్రతిభ సొంతం చేసుకున్న వారు నండూరి వారు అన్నారు. "పీఠాలు కాదు, అధ్యాపకుల పాఠాలు శాశ్వతం" అన్నారు.

మరో గౌరవ అతిథిగా విచ్చేసిన డా.చిల్లర భవానీ దేవి గారు నండూరి వారు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘ అధ్యక్షులుగా చేసిన భాషా సేవ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ప్రత్యేకించి తెలుగు భాషలో సంతకాలు, సెలవు దరఖాస్తులు, తెలుగులో ముద్రణ వంటివి వారి కృషి వల్లేనన్నారు. సంచలనం సృష్టించిన వారి రచన "శీర్ణ మేఖల" గురించి, స్త్రీ శక్తి గురించి వారు వ్రాసిన కవితల గురించి ప్రస్తావన చేశారు.

నండూరి వారి జ్యేష్ఠ పుత్రులు ఆత్మకూరి గాంధీ గారు నండూరి వారి చారిత్రక పరిశోధనా దృక్పథం గురించి, వివిధ భాషల్లో వారి రచనల గురించి, వారి గాంధేయవాదాన్ని గురించి అనేక విషయాలు ప్రస్తుతించారు.

ప్రారంభంలో ఉదయ్ ముద్గల్ గారు నండూరి వారి పద్యాలను హృద్యంగా ఆలపించారు.

ఈ సభ నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర గారు మరియు నవ్య సాహితీ సమితి సమన్వయ కర్త శ్రీ వేమరాజు విజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో నండూరి వారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు, సాహితీ ప్రియులైన శ్రోతల సమక్షంలో వైభవంగా జరిగింది.

డా.ఆచార్య ఫణీంద్ర గారి ప్రార్థనతో ప్రారంభమైన ఈ సభ ప్రారంభంలో నా

స్వాగత వచనాలతో కొనసాగి, చివరలో నా వందన సమర్పణతో పరిసమాప్తమయింది.

                - మంకాల లక్ష్మీ మానస

         (కార్యదర్శి, నవ్య సాహితీ సమితి)