29, నవంబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( నవంబరు 2009 )



"అరుగుదెంచి ఎపుడొ అవకాశ మొకమారు
ద్వారము కడ నిల్చి తలుపు తట్టు -
తత్క్షణమ్ము వెడలి తలుపు తీయనియెడన్
మరలి పోవు నద్ది - మరల రాదు!"


ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన సందేశాత్మకమైన పద్యాలలో ఒకటి. ఆణిముత్యంలాంటి ఈ పద్యానికి వ్యాఖ్యానం అవసరం లేదని భావిస్తాను. అందరూ ( ముఖ్యంగా యువతరం )
అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
- డా.ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

17, నవంబర్ 2009, మంగళవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( నవంబరు 2009 )



'చంపక మాల' పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 11 వ అక్షరం.
మొన్ననే [ నవంబరు 14 నాడు ] 'నెహ్రు జయంతి' జరుపుకొన్నాం.
ఇప్పుడు మన ప్రథమ ప్రధాన మంత్రి 'జవహరు లాల్ నెహ్రు' పై 'చంపక మాల' పద్యం వ్రాయాలనుకోండి. ముందుగా ఆయనను తలచుకోగానే మనకేం గుర్తొస్తుంది ? " ఆయన మన జాతికి రత్నం వంటి వాడు " అనాలనుకోండి. ఇప్పుడా విషయం పద్యంలో చెప్పుదాం.
'చంపక మాల' ట్యూన్ ఏంటి ?
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇప్పుడు పైన అనుకొన్న భావం ట్యూన్ లో ఇలా చెప్పవచ్చు.
తననన : జవహరు
తాననా : లాలు నె ( తరువాత ’ హ్రు ’ వస్తుంది కాబట్టి, ’ నె ’ దీర్ఘాక్షరంతో సమాన మవుతుంది. )
తనన : హ్రు ( తనన లో "త" వరకే నింపాము. ఇంకా " నన " మిగిలి ఉంది. )
ఇంత వరకు వ్రాసిందేంటి ?
" జవహరు లాలు నెహ్రు ..."
ముందు ఆయన పేరయితే వచ్చింది. ఇంకా ...
తనన : హ్రు ... మన
తానన : జాతికి ( ఇక్కడ ’ జా ’ 11 వ అక్షరం కాబట్టి, మొదటి అక్షరమైన ’ జ ’ కు యతి కుదిరింది. )
తానన : రత్నము
తాన : వంటి
తాననా : వాడు ... ( ఇంకా ఒక దీర్ఘాక్షరం మిగిలి ఉంది. )
ఇప్పుడు మళ్ళీ పద్యం చూదాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడు ... "
ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? ... ఆయన మన ప్రథమ ప్రధానిగా నవ శకానికి నాంది పలికాడు. అయితే పద్యం రెండో పాదంలోకి వెళుతోంది కాబట్టి ప్రాసాక్షరం సరి పోయేలా పదం వేయాలి. " నై నవయుగ " అంటే, " వ " ప్రాసాక్షరంగా పడి సరిపోతుంది. ఎలాగో చూడండి.
తాననా : వాడునై ( ఇక్కడికి మొదటి పాదం పూర్తయింది.)
మళ్ళీ ... రెండో పాదం ప్రారంభిస్తే ...
తననన : నవయుగ
తాననా : భారతా
తనన : వనికి
ఇప్పుడు పద్యం ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి ..."

ఇప్పుడు రాబోయే అక్షరం రెండో పాదంలో 11వ అక్షరం కాబట్టి మళ్ళీ యతి చూసుకోవాలి. రెండో పాదం " నవయుగ " అని ప్రారంభమైంది కాబట్టి " న " కు యతి వేయాలి. అలాగే వేద్దాం.
తానన : నాందిని
తానన : పల్కె ప్ర
తాన : ధాన
తాననా : మంత్రి గాన్ ! ( ఇక్కడికి రెండో పాదం కూడా పూర్తయింది )
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం _
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ ! "

నెహ్రూను గూర్చి ఇంకా ఏం చెప్పవచ్చో ఇలాగే ఆలోచిస్తూ మూడు , నాలుగు పాదాలను కూడా ఇలా పూర్తి చేయవచ్చు. ఆయన ఇంకా ఏం చేసాడు ? పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు, భారీ నీటి ప్రాజెక్టులను నెలకొల్పి దేశం ఉన్నతంగా ఎదగడానికి బాట వేసాడు.
తననన : వివిధ ప
తాననా : రిశ్రమల్
తనన : మరియు
తానన : వేల ’ టి. ( ఇక్కడ ’ వే ’ మీద 3వ పాదం మొదటి అక్షరమైన ’ వి ’ కి యతి కుదిరింది. )
తానన : ఎం.సి. ’ ల
తాన : భారి
తాననా : డాములన్ ( దీంతో మూడో పాదం అయిపోయింది. )
ఇక్ నాలుగో పాదం ...
తననన : యువత కు
తాననా : పాధికై
తనన : నిలిపి
తానన : ఉన్నతి ( ’ యు ’ కి, ’ ఉ ’ కి యతి - గమనించండి. )
తానన : నొందగ
తాన : బాట
తాననా : వేసెరా ! ( నాలుగో పాదం కూడా పూర్తయిపోయింది )
ఇప్పుడు మొత్తం పద్యాన్ని చూద్దాం ...

" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ !
వివిధ పరిశ్రమల్ మరియు వేల ’ టి.ఎం.సి. ’ ల భారి డాములన్
యువత కుపాధికై నిలిపి, ఉన్నతి నొందగ బాట వేసెరా ! "

చూసారా ? మన ప్రథమ ప్రధానిపై ఎంత చక్కని పద్యం రూపు దిద్దుకొందో ! ఇది నేను ఇప్పటికిప్పుడు పాఠం వ్రాస్తూ అల్లిన పద్యమే ! ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మీరు కూడా మీకిష్టమైన నాయకుని మీద లేక విషయం మీద, ఒక 'చంపక మాల' పద్యం వ్రాయండి ... వ్యాఖ్యగా ప్రచురించండి. తప్పులుంటే సరి దిద్దుతాను. అవసరమైతే సూచనలిస్తాను.

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

8, నవంబర్ 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... [ నవంబరు 2009 ]

గత నెల ఇచ్చిన సమస్య : " జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "

నెల రోజులకు పైగా వేచి చూసినా, ఒక్కరంటే ఒక్కరు దానిని పూరణ చేయక పోయేసరికి, కించిత్తు నిస్పృహతో నేనే దాన్ని పూరించాను.
నా పూరణ :
" ప్రళయోన్మాదము గల్గెనేమొ అకటా ! పైపైకి పొంగారగా
నల లువ్వెత్తుగ, ’ కృష్ణవేణి ’ నది వీరావేశమే పూనుచున్ -
విలయోత్పాతము జేసి ముంచినదిరా వేలాది గ్రామంబులన్ !
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


అయితే, చివరలో ’ హరి దోర్నాల ’ గారు మంచి పూరణను అందించి, చీకటిలో ఆనంద రేఖను వెలిగించారు.
ఆ కవి మిత్రుని పూరణ :
" జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


ఎప్పుడూ వెంటనే స్పందించే ’ కంది శంకరయ్య ’ గారికి మాతృ వియోగం కల్గడం బాధాకరం !
ఆ కవి వరేణ్యునికి ఈ టపా ద్వారా, మన బ్లాగు మిత్రులందరి తరుపున, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.



ఇక ఈ నెల సమస్య : " ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్ ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

20, అక్టోబర్ 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి ... ( అక్టోబరు 2009 )

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.

ఈ మాసం సమస్య :
" జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

18, అక్టోబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( అక్టోబర్ 2009 )

" లేడు దేవుడనెడు వాడెచ్చటను లేడు "
- అనుచు నొక్కి పలికె నాస్తికుండు !
" లేడు ధరణి మీద లేడురా కంసాలి "
- పసిడి ఉంగరమ్ము బదులు పలికె !!



ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన తాత్త్వికపరమైన పద్యాలలో ఒక ఆణిముత్యం.
" దేవుడున్నాడా? లేడా ? " అన్నది యుగయుగాలుగా సాగుతున్న మీమాంస. ఈ తర్కం అంతు లేకుండా తరతరాలుగా మానవులు చేస్తూనే ఉన్నారు. కాని ఏ అతీత శక్తి లేకుండా ఈ సృష్టి, ఈ మానవుడు ... ఇంత క్రమ పద్ధతిలో ఎలా నిర్మించ బడుతున్నాయి? ఒక కంసాలి బంగారు ఉంగరాన్ని తయారు చేస్తాడు. ఎవరూ చేయకుండా ఉంగరం తయారు కాదు కదా! కాని, ఆ ఉంగరానికి కంసాలి అనేవాడు ఉన్నాడని రూఢిగా తెలిసే అవకాశం లేదు. అది తన అస్థిత్వం ఒక సహజ పరిణామమనో, లేక ఉంగరాల మనశ్శక్తి ఫలితమనో భావించే అవకాశమూ లేక పోలేదు.ఆ ఉంగరాలలో కొన్ని (ఒక వేళ వాదించే శక్తి ఉంటే), " కంసాలి అనేవాడు లేడు " అని వాదించే అవకాశం ఉండదంటారా? మానవులు అంతే!కాని వైజ్ఞానికంగా ఆలోచించినా, " ఎటువంటి బాహ్య శక్తి ప్రమేయం లేకుండా, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనికి గాని, గమన స్థితిలోని వస్తువు నిశ్చల స్థితిలోనికి గాని మారవు " అన్న న్యూటన్ గమన సూత్రాలలో రెండవ సూత్రాన్ని నమ్మితే - ’ఉత్పత్తి’ అనే మార్పుకు కారణభూతమయ్యే ఆ బాహ్య శక్తి ( అదే అతీత శక్తి లేక దైవ శక్తి ) ఉందన్న విషయం ఒప్పుకోక తప్పదు. ఉంగరానికి కంసాలి ఉన్నాడన్న విషయం నిరూపించే శక్తి లేనట్టే, మానవునికి దేవుడున్నాడన్న విషయం నిరూపించే శక్తి లేక పోవచ్చు. అంత మాత్రాన కంసాలి లేడని, దేవుడూ లేడని చెప్పలేము కదా! అందుకే ఆధునిక కాలంలో ఉన్నత విద్యల నభ్యసించి, మేధావులైన వివేకానందుడు,అరవిందుని వంటి వారు ఆస్తికులై, దైవ శక్తి ప్రచారంలో తమ జీవితాలను సార్థకం చేసుకొన్నారు.
ఇంత చిన్న పద్యంలో ఇంత విస్తార విషయాన్ని ఇలా అందించడం నిజంగా విశేషం. పైగా, తరతరాలుగా కొనసాగుతున్న తర్కానికి ఇంత ’కన్విన్సింగ్’గా సమాధానం అందించడం గురువుగారి అసమాన ప్రజ్ఞా ధురీణతకు తార్కాణం.

12, అక్టోబర్ 2009, సోమవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( అక్టోబరు 2009 )

గత మాసం ’ చంపక మాల ’ పద్యం గురించి తెలుసుకొన్నాం కదా !
అదే ఛందస్సుకు మరో ఉదాహరణను చూద్దాం.
" అది రమణీయ పుష్పవన; మా వనమందొక మేడ; మేడపై
అదియొక మారుమూల గది; ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక - పోలిక రాచపిల్ల - జం
కొదవెడు కాళ్ళ తోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగాన్ ! "

’ చంపక మాల ’ ట్యూన్ -
" తననన తాననా తనన తానన తానన తాన తాననా " అని చెప్పుకొన్నాం. అలాగే ప్రతిపాదంలో 11 వ అక్షరం యతి స్థానం. ప్రాస నియమం ఉంటుంది. పై పద్యంలో ప్రతి పాదంలో ప్రాసాక్షరం ( 2 వ అక్షరం ) - ’ ది ’, ’ ది ’, ’ దు ’ , ’ ద ’ ... ఇలా ’ ద ’ అనే హల్లుకు చెందిన గుణింతాక్షరాలు ఉన్నాయి - గమనించారి కదా !
ఇప్పుడు మొదటి పాదాన్ని ట్యూన్ తో పోల్చి చూద్దామా !
తననన : అది రమ
తాననా : ణీయ పు ( ఇక్కడ ’ పు ’ తరువాత ’ ష్ప ’ అన్న సంయుక్తాక్షరం ఉండడం వలన ’ పు ’ దీర్ఘాక్షరంతో సమానమవుతుంది. )
తనన : ష్ప వన
తానన : మా వన
తానన : మందొక
తాన : మేడ
తాననా : మేడపై
ఇక యతి - మొదటి అక్షరమయిన ’ అ ’ కు, 11 వ అక్షరమయిన ’ మా ’ లోని
’ ఆ ’ ( ము + ఆ ) కు యతి కుదిరింది.
ఇలా అన్ని పాదాలను పోల్చి చూడండి.
పద్యం వ్రాయాలన్న తపన గల ఔత్సాహికులు పై విషయాన్ని అవగాహన చేసుకొని, తొలి ప్రయత్నం చేసి వ్రాసిన పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందజేస్తే నా కృషి ఫలించినట్టుగా భావిస్తాను.

23, సెప్టెంబర్ 2009, బుధవారం

ఆణిముత్యం ( సెప్టెంబరు 2009 )

విత్తనమ్మునౌచు వృక్షమ్ముగా మారి
ఆవరింపదలతు నాకసమును;
వీలు కాని యెడల - వేరు విత్తున కేను
ఎరువునగుట కైన ఇచ్చగింతు !


ఇది గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్య రచించిన ఆణిముత్యాల్లాంటి పద్యాలలో ఒకటి.
తానొక విత్తనం. పెద్ద వృక్షమై ఆకాశమంతా విస్తరించాలని తన ఆశ. అది సహజం కూడా! నిజానికి ప్రతి మనిషి కూడ అలాంటి ఆశ, ఆశయంతోనే ముందుకు సాగాలి. అలా ప్రతి వ్యక్తి కృషి చేస్తేనే, ఆ వ్యక్తితోబాటు, ఈ సమాజమూ అభివృద్ధి చెందుతుంది.
కాని ఆ తరువాతి వాక్యమే, గురువుగారిలాంటి వారే అనగలరు. ఆ విత్తనం ఒక వేళ తాననుకొన్న ఆశయాన్ని నెరవేర్చుకోలేకపోతే ? వేరే విత్తనమైనా ఒక మహా వృక్షంగా ఎదిగేందుకు తాను ఎరువునవడానికైనా ఇష్టపడతాను - అంటారాయన. తానెదగక పోయినా ప్రక్కవాడు ఎదగడం చూచి ఓర్వలేని ఈ లోకంలో గురువుగారి భావన ఎంత ఉదాత్తంగా ఉంది ? ప్రతి మనిషి ఈ ఆదర్శాన్ని పాటిస్తే ఈ సమాజాభివృద్ధిని ఆపడం ఎవరి తరం ?

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

ఈ మాసం పద్య కవిత (సెప్టెంబరు 2009)

అవినీతి
రచన : డా. జె. బాపురెడ్డి, IAS (Retd.)

లేదు అవినీతి లేని తావేది ఇలను
కాని, మన ప్రియ భారత ఖండమందు -
దాని అవతారములు లెక్క లేని యన్ని !
పట్టుబడి, పట్టుబడనట్టి గుట్టులెన్నొ !!

అంతొ ఇంతయో తినకయే సంతకమ్ము
చేయు వారల సంఖ్య కాసింత యౌను !
ముందు ముందు ఆఫీసుల యందు - నీతి
మంతులగుపించు టది గొప్ప వింత యౌనొ !

రౌడీల రాజ్య మిదియని
రౌడీలే చాటుకొనగ, రక్షణ కొరకై
రౌడీల అండ చేరగ
దౌడులు తీసెదరొ ప్రజలు దయనీయముగాన్ !

తెలియక తప్పులు చేసిన
తెలుపుట సాధ్యమ్మె కాని, తెలిసి తెలిసియే
తెలిసిన తప్పులు చేసెడి
తెలివికి తెలుపునది చావు దెబ్బ యొకటియే !

చూడు ! చట్టాలు విలపించుచుండె - వాని
వంచనల, దూషణల, మాన భంగములకు
పాల్పడెడి దుర్మతుల పని బట్టనట్టి
సంఘమున తాము పుట్టిన శాపమునకు !

----- *** -----

12, సెప్టెంబర్ 2009, శనివారం

జంట నగరాల సాహిత్యాభిమానులకు ఆహ్వానం

ప్రాచీన కావ్య ప్రక్రియలలో ’ ఉదాహరణ కావ్యం ’ విశిష్టమైనది. అయితే ఇటీవల పద్య కవులు ఈ ప్రక్రియలో అరుదుగా రచనలు చేస్తున్నారు. ప్రముఖ కవి - ’ ప్రౌఢ పద్య కళానిధి ’ ఆచార్య వి.యల్.యస్. భీమ శంకరం గారు ఇప్పుడు ఒక ఉదాహరణ కావ్యాన్ని రచించారు. దాని పేరు - ’ శ్రీ దక్షారామ భీమేశ్వరోదాహరణ కావ్యము ’.
’ నవ్య సాహితీ సమితి ’, ’ వి.యల్.యస్. సాహిత్య, వైజ్ఞానిక పీఠం ’ సంయుక్తాధ్వర్యంలో ఆ గ్రంథావిష్కరణ సభను నిర్వహిస్తున్నాం.
16 సెప్టెంబరు 2009 నాడు సాయంత్రం 5 - 30 గం || లకు
అశోక్ నగర్ ’ నగర కేంద్ర గ్రంథాలయం ’ ( చిక్కడ పల్లి, హైదరాబాదు ) లో ఈ సభ జరుగుతుంది
జంట నగరాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులు, ముఖ్యంగా పద్య కవితాభిమానులంతా ఆ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

ఆహ్వాన పత్రం :

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( సెప్టెంబరు 2009 )

ఈ మాసం మనం మరో ఛందస్సులోకి ప్రవేశిద్దాం -
దాని పేరు :" చంపక మాల "
ఉత్పల మాలకు, దీనికి కొంచమే తేడా !
ఉత్పల మాల ట్యూన్ మీకు తెలుసు -

" తానన తాననా తనన తానన తానన తాన తాననా "

ఇక ఇప్పుడు నేర్చుకోబోయే " చంపక మాల " కు ట్యూన్ :

" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
( అంటే మొదట్లో ఒక దీర్ఘాక్షరం బదులు రెండు హ్రస్వాక్షరాలు వేయాలన్న మాట. )

ప్రారంభంలో ఒక అక్షరం పెరిగింది కాబట్టి యతి స్థానం ఒక అక్షరం ముందుకు జరుగుతుంది.
ఉత్పల మాలకు యతి 10 వ అక్షరమైతే, దీనికి 11 వ అక్షరం. ప్రాస నియమం ఎలాగూ ఉంటుంది కదా !
అంతే - నాలుగు పాదాలు ఒకే విధంగా వ్రాసుకు పోవడమే !

ఉదాహరణకు నన్నయ గారి పద్య మొకటి చూద్దాం -

నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత యొక బావి మేలు; మరి బావులు నూరిటి కంటె నొక్క స
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడగాన్ !


ఇందులో ఒక పాదాన్ని విడమరచి ట్యూన్ తో పోల్చి చూద్దాం -

తననన : నుత జల
తాననా : పూరితం
తనన : బులగు
తానన : నూతులు
తానన : నూరిటి
తాన : కంటె
తాననా : సూనృత*

( * ఇక్కడ ’ సూనృత ’ లోని చివరి అక్షరం ’ త ’ తరువాత, రెండవ పాదం మొదటి అక్షరం ’ వ్ర ’ సంయుక్తాక్షరం కాబట్టి, దాని ముందుండడం వలన ’ త ’ దీర్ఘాక్షర సమానమే అవుతుంది. ఆ విధంగా ’ తాననా ’ ట్యూన్ కి ’ సూనృత ’ సరిపోయింది. ఇలాంటివి ఇది వరకు కూడా చెప్పుకొన్నాం కదా ! )

ఇలాగే ఇదే ట్యూన్ లో మిగితా మూడు పాదాలను కూడా పోల్చి చూసుకోండి.
చంపక మాల పద్యం ట్యూన్ ని, పైన పేర్కొన్న నన్నయ గారి పద్య గమనాన్ని బాగా ఆకళించుకొని, ఆ పైన మీకు తోచిన భావాన్ని చంపక మాల పద్యంలో వ్రాసేందుకు అభ్యాసం చేయండి. పద్యాలను వ్యాఖ్యలుగా అందిస్తే తప్పొప్పులను సరిదిద్ది వివరిస్తాను. All the best !

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

9, సెప్టెంబర్ 2009, బుధవారం

ఇదండీ ఈయన గారి సంస్కారం !

తెలుగు బ్లాగు మిత్రులారా !
మీకు తెలుసు - ఈ బ్లాగు ద్వారా కొత్తగా పద్యాలు వ్రాయడంపై ఆసక్తి గల వారి కోసం, సులభంగా పద్యాలు వ్రాసే విధానం బోధిస్తూ, అభ్యాసం కొరకు సమస్యల నిచ్చి పూరించమని నేను కోరుతున్న సంగతి. ఆ పరంపరలో భాగంగా, ఈ మాసం, తెలుగు బ్లాగులను ప్రశంసిస్తూ పూరించమని, " బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా ! " అన్న సమస్య నిస్తే, మన కవి మిత్రులు తమకు తోచిన రీతిలో పూరణలను అందించారు. ఆ పూరణలను చూసి, ఎవరో ’ జల సూత్రం ’ వారట - బ్లాగు నిర్వాహకుడనైన నన్ను, పూరణలను చేసిన కవులను వెటకారం చేస్తూ ఇలా వ్యాఖ్య చేసారు -

[Jalasutram చెప్పారు...

అంతా బానే, అంతా బాగుంది కానీండి, మీ సమస్యా, దానికి తగిన పూరణలు. వందనం, అభివందనం, తకధిమితోం.

ఎందుకో చిలకమర్తివారి పద్యం ఒకటి గుర్తుకొస్తోంది.

తోటకూర దెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదురుగాను
క్రింద మంటబెట్ట వుడకకేంజేస్తుంది?
దాని కడుపుకాల ధరణిలోన

అని. అదండీ సంగతి. మరి వుంటాను. మళ్ళీ వస్తాను. ఈ మధ్య కవితలన్నీ " అద్భుతం " గా వుంటున్నాయి ఏమిటో ఈ మాయ.
September 9, 2009 6:01 AM ]

ఆ వ్యంగ్యానికి నేనూ వ్యంగ్యంగానే ఇలా సమాధానమిచ్చాను.

[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

అయ్యా ’ జలసూత్రం ’ గారూ !
అవును మరి ! మీకు ఒక చిన్న ’ సమస్యా పూరణం ’ లోనే
’ కాళిదాస కావ్య రసాలు ’, ’ చేమకూర చమత్కారాలు ’ పిండుకోవాలన్న అత్యాశ !
మాకంత పెద్ద ఆశలు లేవు మరి.
అసలే ఇంగ్లీషు మీడియం చదువులతో తెలుగు పద్యాలు వ్రాసే వారే కరువౌతుంటే, మీలాంటి పండితమ్మణ్యులు ఇలా బెదరగొడితే గాని, మీ తరువాతి తరంలో పద్యం నామ రూపాల్లేకుండా చేయ లేరు మరి !
కానీయండి ... ఇంకా విజృంభించండి.
ఎందుకంటే మీరాశించిన స్థాయి పద్య కవులను ఈనాటి ఇంగ్లీషు మీడియం విద్యార్థులనుండి తయారుచేయడం మీ కెలాగూ చేత కాదు.
రోడ్డెక్కితే గదా ఎత్తు పల్లాలలో డ్రైవ్ చేయడం ! రోడ్డే ఎక్కనివ్వకపోతే సరి !
ఏమంటారు ?
September 9, 2009 7:00 AM ]

[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

’ జల సూత్రం ’ వంశాంబుధీ సోమా !
అప్రతిమాన పండిత కవి భీమా !
అన్నట్టు ...
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
" కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ! "
" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ ! "
వంటి సమస్యలిచ్చినపుడు మీరెక్కడున్నారు స్వామీ ?
మీ పూరణలను మాకు కటాక్షించ లేదే !
సరే ! ఇప్పుడైనా ఈ సామాన్య సమస్యను అసామాన్యంగా పూరించి, మా బోంట్లకు వెలుగు చూపవచ్చు కదా !
September 9, 2009 7:21 AM ]

వ్యంగ్యంలో కూడా నా లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెబుతూ, ఈనాటి ఇంగ్లీష్ మీడియం చదువుల కాలంలో పద్య కవిత్వంపై ఆసక్తి గలవారిని ప్రోత్సహించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పాను.
ఇతరులపై అలవోకగా వ్యంగ్యాన్ని ఒలకబోసిన ’ జల సూత్రం ’ వారు తనపై వ్యంగ్యాన్ని ప్రయోగిస్తే మాత్రం ఓర్చుకోలేక పోయారు. పొంతన లేని ఉపమానంతో ఆయన ఆక్రోశాన్ని ఎలా వెళ్ళగ్రక్కారో చూడండి.

[Jalasutram చెప్పారు...

వెనకటికి ఒకాయన మాతాత కౌపీనం ఆకాశమంత వుందని అన్నాట్ట. అది విని తట్టుకోలేని ఇంకొకాయన ఒరే మా తాత కౌపీనం కొంచెం చిరిగితే మీ తాత కౌపీనం అతుకెయ్యటానికి పనికొచ్చింది అన్నాడత. అలాగున్నది మన "ఆవు" (కౌ) ల పరిస్థితి.వాచామగోచరంగా ఉంటున్నవి ఈ మధ్య కైతల్లన్నీ. ఆ రసమేమిటి, పాకమేంఇటి, భావమేమిటి, యతులేమిటి, ప్రాసలేమిటి, శబ్దరత్నాకరాలేమిటి - ఒహటా రెండా - వెయ్యితలల ఆదిశేషువే దిగిరావాలి కిందకు. ఇక నేను కపిత్వము చెప్పెదను అని ఎక్కడయినా చెపితినా మాష్టారు ? ఉమ్మెతకాయలు తిన్నవారు ఎక్కువవుతున్నారు ఆవుల(కౌ) లోకంలో అని దీనిభావం. ఆ పైన కాకులు ముట్టని ఉప్పు పిండి అదేనండీ ఉప్పుమాకు తీసిపోకుండా తెగ అల్లుతున్నారు అని వాదించటమే.

పొలములో నక్కలు కూసెగా
మనసులో భయమెంతో వేసెగా
పాలేరు యిట్టట్టె చూసెగా
గంగన్నా నీ ____ మోసెగా

లాగా ఉంటున్నవి మరి - ఏమి " చెప్పు "మందురు !
September 9, 2009 6:52 PM ]

ఇంతా చేసి ఈయన గారికి కవిత్వమే కాదు, కపిత్వం కూడా చేత కాదట. కాని కవులను మాత్రం ’ పశువులు ’ ( ఆవులు - ’ కౌ ’ లు ) అని తిడుతాడట. కవిత్వం నచ్చితే ప్రశంసించడం, నచ్చక పోతే సంస్కరించుకోవడానికి తగిన సలహాలివ్వడం, లేదంటే మిన్నకుండడం - రసజ్ఞుల సంస్కారం. అవేవీ చేత కాక పోయినా, " ఉమ్మెత్త కాయలు తిన్న వారు ", " కాకులు ముట్టిన ఉప్పు పిండి " అంటూ తిట్ల పురాణం మాత్రం ఈయనకు చేతనౌతుంది.
చివరలో " చెప్పు " ను గమనించారా ? - ఇదీ ఈయన గారి సంస్కారం ! నలుగురిలో ఈ కుసంస్కారిని ఎండగడుతూ
ఇదంతా టపాగా ఎందుకు అందిస్తున్నానంటే - నాతోబాటు నా ఈ బ్లాగులో అడుగు పెట్టిన నా అతిథులైన కవి మిత్రులను కూడా తిడుతుంటే, మిన్నకుండడం అమానుషం కాబట్టి.
- డా. ఆచార్య ఫణీంద్ర

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి ... ( సెప్టెంబరు 2009 )



'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా! "

ఇది ’ ఆట వెలది ’ పద్యంలో మొదటి లేక మూడవ పాదంగా ఇముడుతుంది.
తెలుగు బ్లాగులను ప్రశంసించేలా పై పాదాన్ని ప్రయోగిస్తూ ఒక ’ ఆట వెలది ’ పద్యాన్ని పూరించండి.
పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

3, సెప్టెంబర్ 2009, గురువారం

శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి ! శాంతి ! శాంతి !



మన దివంగత ప్రియ ముఖ్యమంత్రి వర్యు
డైన " రాజశేఖర రెడ్డి " ఆత్మ కగుత
శాంతి యని కోరుదము భగవంతు నింక -
శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి ! శాంతి ! శాంతి !

- డా. ఆచార్య ఫణీంద్ర

23, ఆగస్టు 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ... ( ఆగస్టు 2009 )

బాల గణేశునికి వందనం
( ఈ మాసం పద్య కవిత )
" అంకము జేరి శైలతనయా స్తన దుగ్ధము లాను వేళ, బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి, యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ ! "




ఇది ’ మను చరిత్రం ’ లో అల్లసాని పెద్దన కవి వ్రాసిన ప్రసిద్ధ గణేశ స్తుతి పద్యం.
అందరిలా మామూలుగా స్తుతిస్తే అది అల్లసాని వారి పద్యం ఎలా అవుతుంది ?
అందుకే పెద్దన కవి అందులో విశేషమైన భావుకతను జోడించి కమనీయమైన స్తుతి పద్యంగా తీర్చిదిద్దాడు.
ఇక ఆ పద్యంలోనారసి చూద్దాం -
బాల గణేశుడు పార్వతీ దేవి ఒడికి చేరి ఆమె పాలు త్రావుతూ, బాల్య చాపల్యంతో తన తొండంతో ఆమె మరొక చన్నును అందుకోబోయి, అదెక్కడుందో కనరాక, అడ్డుగా ఆమె మెడలో ఆభరణంగా ఉన్న నాగరాజును చూచి,"ఇదేమిటి - తామర తూడా?" అన్న అనుమానంతో తాకి చూచే గజాననుని తన ఇష్ట సిద్దికై కొలుస్తానంటాడు కవి.
ఎంత రమణీయమయిన భావన !
ఈ వినాయక చవితి పర్వదినం నాడు ఈ పద్యాన్ని పఠించిన వారందరికీ ఆ విఘ్ననాయకుని కరుణా కటాక్షం ప్రాప్తించి, అభీష్ట సిద్ధి కలుగు గాక !
- డా. ఆచార్య ఫణీంద్ర

15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !

విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగులీనుతున్న భారతీయులందరికీ
63వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !



అగ్ర భాగమ్ములో అమరి కాషాయంబు,
హరిత వర్ణ మమరి అడుగునందు,
చేరి రెంటి నడుమ శ్వేత వర్ణ, ’మశోక
చక్ర’ మమరి మధ్య చక్కగాను -
పాతాళమందుండి పైపైకి ఎగబ్రాకి
ఆకాశ హర్మ్యాల తాకునట్లు
నిలువెత్తు ధ్వజముపై నిలుచుండి నింగిలో
మన్ననల్ పొందెరా మన పతాక!

పూర్ణ విశ్వమందు పుడమి భారతి మిన్న -
దీటు లేదు భువిని దీని కేది! -
అన్న రీతి నెగిరె ఆకాశమందునన్
మూడు వన్నె లొలుకు ముద్దు జెండ!

9, ఆగస్టు 2009, ఆదివారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( ఆగస్టు 2009 )



’ ఉత్పలమాల ’ పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 10 వ అక్షరం.
ఇప్పుడొక భావాన్ని ఇస్తాను. దాన్ని ’ ఉత్పలమాల ’ పద్యంలో ఇమిడ్చే ప్రయత్నం చేయండి.
" పాండవులు కూడా సహోదరులే. పాపమని దయజూపి, వారితో యుద్ధమేదీ ఏర్పడవద్దని యెంచుతూ, ఏవో ఐదు ఊళ్ళు, అవీ ... ఎండిన భూములున్నవైనా, ఎందుకూ కొరగానివైనా, నీ గుండెను నిండు చేసుకొని దానం చేయ్ - ఓ సుయోధనా ! " అని శ్రీ కృష్ణుడు రాయబారంలో దుర్యోధనునితో అన్న మాటలను ’ ఉత్పలమాల ’ పద్యంలో పెట్టండి.
మీ అభ్యాస ఫలితంగా వచ్చిన పద్యాలను వ్యాఖ్యలుగా అందించండి. తప్పొప్పులను నేను తెలియజేసి సరిదిద్దగలను. ఇలా సన్నివేశ పరమైన అంశాలను పద్యాల్లో పెట్టగలిగితే, రేపు కావ్యాలను వ్రాయగలిగే శక్తి మీకు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ? ఉపక్రమించండి.

2, ఆగస్టు 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... (ఆగస్టు 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు ! "

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 ఆగస్టు 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

21, జులై 2009, మంగళవారం

ఈ మాసం పద్య కవిత ... ( జులై 2009 )


ఈ మాసం పద్య కవిత ... ( జులై 2009 )

మహాకవి డా || దాశరథి వ్రాసిందే మరో పద్యాన్ని ఈ మాసం పద్య కవితగ అందిస్తున్నాను.

వెలుతురు మొగ్గవై బ్రదుకు వీధుల నూత్న పరీమళమ్ములన్
చిలికిన నీకుగాను విరచించితి గుండియ కొండ మీద ది
వ్వెల రతనాల మేడ; పదవే ! అట నుందువు గాని, కోటి గుం
డెల వెలిగించు దివ్య రమణిన్ _ నిను గాడుపు పాలొనర్తునే ?


మహాకవి ఒక దీపాన్ని వర్ణిస్తున్నాడు. దానిని " వెలుతురు మొగ్గ " అన్నాడు. మీరు గమనించారో .. లేదో ! దీప శిఖ ఉండేది " మొగ్గ " ఆకృతిలోనే. మొగ్గ పుట్టగానే వీధులలో పరిమళాలను వెదజల్లుతుంది. ఈ మొగ్గ " వెలుతురు " అనే కొత్త రకమైన పరిమళాలను బ్రతుకు వీధులలో చిలుకుతుంది. కవి ఆ దీపాన్ని ప్రేమిస్తున్నాడు. అవును ... దీపమే ఆయన ప్రేయసి. ఆ ప్రేయసిని గుండెలో దాచుకొంటాను _ రమ్మంటున్నాడు. అదీ దీపాల కోసమే ప్రత్యేకంగా ఒక రతనాల మేడ నిర్మించి, అందులో ఉండడానికి ఆహ్వానిస్తున్నాడు. మనందరికీ ఏ జూబిలీ హిల్స్ కొండ మీదో లేక బంజారా హిల్స్ కొండ మీదో ఒక పెద్ద మేడ కడితే _ అదే గొప్ప ! కాని ఆ మహా కవి కట్టింది ఎక్కడనుకొంటున్నారు ? ఆయన గుండె అనే కొండ మీద ! ఆయన ఆ దీప రమణిని అంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు ? ఎందుకంటే అది కోటి గుండెలను ఒక్క సారిగా వెలిగించగల దివ్య జ్యోతి. అదే జ్ఞాన జ్యోతి ! మరి ఆ దీపాన్ని గాలిలో పెట్టి, ఆరిపోతుంటే చూడగలడా ? అందుకే అపురూపంగా చూసుకొంటాను _ " పదవే " అంటూ ఆత్మీయంగా ప్రేమతో పిలుస్తున్నాడు.

ఎంత చక్కని భావుకత ! అంతర్లీనంగా ఎంతటి తాత్త్వికత !
జ్ఞాన దీప ప్రేమికా ! నీకు జోహారులు !

(ఈ రోజు - 21 జులై, డా.దాశరథి గారి జయంతి సందర్భంగా ... )

_ డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

17, జులై 2009, శుక్రవారం

" ఆణిముత్యం" ... ( జులై 2009 ) "


" ఆణిముత్యం" ... ( జులై 2009 ) "

" విషయ సంకలనము విజ్ఞానమా ? కాదు !
ఇటుక వాము వేరు _ ఇల్లు వేరు !
అస్థి పంజరమ్ము అసలు దేహము కాదు !
ప్రత్తి వేరు _ నూలు పంచె వేరు !
"


మా గురువు గారు డా || నండూరి రామకృష్ణమాచార్య రచించిన పద్యం ఇది.
మానవుడు వివిధ విషయాలపై సమాచారాన్ని సేకరించి, మెదడులో దాచుకొన్నంత మాత్రాన _ అది అతడు సాధించిన విజ్ఞానంగా భావించలేము. ఆ సమాచారాన్ని అంతా తన ఇంగిత జ్ఞానంతో మెదడులో సమన్వయం చేసుకొని, అవసరానికి సత్ఫలితాలిచ్చేలా దానిని ప్రయోగించగలిగినప్పుడే అది అతడు సాధించిన విజ్ఞానంగా పరిగణించబడుతుందని గురువు గారు ఈ పద్యంలో ప్రబోధించారు. దీనికి రూఢిగా ఆయన మూడు ఉదాహరణాలను ఇచ్చారు.
1. మన దగ్గర ఇటుకలెన్నైనా ఉండవచ్చు. కాని వాటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి, మధ్యలో సిమెంటుతో సంధానిస్తూ, నివసించడానికి అనువుగా రూపొందించిన నిర్మాణాన్ని మాత్రమే ఇల్లు అంటారు.
2. అస్థి పంజరం మనిషి దేహంలో ఉండవచ్చు. కానీ అదే దేహమై పోదు. అందులో రక్త, మాంసాలను కూర్చి, జీవ లక్షణం తోడైనప్పుడే అది దేహమౌతుంది.
3. అలాగే, మన వద్ద కావలసినంత పత్తి ఉండవచ్చు. కాని దానిని కట్టుకోడానికి అనువుగా చక్కగా నేసినప్పుడే అది పంచె అవుతుంది.
ఆ విధంగానే మనం సేకరించిన సమాచారాన్ని ఉపయుక్తంగా మలచి, మెదడులో తీర్చి దిద్దుకొన్నప్పుడే _ అది విజ్ఞానమవుతుంది అని ఈ పద్య భావం.

14, జులై 2009, మంగళవారం

" శలవు " కాదు _ " సెలవు "

" శలవు " కాదు _ " సెలవు "
--------------------------

బ్లాగులలో కొందరు " శలవు " అని వ్రాస్తున్నారు. అది తప్పు.
దానిని " సెలవు " అని వ్రాయాలి. అదే సాధు రూపం !
అలాగే, కొంత మంది ఈ శబ్దాన్ని పూర్తిగా తొలగి పోతున్నప్పుడే ప్రయోగిస్తారన్న అపోహలో ఉన్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు. తాత్కాలికమైన వీడుకోలుకు కూడా దీనిని వాడవచ్చు.
దీని అర్థం ఏమిటనుకొన్నారు ?
ఆజ్ఞ లేక అనుమతి.
సెలవు అంటే వీడుకోలు తీసుకొనేందుకు అనుమతి కోరడం అన్న మాట !

అందరూ తప్పుగా వ్రాసే మరొక పదం " అమాయికుడు ". దీనిని అందరూ " అమాయకుడు " అని వ్రాస్తారు, పలుకుతారు. ఇది తప్పు. " అమాయికుడు " సాధు రూపం.

డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

12, జులై 2009, ఆదివారం

సంపాదకీయం ( జులై 2009 ) "

" సులువుగా పద్యం వ్రాయండి " శీర్షికలో ట్యూన్ కి పాట వ్రాసినంత సులువుగా పద్యం వ్రాయడమెలాగో నేర్పుతున్నాను. అయితే పాఠకుల నుండి ఆశించినంతగా స్పందన రాలేదు. బహుశః దానికి కారణం _ చాలా మందికి ట్యూన్ కి పాట వ్రాయడం కూడా ఎలాగో తెలియదేమో అన్న అనుమానం కలుగుతున్నది. అటువంటి వారి అవగాహనార్థం " ఆకలి రాజ్యం " సినిమాలోని ఒక పాట సన్నివేశం ఈ క్రింద ఇస్తున్నాను. అది చూచి మన " ఉత్పల మాల " ను కూడా అలాగే అభ్యాసం చేసి, మంచి పద్యాలు వ్రాస్తారని ఆకాంక్షిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకులు )

Aakali Rajyam-Kanne Pillavani Kannulunnavani

8, జులై 2009, బుధవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( జులై 2009 )

సులువుగా పద్యం వ్రాయండి ... ( జులై 2009 )
లఘువులు, గురువులు, గణాల గోల లేకుండా కేవలం ఒక పాటలా ట్యూనిచ్చి, ఆ ట్యూన్ లోని ఒక్కొక్క భాగానికి ఎలాంటి పదాలు ఇముడుతాయో మూడు, నాలుగు పదాలు ఉదాహరణలుగా చూపి, మళ్ళీ మొత్తంగా ఒక ప్రసిద్ధ పద్యాన్ని ఆ ట్యూన్ ప్రకారం ఎలా కుదిరిందో వివరించి, తప్పులున్నా సరే _ సరిదిద్దుతానని హామీ ఇచ్చినా ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఒక్క పద్యాన్ని (తప్పో _ ఒప్పో _ ) వ్రాయక పోవడం నన్ను నిరాశకు గురి చేసింది. వ్రాయలేక పోవడం అనే కన్న అసలు ప్రయత్నమే చేసినట్టుగా కనిపించడం లేదు. ఫరవా లేదు. మరి కొన్ని ఉదాహరణలు చూపుతాను.
ఇప్పుడు మన ప్రధాన మంత్రి " మన్మోహన్ సింగ్ " పై " ఉత్పల మాల " పద్యం వ్రాయాలనుకోండి. ముందుగా ఆయనను తలచుకోగానే మనకేం గుర్తొస్తుంది ? ఆయన ముఖంలో గడ్డం అనుకోండి. ఇప్పుడా విషయం పద్యంలో చెప్పుదాం.
ఉత్పల మాల ట్యూన్ ఏంటి ?
తానన తాననా తనన తానన తానన తాన తాననా
ఇప్పుడు పైన అనుకొన్న భావం ట్యూన్ లో ఇలా చెప్పవచ్చు.
తానన : మోమున
తాననా : గడ్డముం
తనన : డు _ _ ( తనన లో "త" వరకే నింపాము. ఇంకా " నన " మిగిలి ఉంది.
ఇంత వరకు వ్రాసిందేంటి ?
" మోమున గడ్డముండు ..."
మన మనుకొన్న భావం వచ్చింది. ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? నెత్తి మీద " పగ్డి " ఉంటుంది.
తనన : డు ... శిర
తానన : మున్ ధరి
తానన : యించును
తాన : పగ్డి
ఇప్పుడు మళ్ళీ పద్యం చూదాం.
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ ... " ( ఇక్కడ మొదటి అక్షరం " మో " కి, పదో అక్షరం _
" మున్ " కి యతి కుదిరింది. గమనించండి. )
ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? ... ఎప్పుడు చిరునవ్వులను చిందుతుంటాడు. అయితే పద్యం రెండో పాదంలోకి వెళుతోంది కాబట్టి ప్రాసాక్షరం సరి పోయేలా పదం వేయాలి. " మందహాసామృతము " పదమయితే " మృ " ప్రాసాక్షరంగా పడి సరిపోతుంది. ఎలాగో చూడండి.
తాననా : మందహా ( ఇక్కడికి మొదటి పాదం పూర్తయింది.)
మళ్ళీ ... రెండో పాదం ప్రారంభిస్తే ...
తానన : సామృత
తాననా : మున్ సదా
తనన : కురియు
ఇప్పుడు పద్యం ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ..."
ఇప్పుడు రాబోయే అక్షరం రెండో పాదంలో పదో అక్షరం కాబట్టి మళ్ళీ యతి చూసుకోవాలి. రెండో పాదం " సామృత " అని ప్రారంభమైనా, అక్కడ సంధి వల్ల " సా " వచ్చింది గాని, నిజానికి అక్కడ ఉన్నది " అమృత " లోని " అ "... కాబట్టి " అ " కే యతి వేయాలి.
సరే ! ఇంతకీ ఆయన గురించి ఇంకేం చెప్పవచ్చు? ఆయన ఆర్థిక శాస్త్రంలో మేటి.
తానన : ఆర్థిక
తానన : శాస్త్రము
తాన : నందు
తాననా : మేటియౌ ( ఇక్కడికి రెండో పాదం కూడా పూర్తయింది )
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం _
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ఆర్థిక శాస్త్రము నందు మేటియౌ "
మన్మోహన్ సింగ్ ను గూర్చి ఇంకా ఏం చెప్పవచ్చో ఇలాగే ఆలోచిస్తూ మూడు , నాలుగు పాదాలను కూడా ఇలా పూర్తి చేయవచ్చు.
తానన : " శ్రీ మన
తాననా : మోహనా "
తనన : ఖ్యుడను
తానన : " సింగు " యె
తానన : " కింగ " యి
తాన : నేడు
తాననా : దీటుగా ( దీంతో మూడో పాదం అయిపోయింది. )
ఇక్ నాలుగో పాదం ...
తానన : క్షేమము
తాననా : గా సుపా
తనన : లనము
తానన : సేయుచు
తానన : నుండెను
తాన : భార
తాననా : తావనిన్ ( నాలుగో పాదం కూడా పూర్తయిపోయింది )
ఇప్పుడు మొత్తం పద్యాన్ని చూద్దాం ...

" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ఆర్థిక శాస్త్రమునందు మేటియౌ
శ్రీ మనమోహనాఖ్యుడను " సింగుయె కింగయి " నేడు దీటుగా,
క్షేమముగా సుపాలనము సేయుచునుండెను భారతావనిన్ ! "

చూసారా ? మన ప్రధానిపై ఎంత చక్కని పద్యం రూపు దిద్దుకొందో ! ఇది నేను ఇప్పటికిప్పుడు పాఠం వ్రాస్తూ అల్లిన పద్యమే ! ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మీరు కూడా మీకిష్టమైన నాయకుని మీద ఒక " ఉత్పల మాల " పద్యం వ్రాయండి ... అది _ ఇందిరా గాంధి కావచ్చు. లేక పోతే వాజపాయి, లేక చంద్రబాబు, ఇంకా ... రాజశేఖర రెడ్డి, కాకపోతే సచిన్ టెండూల్కర్, ధోనీ ... ఎవరైనా కావచ్చు. వ్యాఖ్యగా ప్రచురించండి. తప్పులుంటే సరి దిద్దుతాను. అవసరమైతే సూచనలిస్తాను. ఒక్క పద్యం వ్రాయండి ... తరువాత చూడండి _ ఆ అనిర్వచనీయమైన ఆనందం ఎలా ఉంటుందో !

ALL THE BEST !

_ డా . ఆచార్య ఫణీంద్ర
సంపాదకుడు

5, జులై 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... ( జులై 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ !"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 జులై 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

22, జూన్ 2009, సోమవారం

వార్తా విశేషం ... ( జూన్ 2009 )



---------------------------------------------------------------------------------


నండూరి రామకృష్ణమాచార్య 89వ జయంతి సభ


లోగడ ప్రకటించినట్టుగా 29 ఏప్రిల్ 2009 నాడు హైదరాబాదులోని నారాయణగూడలో YMCA హాలులో " నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " మరియు " నవ్య సాహితీ సమితి " సంస్థల సంయుక్తాధ్వర్యంలో కీ. శే. డా || నండూరి రామకృష్ణమాచార్య 89 వ జయంతి సభ ఎంతో వైభవంగా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన " త్రివేణి " ఆంగ్ల పత్రికా సంపాదకులు ఆచార్య ఐ.వి.చలపతి రావు " నండూరి రామకృష్ణమాచార్యులు తెలుగు పద్య కవిత్వ రంగంలో వైతాళికు " లని, అంతే కాకుండా " ఆయన బహుభాషా కోవిదు " లని కీర్తించారు. ఆంగ్లంలో ఆయన రచించిన "మహా భారత " బహుళ ప్రసిద్ధమని ఆయన ప్రశంసించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య టి. కిషన్ రావు మాట్లాడుతూ " నండూరి వారు ముక్తక పద్యాలలో ఆధునిక సమాజానికి అద్దం పట్టిన మహాకవి " అని శ్లాఘించారు. సభలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం సంపాదకులు, ప్రముఖ పద్య కవి శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యులను నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం క్రింద ఆయనకు నాలుగు వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువ ప్రదానం చేసారు. ప్రముఖ విమర్శకులు, ఉస్మానియా విశ్వ విద్యాలయం రిటైర్డ్ డీన్ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య ఎస్.వి.రామారావు నండూరి వారి స్మారక ప్రసంగం చేస్తూ, నండూరి వారి "ఆలోచనం" గ్రంథంలోని రచనా వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు గానం చేసిన నండూరి వారి " శీర్ణ మేఖల " పద్య కవితా గానం "హైలైట్" గా నిలిచింది. సభలో ఇంకా ప్రముఖ పద్య కవులు ఆచార్య వి.ఎల్.ఎస్. భీమ శంకరం , శ్రీ చిల్లర కృష్ణ మూర్తి , నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు శ్రీ కె. సాగర్ రావు, కోశాధికారి శ్రీ ఆత్మకూరి గాంధీ , టి.టి.డి. వేదాంత వర్ధనీ కళాశాల ప్రిన్సిపాల్ డా || నండూరి విద్యారణ్య స్వామి పాల్గొని రామకృష్ణమాచార్యుల సాహితీ మూర్తిమత్వాన్ని ప్రస్తుతించారు. నండూరి వారిచే రచించబడిన పద్యాల పఠన పోటీలో విజేతలైన విద్యార్థులకు ఈ సభలో ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేయబడింది. ఈ మహాసభకు నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి డా || ఆచార్య ఫణీంద్ర , నవ్య సాహితీ సమితి అధ్యక్షులు శ్రీ వేమరాజు విజయకుమార్ సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.

_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకులు )

21, జూన్ 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ... ( 2009 )

మహాకవి డా || దాశరథి విరచిత పద్యాన్ని ఈ మాసం పద్య కవితగ అందిస్తున్నాను.
ఒక నిజమైన కవికి కవిత్వమంటే ఎంత పిచ్చి ఉంటుందో , దాని కొరకు తన సర్వస్వాన్ని కోల్పోవడానికి ఎలా సిద్ధ పడతాడో తెలియజెప్పే పద్యం ఇది.

నాదొక వెఱ్ఱిః త్రాగుడున నాడును వీడును అమ్ముకొన్న ఉ
న్మాదివలెన్ కవిత్వమున నా సకలమ్మును కోలుపోయి రా
త్రీ దినముల్ రచించితిని తీయని కావ్య రస ప్రపంచముల్;
వేదన యేదియో కలత పెట్టును గుండియ నెందుచేతనో? ... ( అగ్నిధార )

ఈ నెల పద్య కవిత ... ( సెప్టెంబర్ 2009 )

అవినీతి
రచన : డా. జె. బాపురెడ్డి, IAS (Retd.)

లేదు అవినీతి లేని తావేది ఇలను
కాని, మన ప్రియ భారత ఖండమందు -
దాని అవతారములు లెక్క లేని యన్ని !
పట్టుబడి, పట్టుబడనట్టి గుట్టులెన్నొ !!

అంతొ ఇంతయో తినకయే సంతకమ్ము
చేయు వారల సంఖ్య కాసింత యౌను
ముందు ముందు - ఆఫీసుల యందు ! నీతి
మంతులగుపించు టది గొప్ప వింత యౌనొ !

రౌడీల రాజ్య మిదియని
రౌడీలే చాటుకొనగ, రక్షణ కొరకై
రౌడీల అండ చేరగ
దౌడులు తీసెదరొ ప్రజలు దయనీయముగాన్ !

తెలియక తప్పులు చేసిన
తెలుపుట సాధ్యమ్మె కాని, తెలిసి తెలిసియే
తెలిసిన తప్పులు చేసెడి
తెలివికి తెలుపునది చావు దెబ్బ యొకటియే !

చూడు ! చట్టాలు విలపించుచుండె - వాని
వంచనల, దూషణల, మాన భంగములకు
పాల్పడెడి దుర్మతుల పని బట్టనట్టి
సంఘమున తాము పుట్టిన శాపమునకు !
----- *** -----

19, జూన్ 2009, శుక్రవారం

సంపాదకీయం ... (జూన్ 2009 )

" ఆధ్యక్ష్యము " సాధు రూపమే !

పనుల ఒత్తిళ్ళ వలన ఒక నెల విరామం తరువాత ఈ బ్లాగు నిర్వహణను తిరిగి చేపట్టాను. పాఠకులను నిరీక్షించేలా చేసినందుకు మన్నించగలరు.
ఎప్పటిలాగే "సమస్యను పరిష్కరించండి" , "ఆణిముత్యం" , "సులువుగా పద్యం వ్రాయండి" వంటి శీర్షికలను ఈ వరకే అందించడం జరిగింది. ఇంకా "ఈ మాసం పద్య కవిత" , "వార్తా విశేషం" వంటి శీర్షికలను త్వరలో అందించగలను. అయితే "ఈ మాసం పద్య కవిత" శీర్షికకు ఔత్సాహికులెవరూ పద్య కవితలను పంపక పోవడం విచారకరం. మంచి పద్య కవితలు ( పాతవైనా సరే ) పద్య కవులు dr.acharya_phaneendra@in.com కు mail చేస్తే ప్రచురించగలను. పద్య కవితా వ్యాప్తికి అందరూ నడుము కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ మాసం "సమస్యను పరిష్కరించండి" లో ఇచ్చిన సమస్య _ " కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ".
ఈ సమస్యకు ఒక వారం రోజుల పాటు పూరణలు రాకపోయేసరికి కవులు అందులోని కిటుకును పట్టుకొన్నారో లేదో అని సందేహంలో పడ్డాను. కాని తరువాత "కంది శంకరయ్య" గారు , "హరి దోర్నాల" గారు చక్కని పూరణలను అందించారు. వారికి నా అభినందనలు.
అయితే , శంకరయ్య గారు , హరి గారు సమస్యను _ " కసభాధ్యక్షతను పొందె కాంతామణియే " అని మార్చి పూరించారు. రెండింటి భావం ఒకటే అయినా ,
వారు "ఆధ్యక్ష్యము" సాధు రూపం కాదనుకొని మార్చారా? అన్న అనుమానం కలుగుతున్నది. అలా అయితే ఇది చర్చనీయాంశమే. "ఆధ్యక్ష్యము" అన్న పదం "సూర్యరాయాంధ్ర నిఘంటువు"లో ఉంది. "అధ్యక్షత్వము" అని దానికి అర్థం పేర్కొనబడింది. ఈ విషయాన్ని గ్రహించ వలసిందిగా కోరుతున్నాను.
మరింత మంది ఈ బ్లాగులో పాలు పంచుకొని , పద్య కవితా వ్యాప్తికి , భాషాభివృద్ధికి దోహదపడాలని వేడుకొంటున్నాను.

_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

16, జూన్ 2009, మంగళవారం

సులువుగా పద్యం వ్రాయండి ... (జూన్ 2009)

యతి , ప్రాసల సాధనకు ఒక నెల సమయమిచ్చి , నేనే మరో నెల పనుల ఒత్తిళ్ళ వల్ల మీకు కనిపించకుండాపోయాను. అయితే అది మీకు మరింత అధ్యయనానికి , అభ్యాసానికి ఉపకరించిందని భావిస్తున్నాను. ఇక ఈ మాసం పద్య రచనకు ఉపక్రమిద్దాం. అదీ .. ఏకంగా వృత్త పద్యమయిన " ఉత్పల మాల ". మరి మీరు సిద్ధమేనా ?
మీలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు సినిమా పాటలు వ్రాయాలని కలలు కని ఉంటారు. అప్పుడప్పుడు పాత తెలుగు పాటలకు " పేరడీ " గీతా లల్లి ఉంటారు. లేదా హిందీ పాటలకు తెలుగు అనువాద గీతాలు రచించి ఉంటారు. ఇలా ఏదో ఒక " ట్యూన్ " కి పాట వ్రాయడం సులువైన పనే. అదిగో .. అలాగే " ఉత్పల మాల " పద్యం వ్రాయడం కూడా నేర్చుకొందాం.
" ఉత్పల మాలలో మొత్తం 4 పాదాలు ( అంటే , 4 లైన్లు ) ఉంటాయి. ప్రతి పాదంలోనూ ఒకే రకమైన " ట్యూన్ " ఉంటుంది. ఆ " ట్యూన్ " కి పాట వ్రాసినట్లు పదాలు కూర్చుతూ పోవడమే. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి , మళ్ళీ
10 వ అక్షరానికి యతి కుదుర్చాలి. అలాగే ఇంతకు ముందు చెప్పుకొన్నట్లుగా , ప్రతి పాదంలో 2 వ అక్షరాన్ని ప్రాసగా ఒకే హల్లుకు చెందిన అక్షరాన్ని ఉపయోగించాలి.
ఇంతకీ ఆ ట్యూన్ ... ఏంటంటే ..............
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇక్కడ ట్యూన్ లో .. " తానన " అన్న చోట _
" పాటలు " ...
" పద్యము " ...
" అందుకు " ... ఇలా ఏ పదమైనా వేసుకోవచ్చు.
అలాగే " తాననా " అన్న చోట _
" నీ వలెన్ " ...
" చేయగా " ...
" ఇందులో " ...
" పద్ధతుల్ " ... ఇలా ఏమైనా అర్థవంతంగా పదాలు పూరించుకోవచ్చు.
ఇంకా " తనన " అన్న చోట _
" రచన " ...
" నిలయ " ...
" మదిని " ... ఇలా వేసుకోవచ్చు.
ఇప్పుడు మొత్తం పాదానికి ఒక ఉదాహరణ చూడండి _
" పద్యము వ్రాయుటెం తొసుల భమ్మని చెప్పుట కిద్ది సాక్ష్యమౌ " ( ఇక్కడ 1 వ అక్షరమైన " ప " కి , 10 వ అక్షరమైన " భ " కి యతి కుదిరింది.
ఇప్పుడొక ప్రసిద్ధ పద్యాన్ని ఉదాహరణగా చూద్దాం .....
" కాటుక కంటినీ రుచను కట్టుప యింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్యమ ర్దనుని గాదిలి కోడల ఓమ దంబయో
హాటక గర్భురా ణినిను నాకటి కింగొని పోయి యల్లక
ర్ణాటకి రాటకీ చకుల కమ్మత్రి శుద్ధిగ నమ్ము భారతీ "
ఇక్కడ పదాలను విడగొట్టి " ట్యూన్ " ప్రకారం చూపిన సంగతి గ్రహించగలరు. అలాగే ప్రతి పాదంలో యతి , ప్రాసలను కూడా గమనించండి.
ఈ పద్ధతి ప్రకారం మీకు తోచిన భావాన్ని పద్యంగా వ్రాసేందుకు అభ్యాసం చేయండి. పూర్తయిన పద్యాన్ని వ్యాఖ్యగా పోస్ట్ చేస్తే , తప్పొప్పులు వివరిస్తాను. ఇంకా ఎందుకు ఆలస్యం ? ప్రారంభించండి.
_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

15, జూన్ 2009, సోమవారం

"ఆణిముత్యం" ... జూన్ 2009

"కుమిలి క్రుళ్ళుచు , నిరుపేద గుడిసె లెల్ల
నేడు కంపు గొట్టుచునుండు నిజము ; కాని
అద్యతన నాగరక హృదయాల కంటె
ఎంత పరిశుభ్రమైనవో ఎంచి చూడ !"


మా గురువు గారు డా || నండూరి రామకృష్ణమాచార్య రచించిన పద్యం ఇది.
నాగరకత పేర పతనమవుతున్న మనుషుల హృదయాల కంటె పేదరికంతో
క్రుళ్ళి ఉన్న slum areas ఎంతో పరిశుభ్రమైనవని ఆచార్యుల వారు ఈ పద్యం
ద్వారా తెలియజెప్పారు. ఎంత చక్కని భావన ! ఎంతటి అభ్యుదయం !

10, జూన్ 2009, బుధవారం

సమస్యను పరిష్కరించండి ... (జూన్ 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

"కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే!"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 జూన్ 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

12, ఏప్రిల్ 2009, ఆదివారం

సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2009)

ఇప్పుడిక పద్యాలలో యతి, ప్రాసలను ఎలా వేయాలో తెలుసుకొందాం.
మన అక్షరాలను మనం ’అచ్చులు’, ’హల్లులు’ అని రెండు విభాగాలుగా నేర్చుకొన్నాం.
’అ’ నుండి ’ఆః’ వరకు ఉన్నవి అచ్చులు -
’క’ నుండి ’ఱ’ వరకు ఉన్నవి హల్లులు.
మన భాషలోని పదాలలో ప్రతి అక్షరంలో అచ్చు, హల్లు రెండు మిళితమై ఉంటాయి. అందుకే మనం ’గుణింతా’లని నేర్చుకొనేది.
మనం పద్యాలలో ’యతి మైత్రి’ వేసేప్పుడు అటు ’స్వర (అచ్చు) మైత్రి’, ఇటు ’వ్యంజన (హల్లు) మైత్రి’ రెండూ కుదిరేలా చూసుకోవాలి.
అచ్చులలో క్రింద పేర్కొన్న జట్టులలో వాటిలో వాటికే యతి కుదురుతుంది కానీ , వేరే వాటితో కుదరదు.
* అ,ఆ,ఐ,ఔ,అం,ఆః,య,హ
ఉదా|| ’అ’ల్పుడెపుడు పలుకు ’ఆ’డంబరముగాను
* ఇ,ఈ,ఎ,ఏ,ఋ,ౠ,
ఉదా|| ’ఇ’తరులెరుగకున్న ’ఈ’శ్వరు డెరుగడా?
* ఉ,ఊ,ఒ,ఓ
ఉదా|| ’ఉ’ప్పు కప్పురంబు ’ఒ’క్క పోలిక నుండు
పై మూడు జట్టులలోని అక్షరాలను గుర్తుంచుకొని, ఉదాహరణలను పరిశీలిస్తే విషయం బోధపడుతుంది.
’య’,’హ’ హల్లులైనా ఉచ్చారణ దగ్గరగా ఉండడం వలన ’అ’ జట్టులోని అచ్చులతో కూడి ఉంటే, ఆ అచ్చులతో యతి మైత్రి కుదురుతుంది.
ఉదా|| ’అ’ల్లరి మూక నేతలు మ’హా’త్ములటన్నను నమ్మ శక్యమే?
ఇందులో ’అ’కి, ’హా’కి యతి కుదిరింది. అలాగే మరొక
ఉదా|| ’య’జ్ఞ ఫలము నందుకొనిరి ’ఆ’తని పత్నుల్!
ఇక్కడ ’య’కి, ’ఆ’కి యతి మైత్రి కుదిరింది.
ఇక హల్లులలో ఏ ఏ జట్టులలో ఏ ఏ అక్షరాలకు యతి కుదురుతుందో చూద్దాం.
* క, ఖ, గ, ఘ, క్ష
ఉదా|| ’కం’చు మ్రోగినట్లు ’క’నకంబు మ్రోగునా?
ఇలాగే మిగితా జట్టులు ...
* చ, ఛ, జ, ఝ, శ, ష, స, క్ష, జ్ఞ
* ట, ఠ, డ, ఢ
* త, థ, ద, ధ
* న, ణ, o
* ప, ఫ, బ, భ, వ
* మ, oప, oఫ, oబ, oభ (ప్రత్యేకంగా... పు, పూ, పొ, పో, ఫు, ఫూ, ఫొ, ఫో, బు, బూ, బొ, బో, భు, భూ, భొ, భో- లతో ... ము, మూ, మొ, మో లకు యతి కుదురుతుంది.)
ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
అలాగే, మరో ఉదా|| ’పు’లతి అందమైన ’మో’ము జూడు
ఇంకా మిగిలిన జట్టులు ఇవి -
* ర, ఱ
* ల, ళ
* య, హ, అ,ఆ, ఐ, ఔ, అం, ఆః
ఒక ముఖ్య విషయమేమిటంటే, యతి మైత్రి అంటే - అచ్చు మైత్రి, హల్లు మైత్రి రెండూ తప్పకుండా కుదరాలి.
ఉదా|| ’దే’శ భాషలందు ’తె’లుగు లెస్స
ఇందులో ’ద’ కి, ’త’ కి హల్లు మైత్రి, అందులోని ’ఏ’ కి, ఇందులోని ’ఎ’కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి.
ఉదా|| ’స’జ్జనుండు పలుకు ’చ’ల్లగాను
ఇందులో ’స’ కి ’చ’ కి మధ్య హల్లు మైత్రి - మళ్ళీ అందులోని ’అ’ కి, ఇందులోని ’అ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి. మరొక ఉదా||
’చి’త్త శుద్ధి లేని ’శి’వ పూజలేలయా?
ఇందులో ’చ’ కి ’శ’ కి హల్లు మైత్రి మరియు అందులోని ’ఇ’ కి, ఇందులోని ’ఇ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి గదా!
ఇవి గాక ’ప్రాస యతి’ అని ఒకటుంది. ఇది అన్ని ఛందస్సులలో పనికి రాదు. కొన్ని ఛందస్సులలో అంగీకరింపబడుతుంది. ఉదాహరణకు ’సీసము’, ’తేట గీతి’, ’ఆట వెలది’ మొ||వి. పైగా, ఈ ఛందస్సులలో ప్రాస యతి వాడితే ఆ పద్యాలకు మంచి అందం కూడా వస్తుంది.
’ప్రాస యతి’ అంటే, ఆ యా అక్షరాలకు మధ్య యతి బదులు వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస వేయడం.
ఉదా|| ’ఇల్లు’ మొత్తమపుడు ’గుల్ల’యయ్యె
ఇందులో ’ఇ’ కి ’గు’ కి యతి కుదర లేదు. కాని వాటి ప్రక్కన రెండు చోట్లా ’ల్ల’ అన్న ప్రాస పడింది. ఇది ’ప్రాస యతి’
’యతి’ గురించి ఈ జ్ఞానం సరిపోతుంది.
ఇక ’ప్రాస’ - ఇది ఇంతకు ముందు పాఠంలో చెప్పుకొన్నట్టు పద్యంలోని ప్రతి పాదంలో రెండవ అక్షరం ఒకటే అదే హల్లుకు సంబంధించినది ఉండడం. అందులోని అచ్చు మారినా ఫరవా లేదు.
ఉదా|| క’oదు’కము వోలె సుజనుడు
క్రి’oదం’బడి మగుడి మీది
కెగయు జుమీ
మ’oదు’డు మృత్పిండము వలె
గ్రి’oదం’బడి యడగి యుండు
గృపణత్వమునన్
ఈ పద్యంలో బిందు పూర్వక దకార( oద) ప్రాస వేయబడింది. గమనించారు కదా!
ఈ విషయాలన్నీ మనసులో ఆకళించుకొని, ఈ మాసమంతా ఎక్కడ ఏ పద్యం కనిపించినా దానిలో యతి ప్రాసలు ఎలా వేసారో గమనిస్తూ, సాధికారతను సాధించండి.
వచ్చే నెలలో సులభంగా వృత్త పద్యాలు వ్రాయడం నేర్చుకొందాం మరి. ఇప్పటికిక సెలవు.
- డా.ఆచార్య ఫణీంద్ర
(సంపాదకుడు)

8, ఏప్రిల్ 2009, బుధవారం

"ఆణిముత్యం" ... ఏప్రిల్ 2009

మెదడులోన ’మార్క్సు’, హృదిలోన బుద్ధుడై -
విప్లవమ్ము, కరుణ వింగడించి
పుట్టవలయు సుకవి భువనైక పౌరుడై
ప్రగతి కొరకు - నూత్న జగతి కొరకు!


వేమన వలె మా గురువు గారు రచించిన వేలాది ఆటవెలది ముక్తక పద్యాలలో ఇది ఒకటి.
మా గురువు గారు - స్వర్గీయ ’నండూరి రామకృష్ణమాచార్య’ సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక ఊపు ఊపింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ ఇది నీరాజనాలందుకొంటూనే ఉంది. మా గురువు గారు డా.నండూరి రామకృష్ణమాచార్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా 1987- 1990 మధ్య పని చేసారు.
వీరి ప్రసిద్ధ రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు.
’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో ’జాషువ’, ’కరుణశ్రీ’ మరియు మా గురువు గారిని ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది.
ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు.
మెదడులోని ఆలోచనా విధానంలో ’కార్ల్ మార్క్స్’ ప్రబోధించిన సామ్యవాదాత్మక విప్లవ భావాలను, అంతరంగంలో ’బుద్ధుడు’ బోధించిన కరుణ తత్త్వాన్ని కలిగి - సత్కవియైన వాడు ఈ ప్రపంచంలో ఒక విశిష్ట వ్యక్తిగా అవతరించి, ప్రగతిని సాధించేందుకు పాటుపడుతూ, ఒక నవ సమాజ నిర్మాణానికి దోహదపడాలని ఈ పద్య భావం. వైరుధ్య భావాలలో కూడా ఉన్న ’మంచి’ని గ్రహించి కవి ముందుకు సాగాలని గురువు గారు ఈ పద్యంలో కవిలోకానికి సందేశం అందించారు.
- డా.ఆచార్య ఫణీంద్ర

5, ఏప్రిల్ 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ...(ఏప్రిల్ 2009)


అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రజ్ఞులు ఆచార్య వి.ఎల్.ఎస్. భీమ శంకరం గారు సాహిత్య లోకంలో ప్రౌఢ పద్య కవిగా ప్రసిద్ధులు. "రసస్రువు","శివానంద మందహాసం", "ద్రాక్షారామ భీమేశ్వర శతకం" మొదలైన రచనలతో ఆయన ఎనలేని ప్రఖ్యాతిని సాధించారు. ఆయన రచించిన "వసంత సభ" అన్న పద్య కవితను "ఈ మాసం పద్య కవిత"గా అందిస్తున్నాను.
ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు దయచేసి కొత్త విషయాలపై వ్రాసిన తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు.
- డా.ఆచార్య ఫణీంద్ర

విరోధి నామ సంవత్సర వసంత సభ
-------------------------------------
రచన: ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం
----------------------------------------

తెలతెలవారుచుండె, మది తీయని స్వప్నము తోడ నిండె, నే
తులుచన లేచి చెంత గల తోటకు నేగితి దైవ పూజకై
అలరులు కోయగా - నచట నబ్బుర మొప్పగ ప్రస్ఫురిల్లె క
న్నులు మిరుమిట్లు గొల్పగ వినూతన దృశ్యము లొక్క పెట్టునన్.

అపుడె ఉదయించు నాదిత్యు నరుణ కాంతి
కొలది కొలదిగ నన్ని దిక్కులకు కవిసి
నేల తల్లికి పారాణి నిమిరె ననగ -
ప్రకృతి కాంత కన్బడె నవ వధువు వోలె.

మొల్ల, సంపంగి, తంగేడు, పొగడ, మల్లె
మొల్లముల నుండి బహువర్ణ పుష్ప వృష్టి
నింగి హరివిల్లు నేలకు వంగుచుండె
ననగ నానంద పరిచె నా మనము నపుడు.

రంగు రంగుల అవనతాంబురుహ కుట్మ
లాంగనలు ఫుల్లమై లేచి భృంగ తతికి
నధర మకరంద నిష్యంద మధురమైన
చెరకు విలుతు లకోరీల బరపె నపుడు.

రంగు రంగుల పువ్వుల రంగశాల ,
రంగశాలను నర్తించు భృంగ చయము
లింపుగా తోచె కమనీయ దృశ్యముగను
హోలి యాడెడు రంగారు యువత వోలె

పిల్లగాలికి పూబాల ప్రేంకణములు,
ప్రేంకణంబుల చెలరేగి ప్రీతి గొల్పు
సరస పరిమళ సుమగంధ సౌరభంబు
లపుడు ప్రకటించె నామని ఆగమనము.

ఏమది! నేడు భూమి వసియించెడు స్థావర జంగమ వ్రజం
బామని శోభ దేలుచు సుఖాయుత దివ్య మనోజ్ఞ నాట్య గీ
తామృత మాస్వదించుటకునై మది నీవిధి నిశ్చితార్థులై
కామనతో వసంత సభ కాముని పండువుగా రచించిరో!

అవిగో - అల్లవిగో - అవే! నవ వసంతారంభ సంరంభముల్
రవిబింబం బరుణ ప్రియంగువులతో ప్రాచీ దిశన్ గప్పెడున్,
శ్రవణానంద మహోదయాగమున సంరావంబు విన్వచ్చెడున్,
భువి నేతెంచె 'విరోధి' ఆంధ్ర జన సమ్మోద ప్రమోదంబుగాన్.

పేరులో 'విరోధి'యె గాని ప్రేమ తోడ
జనుల సాకగా వచ్చిన సౌమ్య మూర్తి ,
మనల కాయురారోగ్య కామనల దీర్చు
వత్సరంబని నా మన ముత్సహించె.
--- *** ---

4, ఏప్రిల్ 2009, శనివారం

సమస్యను పరిష్కరించండి ... (ఏప్రిల్ 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

"జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 ఏప్రిల్ 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

31, మార్చి 2009, మంగళవారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా. ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - మూడవ భాగం

భా.రా.:సంస్కృత పదాలను సులభంగా ఎలా గుర్తించాలి? సంధిచేసేటప్పుడు ప్రతిసారి నాకు ప్రశ్న వుత్పన్నమౌతుంది.
..:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు. వార్తా పత్రికలలో భాషా ప్రమాణాలు మరీ దిగజారి ఈ మధ్య ఇవి బాగా వ్యాపించి భాషను ఖూనీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. దురదృష్ట మేమిటంటే ఇప్పుడు పొద్దున్న లేచి చూస్తే, ప్రసిద్ధి చెందిన వార్తా పత్రికలలోనే ఇలాంటి దోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవహార భాషలో ఎలా 'ఏడ్చినా', పద్యాలలో వీటిని పండితులు అంగీకరించరు. మరి ఈ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏది సంస్కృత శబ్దం, ఏది తెలుగు శబ్దం అన్న పరిజ్ఞానం ఉండాలి.
ఒక చిన్న బండ గుర్తు ఉంది. మన అక్షరాలలో 'అల్ప ప్రాణాలు', 'మహా ప్రాణాలు' అని ఉన్నాయి. 'క, గ, చ, జ, త, ప, బ, మ, య, ల...' మొ||వి అల్ప ప్రాణాలు. ' ఖ, ఘ, ఛ, ఝ, థ, ధ, ఫ, భ...' మొ||వి మహాప్రాణాలు. అన్ని అల్ప ప్రాణాలున్న పదాలు 'తెలుగు పదాలు' అని చెప్పలేం గానీ - పదంలో ఒక్క మహాప్రాణమున్నా అది సంస్కృత పదమని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులో మహాప్రాణ అక్షరాలు లేవు. అవి సంసృతం నుండి గ్రహించినవే. 'బడి, గుడి, బండ, మల్లె, పువ్వు, తీగ ... ఇలా అన్నీ తెలుగు పదాలు. అంత మాత్రాన 'లత, దేవాలయం, కాలం, జగతి...' కూడా తెలుగు పదాలు కావు. ఎందుకంటే సంస్కృతంలో కూడా అల్పప్రాణ అక్షరాలు ఉంటాయి. కానీ, 'ధర్మం, ఫలం, మోక్షం, భయం...' ఇలా మహాప్రాణం ఒక్కటున్నా అది కచ్చితంగా సంస్కృత శబ్దమే! అయితే ఈ అయోమయమేమీ లేకుండా ఉండాలంటే ' శబ్ద రత్నాకరం' లేదా 'సూర్య రాయాంధ్ర నిఘంటువు' - ఈ రెండు నిఘంటువులలో ఏది చూచినా, ప్రతి పదం పక్కన అది సంస్కృత పదమా, లేక తెలుగు పదమా వ్రాసి ఉంటుంది. సమాసం చేసేప్పుడు ఏదైనా సందేహం వస్తే వాటిలో చూసుకోవచ్చు.
భా.రా.:నానార్థాల,వ్యుత్పత్తి అర్థాల కొరకు మంచి నిఘంటువులేమైనా వుంటే తెలియ జేయండి.
..: తెలుగులో ఇటీవల నానార్థాలపై ఒక చక్కని గ్రంథం వచ్చింది. డా. పి. నరసింహా రెడ్డి రచించిన 'తెలుగు నానార్థ పద నిఘంటువు' అది. ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాదు వారి ప్రచురణ. అలాగే పర్యాయ పదాలపై జి. ఎన్. రెడ్డి గారి 'తెలుగు పర్యాయ పద నిఘంటువు' కూడా ఒక మంచి గ్రంథం. ఇక తెలుగు పదాలకు వ్యుత్పత్తి అర్థాలు ఉండవనే చెప్పాలి. 'చెంబు, గుడి, బండ...' మొ||న పదాలకు ఏం వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. సంస్కృత పదాలకే వ్యుత్పత్తి అర్థాలు చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవాలంటే శ్రీ చలమచర్ల వేంకట శేషాచార్యులు రచించిన 'అమర కోశం- సంస్కృతాంధ్ర వివరణము' అన్న గ్రంథం చాలా అమూల్యమైనది.
భా.రా.: ఆచార్య ఫణీంద్ర గారు! సహృదయంతో శ్రమకోర్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఓర్పుతో నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సదా కృతఙ్ఞుడను.
..: రామిరెడ్డి గారు! మీ వల్ల బ్లాగు మిత్రులకు తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం లభించింది. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
(పరిసమాప్తం)

27, మార్చి 2009, శుక్రవారం

సంపాదకీయం (మార్చి 2009) - డా.ఆచార్య ఫణీంద్ర

సంపాదకీయం (మార్చి 2009)
- డా.ఆచార్య ఫణీంద్ర

గత నెల ప్రారంభించిన ఈ మా ’పీఠం’ అధికార (బ్లాగు) సంచిక విశేషాదరణను పొందిందనే చెప్పాలి. ఫిబ్రవరిలో వాగ్దానం చేసిన మేరకు, ఈ నెల ’సులువుగా పద్యం వ్రాయండి’ శీర్షిక ద్వారా పద్య రచనను బోధించే పాఠాలను ధారావాహకంగా ప్రారంభించాను. అంతర్జాలంలో చాలా మంది పద్య కవులు చేస్తున్న తప్పులను తెలియజెప్పే ఒక టపాను కూడా అందించాను. భావిలో ఇలాంటి టపాలను అడపా దడపా అందిస్తూ పద్య కవితాభివృద్ధికి నా వంతు ’ఉడుత’ సాయం చేయదలిచాను.ఇవి గాక ’హారం.కాం’ భాస్కర రామిరెడ్డి గారు "ఇలాంటి బ్లాగు కోసం చాలా రోజుల నుండి వెదుకుతున్నా" నంటూ, పద్య రచన గురించి అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలను ’ముఖాముఖి’ గా అందిస్తున్నాను.
గత మాసంలాగే ఈ మాసం కూడా మా గురువు గారు దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఒక మంచి పద్యాన్ని ’ఆణిముత్యం’ శీర్షిక ద్వారా అందించాను. అయితే వచ్చే నెల నుండి దీనిని వ్యాఖ్యాన సహితంగా అందించే ప్రయత్నం చేస్తాను.అప్పుడు పాఠకులకు ఆ పద్యాల వైశిష్ట్యం సుబోధకమవుతుంది.
’ఈ మాసం పద్య కవిత’ శీర్షికలో ప్రచురణార్థం పాఠకులు తమ పద్య కవితలను dr.acharya_phaneendra@in.com కు మెయిల్ చేయమని మరొకమారు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక ఈ నెల ’సమస్యను పరిష్కరించండి’కి ఒక్క పూరణ మాత్రమే వచ్చింది. బహుశః పాఠకులు సమస్య కాస్త క్లిష్టంగా ఉందని భావించారేమో! అయితే అందరిలా కాక, నేను సమకాలీన, నవీన విషయాలకు సంబంధించిన సమస్యలనే ఈయ దలిచాను. దీని వలన పద్యంలో ఆధునిక భావాలను వెల్లడించడంలో పాఠకులకు అభ్యాసం అయి, పద్యాన్ని సార్వ కాలీన ప్రక్రియగా నిలబెట్టే మహదాశయానికి దోహదం చేసిన వారమవుతాం.

"పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్" అన్న సమస్యకు శ్రీ ’హరి దోర్ణల’ గారి పూరణ ప్రశంసనీయంగా ఉంది. హరి గారి పూరణ ఇది -

"పది రూపాయల నోటుతో నిపుడు ఏ పాటైన నిండేన కు
క్షి? ది గ్రేట్ సీ.యము.రాజశేఖరుని సాక్షిన్, కొద్ది బియ్యంబునే
ఇదిగో యంచిడె రెండు రూప్యములకే - ఏ మూల కౌనద్ది? ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్!"

సమస్యను రూపొందించిన సంపాదకునిగా, నా పూరణ ఇలా ఉంది -

"ఎదియో కొందరికంట బియ్య మిక రెండేరెండు రూపాయలే -
అదియున్, మొత్తము నిత్తు రిర్వది కిలో లంతే! మరా పైన - ఏ
బది కొట్టుల్ వెదుకాడిన, న్నొక కిలో బాజారులో చూడ - ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్!"

ఈ బ్లాగుకు నేను సంపాదకుడను మాత్రమే. ఇందులో నా రచనల కన్న, ఎక్కువగా పాఠకుల రచనలను ప్రచురించడానికే ప్రాధాన్యతనిస్తాను. కాబట్టి పాఠకులు - ముఖ్యంగా పద్య కవులు, పద్య ప్రియులు అత్యధికంగా ఈ బ్లాగులోని వివిధ శీర్షికలలో బహుళంగా పాలు పంచుకొని పద్య కవితాభివృద్ధికి తోడ్పడాలని వేడుకొంటున్నాను.

పాఠకులందరికీ ’విరోధి’ నామ సంవత్సర ’ఉగాది’ శుభ కామనలు

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

23, మార్చి 2009, సోమవారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా. ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - రెండవ భాగం

భా.రా.: గణాలు చూసుకుంటూ పద్యం రాస్తారా లేక పద్యం వ్రాసే టప్పుడు వచ్చే పదాల గణాలను చూసుకొని పద్యం మారుస్తారా?
..:"కవి యన్న వాడు ఆర్తితో అరిస్తే అది ఏదో ఒక ఛందస్సులో ఉంటుంది" అన్నారు ఆరుద్ర . ఇంతకు ముందు ప్రశ్నకు చెప్పిన సమాధానంలో అన్నట్టు 'ఉత్పల మాల', చంపక మాల', 'కందం', 'సీసం' మొదలైన ఛందస్సులలో పూర్తి సాధికారత పొందేలా అభ్యాసం చేసిన వారికి - తొలి భావం ఏ ఛందస్సులో పలుకుతుందో, అదే ఛందస్సులోనే మిగితా భావం కూడా సునాయాసంగా సాగిపోతుంది. అప్పుడు ఆ కవి దృష్టి - గణాలు, ఛందస్సుపై ఉండదు. సముచితమైన పదాలను వాడుతున్నానా? లేక ఇంకా మెరుగైన పదాలను వాడగలనా? అనుకొన్న భావాన్ని పలికించ గలుగుతున్నానా? లేక ఇంక మెరుగైన భావ వ్యక్తీకరణ సాధ్యమా? - అని ఆలోచిస్తాడు. తాను ఇదివరకే చేసిన అభ్యాస ఫలితంగా ఎలాంటి దోషాలు లేకుండా గణాలు పరిగెత్తుతుంటాయి. తన అభివ్యక్తిలో పరిపక్వత కోసం కవి పద్యాన్ని పునస్సమీక్షించుకొంటూ పద్యంలో అవసరమనుకొన్న చోట్ల మార్పులు చేస్తూ పరిపూర్ణంగా సంతృప్తి కలిగే వరకు దానిని చెక్కుతూనే ఉంటాడు.
భా.రా.: యతి
చాలా రకాలుగదా ? సులభంగా గుర్తుంచుకొనే మార్గాలు ఏమైనా వున్నాయా?
..: నిజమే! యతులలో చాలా రకాలున్నాయి. అందులో 'ప్రాస యతి' వృత్తాలలో, 'కందం'లో చెల్లుబాటు కాదు. కాని 'సీసం'లో, 'ఆట వెలది', 'తేట గీతి' మొదలైన పద్యాలలో అది చాల అందాన్ని సమకూరుస్తుంది. 'ప్రాస యతి' అంటే 'యతి' బదులు ప్రక్క అక్షరంతో ప్రాస వేయడం. ఉదాహరణకు - "ఇల్లు మొత్త మతడు గుల్ల చేసె". ఇందులో 'ఇ'కి, 'గు'కి యతి కుదర లేదు. వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస(ఇల్లు - గుల్ల) పడింది.
'అఖండ యతి' అని ఉంది. దీనిని 'అప్ప కవి' వంటి లాక్షణికులు అంగీకరించ లేదు. కానీ ప్రాచీన కవులలోనే కొంత మంది ఆయన మాటను పెడ చెవిన పెట్టి దీనిని ప్రయోగించారు. సరే - ఇవన్నీ కవికి వెసులుబాటు కల్పించేందుకు ఉన్నవే కాని, కవి తప్పకుండా తెలుసుకొని ప్రయోగించాలన్న నియమమేమీ లేదు. వీటి కన్నా కవి డైరెక్టుగా 'యతి మైత్రి' వేస్తేనే పండితులు హర్షిస్తారు. కాబట్టి కవి 'యతి' వేయ వలసిన స్థానంలో 'స్వర(అచ్చు) మైత్రి, వ్యంజన(హల్లు) మైత్రి కుదిరిందా చూసుకొంటే సరిపోతుంది. (సశేషం)

19, మార్చి 2009, గురువారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా||ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - మొదటి భాగం

భాస్కర రామిరెడ్డి: ఫణీంద్ర గారు! ఈ రోజు మీ 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' బ్లాగును చూశాను. పద్య కవిత్వ వ్యాప్తికి ఈ బ్లాగు ద్వారా మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. బ్లాగులోని మీ పాఠాలు చదవడం వల్ల పద్య కవిత్వానికి , తెలుగు భాషకు సంబంధించిన సందేహాలు తీరుతాయి. ఇటువంటి బ్లాగు కోసం గత రెండు నెలలుగా వెదుకుతున్నాను. ముందు ముందు నాకున్న సందేహాలన్నింటికి మీ బ్లాగు సమాధానాలు ఇస్తుందని ఆశిస్తాను.
అయితే ఈ ముఖాముఖి ద్వారా ముందుగా మాలాంటి వారికి ఉండే కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకొంటున్నాను.
ఆచార్య ఫణీంద్ర: చాలా సంతోషం. ఆనందంగా అడగండి.
భా.రా.:పద్యం ఎన్నుకొని వర్ణన చేస్తారా? లేక వర్ణనకి కొన్ని రకాల పద్యాలు బాగా అతుకుతాయా?
. : కవితకైనా ముందు వస్తువు, దాని గురించి ఏం చెప్ప దలచుకొన్నామో ఆ భావం ముఖ్యం. అది వచన కవిత్వమయినా, పద్య కవిత్వమయినా లేక మరేదైనా. ఆ భావం ఒక గాఢమైన స్పందన వల్ల కలుగుతుంది. ఏ కవికైనా ఆ భావం ఒక సమగ్ర రూపం సంతరించుకోగానే అది పదాల రూపంలో దొర్లుకొంటూ వస్తుంది. శిల్పి శిల్పం చెక్కినట్లుగా కవి అప్పుడు ఆ పదాల ప్రవాహాన్ని భావంతో సమన్వయం చేస్తూ కవితను చెక్కుతాడు. ఏ కవైనా ఒకే దెబ్బలో కవిత రాసి పారేసానంటే అతనికి పరిపక్వత లేనట్టే. శిల్పి ఒక సుందరి ముక్కు చెక్కాలనుకొంటే, ముందుగా ముఖ భాగంలో ఒక ముద్దలాంటి బొడిపెను చెక్కుతాడు. తరువాత సన్నగా, పొడువుగా మృదువుగా మొనదేలేలా చెక్కుతాడు. ఆ పైన చెలిమలు అందంగా చెక్కుతాడు. అలా సంతృప్తికరంగా వచ్చే దాకా చెక్కుతూనే ఉంటాడు.కవిత కూడా అంతే. పద్యం గురించి చెప్పమంటే ఇదంతా చెప్పుతారేంటి అనుకోకండి. అక్కడికే వస్తున్నా. అన్ని రకాల ఛందస్సులపై బాగా అభ్యాసం చేసి సిద్దంగా ఉంటే, ప్రవాహంలా దొర్లుకు వచ్చే పదాలు ఏదో ఒక ఛందస్సు ప్రారంభ గణాలలో ఒదిగి ఉంటుంది. ఇక
అక్కడి నుండి శిల్పిలా చెక్కుతూ పోవడమే.పద్యం పూర్తయినా సంతృప్తికరంగా వచ్చేవరకు అక్కడక్కడా మారుస్తూ చెక్కుతూ ఉండాలి. పూర్తిగా సంతృప్తిగా వచ్చాక శిల్పి శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచినట్టు, అప్పుడు కవితను ప్రచురించాలి. ఇది సాధారణంగా ఒక మంచి పధ్ధతి.
అయితే
అన్ని రకాల ఛందస్సులను అభ్యాసం చేసి అధికారం సాధించడం కొంచం కష్టమే. కాబట్టే మన ప్రాచీన కవులు కూడా 'ఉత్పల మాల','చంపకమాల', 'శార్దూలం', 'మత్తేభం', 'కందం', 'సీసం', 'ఆట వెలది', 'తేట గీతి' , అప్పుడప్పుడు 'మత్త కోకిల' - ఈ ఛందస్సుల లోనే విరివిగా వ్రాసేవారు. ఆధునికులు కూడా ఈ ఛందస్సులలో అధికారం సాధిస్తే చాలు. మిగితావి కావాలనుకొన్నప్పుడు కాస్త శ్రమ పడైనా ఒకటి అరా వ్రాయవచ్చు.
అయితే కొన్ని మార్లు పద్యం ఎన్నుకొని కూడా రచన చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయాన్ని గూర్చి నాలుగు పాదాలలో నాలుగు రకాలుగా వర్ణించి తుదిలో conclusion లాంటిది ఇవ్వాలనుకొంటే , సీస పద్యం బాగా ఒదుగుతుంది. అలాగే కొన్ని పేర్లను పొదుగాలి అనుకోండి. ఆ పేర్లు ఏ గణాలలో, ఏ ఛందస్సులో ఇముడుతాయో వాటినే ముందుగానే ఎన్నుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు మీ పేరే తీసుకోండి. 'భాస్కర రామిరెడ్డి'. ఇది 'ఉత్పలమాల' లో ప్రారంభ గణాలలో గాని, 'తేట గీతి' పాదం చివరి గణాలలో గాని, సరిగ్గా ఒదుగుతుంది. (సశేషం)

15, మార్చి 2009, ఆదివారం

వార్తా విశేషం - (మార్చి 2009)

ప్రఖ్యాత పద్య కవి, పండితులు, తిరుపతి వాస్తవ్యులు శ్రీ 'ముదివర్తి కొండమాచార్య' గారికి, 2009 సంవత్సరానికిగాను 'నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారం' అందించడానికి 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' నిర్ణయించిందని 'పీఠం' కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర తెలియజేసారు. 2009 ఏప్రిల్ 29 నాడు హైదరాబాదులో జరిగే నండూరి వారి జయంతి సభలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుందని ఆయన వివరించారు. ఇదే సభలో పద్య పఠనం పోటీలలో విజేతలైన ఈ క్రింది విద్యార్థినీ , విద్యార్థులకు బహుమతీ ప్రదానం కూడా చేయబడుతుంది అని ఆయన చెప్పారు.
బహుమతీ విజేతల వివరాలు : -
ప్రథమ బహుమతి : జి. రామకిషన్ (నిజామాబాద్)
ద్వితీయ బహుమతి : బి. శ్వేత గౌడ్ (హైదరాబాద్)
తృతీయ బహుమతి : జి. శ్వేత (ఒంగోలు)
ప్రోత్సాహక బహుమతులు : -
1) కే. కుమారా స్వామి (నల్గొండ)
2) ఎం. వెంకన్న (వరంగల్)
3) పి. కుసుమ (మహబూబునగర్)
4) డి. జితేంద్ర (గుంటూరు)
5) కే. మహేష్ (వరంగల్)
సభాస్థలి , కార్యక్రమ వివరాలు త్వరలో తెలుప గలమని డా. ఫణీంద్ర అన్నారు.

11, మార్చి 2009, బుధవారం

సులువుగా పద్యం వ్రాయండి ... (మార్చి 2009)

ఛందస్సు , గణాలు , 'యమాతారాజభానస' ల గోల లేకుండా పాట వ్రాసినంత సులువుగా పద్యం వ్రాయడం నేర్పుతానని గత నెలలో చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందు 'యతి' , 'ప్రాస' ల గురించి కాస్త తెలుసుకోవలసిన అవసరం ఉంది.
తెలుగు భాషకు ఎంతో అందాన్ని కొనితెచ్చిన అమూల్య వరాలు యతిప్రాసలు. తెలుగు భాషకు అవి సహజ కవచ కుండలాల వంటివని మా గురువు గారు కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య చమత్కరించే వారు. ఈ యతి ప్రాసలు కేవలం పద్యాలలోనే ఉంటాయనుకొంటే పొరపాటే. మన భాషలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఊళ్లలో నిరక్షరాస్యులు చెప్పుకొనే సామెతల్లో అవి విరవిగా కనిపిస్తాయి.
"కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడుతుంది." - ఇందులో ప్రారంభాక్షరం 'క' ఉంటే, కొంత విరామం తరువాత 'కాళ్ళ' అనే పదంలో 'కా' అన్న అక్షరం ఉంది. అంటే ఇక్కడ 'క'కి, 'కా'కి యతి కుదిరిందన్న మాట. దీనినే 'యతి మైత్రి' అంటారు.
"ధిల్లీకి రాజైనా -
తల్లికి కొడుకే." - ఇందులో మొదటి లైన్లో (పద్యంలో దీనినే పాదం అంటారు) రెండో అక్షరం 'ల్ల' ఉంటే రెండో పాదంలో కూడా అదే 'ల్ల' అక్షరం ఉంది. దీనినే 'ప్రాస' అంటారు. 90 శాతం పద్యాల్లో ఈ ప్రాస నియమం ఉంటుంది. కొన్ని రకాల పద్యాల్లో ఈ నియమం అవసరం లేదు. అంటే అవి వ్రాయడం మరింత సులువన్న మాట.
'' కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు" అన్న అన్నమాచార్య కీర్తనలో 'కొం'కి , 'కోనేటి' లోని 'కో'కి యతి మైత్రిని గమనించారా?
"ఇందరికీ అభయమ్ము నిచ్చు చేయి -
కందువగు మంచి బంగారు చేయి !" అన్న అన్నమయ్య కృతిలో పై పాదంలో రెండో అక్షరం (సున్నాతో కూడుకొన్న) 'ద' రెండో పాదంలోనూ అదే ఉంది. ఇదే ప్రాస. అలాగే మొదటి పాదంలో 'ఇం'కి , 'ఇచ్చు'లోని 'ఇ'కి యతి మైత్రి. రెండో పాదంలో 'కం'కి 'బంగారు'లోని 'గా'కి యతి మైత్రి'.
ఇది గమనించకుండా మనలో చాలా మంది "పద్యాల్లో యతి ప్రాసలు - అవి చాలా కష్ట"మంటూ భయపెడుతూ ఉంటారు. ఆ భయం పోవాలంటే భాషలో పలు చోట్ల వచ్చే యతి ప్రాసలను అవి భాషకు తెచ్చే అందాలను గమనించండి.
ఈ నెలంతా ఈ దృష్టితో ఒక కంట భాషను గమనిస్తూ, మీ పనులు మీరు చేసుకొంటూ పొండి. మీరు రోజూ మాటాడే భాషలోనే యతిప్రాసలను చేరుస్తూ భాషకు చేకూరే సొగసును గమనించండి. వచ్చే నెలలో పద్యాల్లో యతి ప్రాసలను ఎలా వేయాలన్న విషయాలను తెలుసుకొని ఆపైన పద్య రచనకు ఉపక్రమిద్దాం.
- డా. ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు)

10, మార్చి 2009, మంగళవారం

"ఆణిముత్యం" ... మార్చి 2009

మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఆణిముత్యం వంటి ఈ పద్యాన్ని ఆస్వాదించండి.
'కమ్యూనిజం' మొత్తం సారాన్ని పిండి, ఒక చిన్న పద్యంలో పొదిగి అందించిన ఘనత ఆచార్యుల వారిది.

ఎంత
మంది చెమట, ఎందరి రక్తమ్ము
పీల్చకుండ నెవడు పేర్చె ధనము?
దొరలు చేయునట్టి దోపిడీయే ఆస్తి!
అంతరించ వలయు 'ఆస్తి హక్కు' !!


పద్యంపై మీ మీ స్పందనలను, విశ్లేషణలను వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.

3, మార్చి 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి (మార్చి 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ఈ మాసం సమస్య :
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 మార్చి 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

2, మార్చి 2009, సోమవారం

ఈ మాసం పద్య కవిత (మార్చి 2009)

“శివాత్మకమ్”

shivatmakam

తెలుగు ప్రజలంతా తెలుసుకోవలసిన విషయమేమిటంటే -

శివాంశయే “త్రిలింగ” భాషగా రూపుదిద్దుకొన్నది.
శివాత్మకమైనది మన తెలుగు భాష!

“శివాత్మకమ్”
—————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
——————————–

నెలవంక రూపమే ’తలకట్టు’గా వెల్గె -
శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె -
మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై నిల్చె -
’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి -
’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ -
’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ -
’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె -
ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె -

అక్షరములౌ ఘన శివ లింగాకృతులయె
అక్షరంబులుగా ’త్రిలింగావని’పయి -
చెలువముగ నలరారుచున్ వెలుగ లిపిని,
వరలగ ’త్రిలింగ భాష’యై తరతరాలు!

*** నిజానికి ఇది పద్య కవులైన పాఠకులు పంపే పద్య కవితలను ప్రచురించే శీర్షిక. ఈ మాసానికి ఏ కవితా అందక పోవడం వలన సంపాదకుని పద్య కవితనే ప్రచురించ వలసి వచ్చింది. ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు దయచేసి కొత్త విషయాలపై వ్రాసిన తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు. కొలది పాటి తప్పులున్నా సరిదిద్ది ప్రచురించగలను. పద్య కవులను ప్రోత్సహించి, పద్య కవితా వ్యాప్తికి చేసే ప్రయత్నానికి సహకరించ ప్రార్థన.

- డా.ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు )

26, ఫిబ్రవరి 2009, గురువారం

పద్య కవులారా! "తొ" కాదు - "తో"

పద్య కవులారా! "తొ" కాదు - "తో"
-------------------------------------
డా.ఆచార్య ఫణీంద్ర

ఇటీవల అంతర్జాలంలో చాల మంది పద్య కవులు "కరుణతొ", "సీతతొ" అని పద్యాలలో వ్రాస్తున్నారు. అది తప్పు. "కరుణతో", "సీతతో" అని వ్రాయాలి. "తొ" అన్నది సాధు రూపం కాదు. తృతీయ విభక్తిలో - "చేతన్, చేన్, తోడన్, తోన్" అన్న రూపాలే ఉన్నాయి కాని, "తొన్" లేదు కదా! (వచనంలో కూడా ఇలా వ్రాయడం తప్పే అవుతుంది సుమా!) ఇలాంటిదే - షష్ఠీ విభక్తిలోని "లోన్" కూడా. "గదిలొ" అని వ్రాయకూడదు. "గదిలో" అని వ్రాయాలి.


అయితే ఈ విషయంలో గణాల కోసం ఇబ్బంది పడే పద్య కవులకు ఒక చిన్న సలహా!

ఒకవేళ "కరుణతొ బ్రోచె" అని వ్రాయాలి అనుకొందాం. అప్పుడు "కరుణను బ్రోచె" అని వ్రాయవచ్చు.
అలాగే "సీతతొ చెప్పె" అని వ్రాయాలనుకోండి. అప్పుడు "సీతకు చెప్పె" అని వ్రాయవచ్చు.
అదే విధంగా "గదిలొ" అని వ్రాయాలి అనుకొందాం. అప్పుడు "గదిని" అని వ్రాయవచ్చు.
ఇలాంటి మెలకువలు పాటించి పద్య కవులు తప్పులు లేకుండా పద్య రచన చేస్తారని ఆశిద్దాం.

" పద్యం రక్షతి రక్షితమ్ "

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సమస్యను పరిష్కరించండి - ఫిబ్రవరి 2009

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ప్రతి నెలా ఈ శీర్షిక కింద ఒక సమస్య ఇచ్చి పూరణలను ఆహ్వానిస్తామని లోగడ తెలియజేశాను.

ఫిబ్రవరి
నెలలో ఇచ్చిన సమస్య , దానికి వచ్చిన పూరణలు ఇలా ఉన్నాయి.

సమస్య : సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్ !

జిగురు సత్యనారాయణ గారి
పూరణ :

ఆకృతి దాల్చగ కూటమి
ఆ కలన సమయము వచ్చినంత తెరాసా
కైకొనెను పెక్కు సీట్లన్ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!!

ఆత్రేయ గారి
పూరణ :

పైకము, పదవులు చాలక
శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
మైకున అరచిరి ఓటిడ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!

సంపాదకుని ( డా.ఆచార్య ఫణీంద్ర ) పూరణ :

నాకిడవలె పలు సీట్లని,
లేకున్నను పొత్తులింక లేవని చెప్పెన్
ఆ కే.సీ.ఆర్. బాబుకు -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!

మార్చ్ మాసంలో మరొక కొత్త సమస్యతో మళ్ళీ కలుద్దాం.

- సంపాదకుడు

9, ఫిబ్రవరి 2009, సోమవారం

ఈ మాసం పద్య కవిత

teluguthalli2

తెలుగు వెలుగు
- డా.ఆచార్య ఫణీంద్ర

భాష ఎయ్యది దేవభాషతో పెనగూడి
జంట నాగుల నాట్య జతులు పలికె-
భాష దేనిని యతిప్రాసలే ఒనగూడి
కవచ కుండల దివ్య కాంతులొలికె-
భాష ఎద్దానికిన్ ద్వ్యర్థి మరియు త్ర్యర్థి
సత్కావ్య నిర్మాణ సత్త్వ మమరె-
కరము నే భాషరా కర్ణాట సంగీత
వాగ్గేయ కళకయ్యె పట్టుగొమ్మ-

భాష దేనిలో అవధాన భాసుర కళ
విశ్వ భాషీయులకు నెల్ల విస్తు గొలిపె-
అద్ది నాదు తెలుగు భాష! అమృత ధార!
తెలుగు గాక ఇంకెందునీ వెలుగు గలదు?

ఒక విదేశీయుడే ఉప్పొంగి స్తుతియించె
ఇది ’ఇటాలియ నాఫ్ ద ఈస్ట’టంచు -
ఒక విదేశీయుడే ఊడిగమ్మును చేసె
జీవితాంతము, దీని ఠీవి మెచ్చి -
ఒక విదేశమునందు నుత్సవా లగుచుండె
’ఆట’,’తానా’లకై ఆట పట్టు -
ఒక దేశమని కాదు - సకలావనిని నేడు
తెలుగు భాషా జ్యోతి తేజరిల్లె -

’దేశ భాషలందు తెలుగు లెస్స’ యనుట
ప్రాత వడిన మాట - శ్రోతలార!
దేశ భాషలును, విదేశ భాషలు నెల్ల
విశ్వ భాషలందు వెలుగు తెలుగు!


* ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు.

- డా.ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు )

7, ఫిబ్రవరి 2009, శనివారం

సంపాదకీయం

మహాకవి కీ.శే. డా.నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య ప్రచారం, ఆ మహనీయుని ఆదర్శాల ప్రచారం మరియు జీవితాంతం వరకు ఆయన కృషి చేసిన పద్య కవితా ప్రచారం కోసం "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" అధికార ’బ్లాగు’గా దీనిని ప్రారంభిస్తున్నాం.
ప్రతి నెలా పీఠానికి సంబంధించిన ’వార్తా విశేషా’లతోబాటుగా, ’సులువుగా పద్యం వ్రాయడం ఎలా?’, ’సమస్యా పూరణం’, ’ఆణి ముత్యం’ వంటి అనేక ఆకర్షణీయమైన శీర్శికలతో ఈ బ్లాగు నిర్వహించబడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
అలాగే ప్రతి నెలా 'ఈ మాసం పద్య కవిత' శీర్షికలో పాఠకులు పంపిన ఒక పద్య కవితను ప్రచురించదలచాం. పద్య కవులు సమకాలీన సామాజికాంశాలపై, ఆ మాసంలోని పండుగలపై, సార్వ కాలీన సర్వ జనామోద అంశాలపై చక్కని పద్య కవితలను dr.acharya_phaneendra@in.com కు తెలుగు (యూనికోడ్) లో టైపు చేసి, ఈ-మెయిల్ చేయగలరు.
ఆచార్యుల వారి శిష్యులు, అభిమానులు మరియు సాహితీ ప్రియులందరూ ఈ బ్లాగును తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బ్లాగు వీక్షకులు తమకు తోచిన ఉచిత సూచనలను వ్యాఖ్యల ద్వారా అందించి, ఈ బ్లాగు అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడగలరని ఆకాంక్షిస్తున్నాను.
- డా.ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

వార్తా విశేషం

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా "డా.నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభ" ను 29 ఏప్రిల్ 2009 నాడు హైదరాబాదులో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య శిష్యులు, సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర తెలియజేసారు. ఆ రోజు ఒక ప్రముఖ పద్య కవిని నండూరి వారి స్మారక పురస్కారంతో సత్కరించడంతోబాటు, పద్య పఠన పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతీ ప్రదానం చేయనున్నట్టు ఆయన వివరించారు. కార్యస్థలం, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని త్వరలో అందించగలమని డా.ఫణీంద్ర చెప్పారు.

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సులువుగా పద్యం వ్రాయండి

పద్యం వ్రాయడమంటే 'ఛందస్సు', 'గణాలు', 'యమాతారాజభానస', 'నజభజజజర'- అబ్బో! పెద్ద గోల అనుకోవడం సహజం. కాని ఆ బాధలేమీ లేకుండా పాట వ్రాసినంత హాయిగా, ఆటపట్టులా, అలవోకగా పద్యాలల్లే మార్గాన్ని ఈ శీర్షిక ద్వారా ప్రతి నెలా ఒక చిన్న'లెస్సన్' తో నేర్పించబోతున్నాను. ఆసక్తి గల వారు నేర్చుకొని పద్యకవులుగా రూపొందవచ్చు.
వచ్చే నెలలోనే ప్రారంభం. ఈ లోపు ముందుగా మానసికంగా సిద్ధం కండి.

సమస్యను పరిష్కరించండి

పద్యాన్ని పూరించి ఈ సమస్యను పరిష్కరించండి.
'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ప్రతి నెలా మేమిచ్చే ఒక 'సమస్య'ను పూరించి, పద్యాన్ని మీ 'వ్యాఖ్య' గా అందించండి.

ఈ నెల సమస్య : సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!
-------------------------------------------------

"ఆణి ముత్యం"

శీర్షికలో ప్రతి నెలా, మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఒక ఆణి ముత్యం లాంటి పద్యాన్ని అందించనున్నాం.

* ఏను తరచు మార్చి తెన్నొ ఉద్యోగముల్,
ఊళ్ళు, ఇళ్ళు, కార్లు, కళ్ళ జోళ్ళు -
మార్చినాడ నెన్నొ మా శ్రీమతిని తప్ప!
మధుర కవిత మీద మమత తప్ప!!