19, మార్చి 2009, గురువారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా||ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - మొదటి భాగం

భాస్కర రామిరెడ్డి: ఫణీంద్ర గారు! ఈ రోజు మీ 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' బ్లాగును చూశాను. పద్య కవిత్వ వ్యాప్తికి ఈ బ్లాగు ద్వారా మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. బ్లాగులోని మీ పాఠాలు చదవడం వల్ల పద్య కవిత్వానికి , తెలుగు భాషకు సంబంధించిన సందేహాలు తీరుతాయి. ఇటువంటి బ్లాగు కోసం గత రెండు నెలలుగా వెదుకుతున్నాను. ముందు ముందు నాకున్న సందేహాలన్నింటికి మీ బ్లాగు సమాధానాలు ఇస్తుందని ఆశిస్తాను.
అయితే ఈ ముఖాముఖి ద్వారా ముందుగా మాలాంటి వారికి ఉండే కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకొంటున్నాను.
ఆచార్య ఫణీంద్ర: చాలా సంతోషం. ఆనందంగా అడగండి.
భా.రా.:పద్యం ఎన్నుకొని వర్ణన చేస్తారా? లేక వర్ణనకి కొన్ని రకాల పద్యాలు బాగా అతుకుతాయా?
. : కవితకైనా ముందు వస్తువు, దాని గురించి ఏం చెప్ప దలచుకొన్నామో ఆ భావం ముఖ్యం. అది వచన కవిత్వమయినా, పద్య కవిత్వమయినా లేక మరేదైనా. ఆ భావం ఒక గాఢమైన స్పందన వల్ల కలుగుతుంది. ఏ కవికైనా ఆ భావం ఒక సమగ్ర రూపం సంతరించుకోగానే అది పదాల రూపంలో దొర్లుకొంటూ వస్తుంది. శిల్పి శిల్పం చెక్కినట్లుగా కవి అప్పుడు ఆ పదాల ప్రవాహాన్ని భావంతో సమన్వయం చేస్తూ కవితను చెక్కుతాడు. ఏ కవైనా ఒకే దెబ్బలో కవిత రాసి పారేసానంటే అతనికి పరిపక్వత లేనట్టే. శిల్పి ఒక సుందరి ముక్కు చెక్కాలనుకొంటే, ముందుగా ముఖ భాగంలో ఒక ముద్దలాంటి బొడిపెను చెక్కుతాడు. తరువాత సన్నగా, పొడువుగా మృదువుగా మొనదేలేలా చెక్కుతాడు. ఆ పైన చెలిమలు అందంగా చెక్కుతాడు. అలా సంతృప్తికరంగా వచ్చే దాకా చెక్కుతూనే ఉంటాడు.కవిత కూడా అంతే. పద్యం గురించి చెప్పమంటే ఇదంతా చెప్పుతారేంటి అనుకోకండి. అక్కడికే వస్తున్నా. అన్ని రకాల ఛందస్సులపై బాగా అభ్యాసం చేసి సిద్దంగా ఉంటే, ప్రవాహంలా దొర్లుకు వచ్చే పదాలు ఏదో ఒక ఛందస్సు ప్రారంభ గణాలలో ఒదిగి ఉంటుంది. ఇక
అక్కడి నుండి శిల్పిలా చెక్కుతూ పోవడమే.పద్యం పూర్తయినా సంతృప్తికరంగా వచ్చేవరకు అక్కడక్కడా మారుస్తూ చెక్కుతూ ఉండాలి. పూర్తిగా సంతృప్తిగా వచ్చాక శిల్పి శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచినట్టు, అప్పుడు కవితను ప్రచురించాలి. ఇది సాధారణంగా ఒక మంచి పధ్ధతి.
అయితే
అన్ని రకాల ఛందస్సులను అభ్యాసం చేసి అధికారం సాధించడం కొంచం కష్టమే. కాబట్టే మన ప్రాచీన కవులు కూడా 'ఉత్పల మాల','చంపకమాల', 'శార్దూలం', 'మత్తేభం', 'కందం', 'సీసం', 'ఆట వెలది', 'తేట గీతి' , అప్పుడప్పుడు 'మత్త కోకిల' - ఈ ఛందస్సుల లోనే విరివిగా వ్రాసేవారు. ఆధునికులు కూడా ఈ ఛందస్సులలో అధికారం సాధిస్తే చాలు. మిగితావి కావాలనుకొన్నప్పుడు కాస్త శ్రమ పడైనా ఒకటి అరా వ్రాయవచ్చు.
అయితే కొన్ని మార్లు పద్యం ఎన్నుకొని కూడా రచన చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయాన్ని గూర్చి నాలుగు పాదాలలో నాలుగు రకాలుగా వర్ణించి తుదిలో conclusion లాంటిది ఇవ్వాలనుకొంటే , సీస పద్యం బాగా ఒదుగుతుంది. అలాగే కొన్ని పేర్లను పొదుగాలి అనుకోండి. ఆ పేర్లు ఏ గణాలలో, ఏ ఛందస్సులో ఇముడుతాయో వాటినే ముందుగానే ఎన్నుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు మీ పేరే తీసుకోండి. 'భాస్కర రామిరెడ్డి'. ఇది 'ఉత్పలమాల' లో ప్రారంభ గణాలలో గాని, 'తేట గీతి' పాదం చివరి గణాలలో గాని, సరిగ్గా ఒదుగుతుంది. (సశేషం)

1 కామెంట్‌:

  1. ఆచార్య ఫణింద్ర గారు, సహృదయంతో శ్రమకోర్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఓర్పుతో నా ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు.సదా కృతఙ్ఞుడను.

    రిప్లయితొలగించండి