4, డిసెంబర్ 2012, మంగళవారం

సి.డి. ఆవిష్కరణ కార్యక్రమ వివరాలు ...



మా గురువు గారు రచించిన ’జ్యోత్స్నాభిసారిక’ నృత్య నాటిక - సి.డి. ఆవిష్కరణ సభ 30-11-2012 నాటి సాయంత్రం  వైభవోపేతంగా జరిగింది. కార్యక్రమారంభంలో జరిగిన కవి సమ్మేళనంలో మా గురువు గారిని స్తుతిస్తూ పలువురు కవులు వినిపించిన కవితలు శ్రోతలను అలరించాయి. ఆ కార్యక్రమ వివరాలు, కవి సమ్మేళనంలో నేను వినిపించిన కవిత ఇక్కడ అందిస్తున్నాను. ఈ కవి సమ్మేళనంలో నాతోబాటు పాల్గొన్న కవి మిత్రులు, "ఆంధ్రామృతం" బ్లాగరు - శ్రీ చింతా రామకృష్ణారావు గారిని మొదటి సారిగా కలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది.


- డా. ఆచార్య ఫణీంద్ర




                    ("నమస్తే తెలంగాణ" వార్తా పత్రిక సౌజన్యంతో ...)  


"నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -"  [కవిత]

రచన: 'పద్య కళాప్రవీణ' డా. ఆచార్య ఫణీంద్ర


ఎవ్వాని భావాల కివ్వేళయే గాక 
    భావియున్ తల వంచి ప్రణతు లిడును -
ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై 
    ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
     నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
     దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -

అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య  సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!

కువలయమున నున్న కుటిల నీతిని ఎత్తి,
కుండ బ్రద్దలట్లు కొట్టి చూపి, 
అభ్యుదయ పథమ్ము ’నాలోచనము’ పేర
వెలయ జేసితి ’వధి వేమ’నగుచు!

ఎలమి డెబ్బదేండ్లకు పైన ఏకధాటి
పద్య రత్నముల్ సృజియించి ప్రణుతి కెక్కి
నట్టి ’నండూరి రామ కృష్ణా’ఖ్య సుకవి!
మహిని పద్యమ్మునకు నీవు మారు పేరు!

అతుల కవీశ్వరా! సుకవితాంబకు ముద్దుల పట్టి! పండిత
స్తుత ఘన సాహితీ కుసుమ శోభన వాటిక యందు మేటి క
ల్ప తరువునై, సుధా రస మపారము చిప్పిలు పద్య సత్ఫలాల్
శతము లొసంగితో! పలుకు శాసనమౌ గురుదేవ! మ్రొక్కెదన్! 


                       ---***---

29, నవంబర్ 2012, గురువారం

"జ్యోత్స్నాభిసారిక" - సి.డి. ఆవిష్కరణ

మా గురువు గారు మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారు రచించిన "జ్యోత్స్నాభిసారిక" (నృత్య నాటిక) సి.డి. ఆవిష్కరణ సభ రేపు (నవంబర్ 30 న) సాయంత్రం  5.30 గం||లకు, హైదరాబాదులోని  త్యాగరాయ గాన సభ మినీ హాలులో జరుగుతుంది. ఈ సందర్భంగా నండూరి వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ పలువురు కవులు కవి సమ్మేళనంలో పాల్గొంటారు. కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్యాభిమానులందరికి "జ్యోత్స్నాభిసారిక"  సి.డి.ని నిర్వాహకులు ఉచితంగా అందజేస్తారు. జంట నగరాలలోని సాహిత్యాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన!

- డా. ఆచార్య ఫణీంద్ర 
కార్యదర్శి, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

14, నవంబర్ 2012, బుధవారం

నండూరి వారి ముక్తకాలు - 3


మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి ముక్తక పద్యాలు - 3 భాగం మీ కోసం ... ఆస్వాదించండి.
డా. ఆచార్య ఫణీంద్ర




8, నవంబర్ 2012, గురువారం

నండూరి వారి ముక్తకాలు - 2

మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి ముక్తక పద్యాలు - 2 భాగం మీ కోసం ... ఆస్వాదించండి.

( మా గురువు గారి ఆశీస్సుల వలన ఇది నా ఈ బ్లాగులో 100వ పోస్ట్ ... )


- డా. ఆచార్య ఫణీంద్ర

                                                     
                                                 
                 

(మరి కొన్ని రో  పోస్ట్లో ... )

15, అక్టోబర్ 2012, సోమవారం

నండూరి వారి ముక్తకాలు - 1


మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి ముక్తక పద్యాలను కొన్నింటిని అప్పుడప్పుడూ ధారావాహికంగా అందించబోతున్నాను. మొదటి భాగం మీ కోసం ... ఆస్వాదించండి




11, జులై 2012, బుధవారం

దివాకర్ల వారి శతజయంతి సభా విశేషాలు

’నవ్య సాహితీ సమితి’ ఇటీవల నిర్వహించిన "దివాకర్ల వారి శతజయంతి సభ" విశేషాలను ప్రచురించిన కొన్ని దిన పత్రికల భాగాలను చూడండి.


- డా. ఆచార్య ఫణీంద్ర 



  సాక్షి : 



నమస్తే తెలంగాణ :




ఆంధ్రజ్యోతి :










7, జులై 2012, శనివారం

దివాకర్ల వారి శతజయంతి సంస్మరణ సభ


సారస్వత మహనీయ మూర్తి ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి శత జయంతి సంస్మరణ సభలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా జంట నగరాలలోని సాహిత్యాభిమానులను కోరుతూ అందిస్తున్న ఆహ్వాన పత్రిక :


18, జూన్ 2012, సోమవారం

కరుణశ్రీ పద్యం - హాస్యం / తాత్త్వికత






వేషము వేసి పంపితివి వేదిక మీదికి - ఆడు వేళ, నా
మీసము జారిపోయి విషమించె పరిస్థితి - ప్రేక్షకుల్ పరీ
హాసము సేయుచుండిరి - రహస్యముగా తెర వేయవచ్చు నీ
కోసము జూచితిన్ - కసరుకొంటి, విదెక్కడి దర్శకత్వమో?




’కరుణశ్రీ’ జంధ్యాల పాపయ శాస్త్రి కలం నుండి జాలువారిన కమనీయ పద్యం ఇది. పైకి హాస్య పద్యంలా కనిపించినా, గూఢార్థం గమనిస్తే తాత్త్వికత ఉట్టిపడే శ్లేషార్థ రచన ఇది. 


సామాన్యార్థంలో చూస్తే - ఒక నటుడు తాను నటిస్తున్న నాటకం యొక్క దర్శకుణ్ణి - "నాకు వేషం వేసి వేదిక మీదికి పంపావు. నేను నటిస్తున్నప్పుడు నా పెట్టుడు మీసం జారిపోయింది. ప్రేక్షకులు నన్ను గేలి చేస్తూ ఉన్నారు. నాకు ఏం చేయాలో తోచని అయోమయంలో చిక్కుకొన్నాను. రహస్యంగా తెర వేసి, నన్ను కాపాడుతావేమో... అని చూసాను. నువ్వేమో అందుకు విరుద్ధంగా నన్నే కసరుకొన్నావు. నువ్వు వెలగబెట్టే దర్శకత్వమేమిటో నాకయితే అర్థం కావడం లేదు." అని నిలదీస్తున్నాడు ఈ పద్యంలో. సాధారణంగా నాటక ప్రదర్శనలలో జరిగే హాస్య సంఘటనలా ఇది అనిపించి నవ్వు పుట్టిస్తుంది. 


కానీ, విశేషార్థంలో అవగాహన చేసుకొంటే - ఇది జీవితం మీద విరక్తి పుట్టిన మనిషి, దేవునితో - "నాకు మానవుని వేషం వేసి, ఈ భూమి అనే వేదిక మీదికి పంపావు. నా జీవన గమనంలో ’నేను’ అన్న అహంకారంతో విర్రవీగుతుంటే నాకు తగిన పరాభవమై, నా మీసం జారిపోయినట్టై విషమ పరిస్థితిలో చిక్కుకొన్నాను. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ నన్ను అవహేళన చేస్తున్నారు. నాకు బ్రతుకు మీద విరక్తి పుట్టి, నువ్వైనా నా జీవితానికి ముగింపు పలుకుతావేమోనని చూసాను. నువ్వూ నన్నే కసరుకొన్నావు. హారి భగవంతుడా! నీ లీల ఏమిటో నా కర్థం కావడం లేదు." అంటూ తన వేదనను వెళ్ళబోసుకొంటున్నట్టుగా అర్థం స్ఫురిస్తుంది. ఈ భావన అవగతం కాగానే హృదయం ఆర్ద్రం అవుతుంది. 


చూసారా? అదీ మహాకవి కరుణశ్రీ భావ శబలత!

- డా. ఆచార్య ఫణీంద్ర      








27, మే 2012, ఆదివారం

దుష్ట సమాసాలు - చర్చ


  గతంలో ఈ బ్లాగు ద్వారా అందించిన 'ఛందస్సు పాఠాలు', 'సమాస ప్రయోగాలలో గమనించవలసిన విషయాలు'... ఇప్పటికీ చాల మంది రిఫర్ చేయడం - ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అయితే తరువాతి కాలంలో బిజీ అవడం వలన నేను ఆ పాఠాలను కొనసాగించలేక పోయాను.

ఆ తరువాత మిత్రులు కంది శంకరయ్య గారు అందుకొని, తమ ’శంకరాభరణం’ బ్లాగు ద్వారా ఇలాంటి పాఠాలను, చర్చలను విరివిగా అందిస్తూ విశేషమైన భాషా సేవ చేస్తున్నారు.

ఆరు నెలల క్రితం అలాంటి చర్చ ఒకటి ఆ బ్లాగులో జరిగింది. అందులో నా పాఠాల ప్రసక్తి రావడం.. ఎవరో .. రాంమోహన శర్మగారు (అజ్ఞాత) తమకు తెలిసిందే సర్వస్వమని భావించి వ్యాఖ్యానించడం జరిగింది.

ఆరు నెలల తరువాత... మొన్న నేను దానిని చూసి సమాధానం వ్యాఖ్యగా ఇచ్చాను.

అయితే అందులోని సారాంశం అందరికీ అందవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ చర్చనంతా ఇక్కడ టపా గా అందిస్తున్నాను.

రాం మోహన శర్మ గారూ! మీరు ఎక్కడున్నారో గాని ... మీరు ఇంకా ఏమయినా చర్చించాలనుకొంటే - నేను సిద్ధమే!


- డా. ఆచార్య ఫణీంద్ర



"గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

    శ్యామలీయము గారూ దయచేసి యీ ప్రయత్నము ఎలా ఉన్నదో పరిశీలిస్తారా !

    మింట నిండగ గాషాయ మిసిమి, పసుపు
    చంద్ర వంకయు పొడచూప జవితి దినము
    కలలు మెదలుచు మది రేప నలల నా ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ !
    November 28, 2011 8:50 PM

శ్యామలీయం చెప్పారు...

    నరసింహమూర్తిగారూ, మీ పద్యంలో కాషాయ మిసిమి అని వర్ణాలను విడిగా చెబుతున్నారా? అయినా యీ మాటలతో సమాసం చేయరాదు. కాషాయం సంస్కృతం. మిసిమి తెలుగు. అలాగే పసుపు చంద్రవంక అంటున్నారు. పసుపుపచ్చని చంద్రవంక అని మీ భావం అనుకుంటాను. పచ్చనిచంద్రవంక అనాలికాని పసుపు చంద్రవంక అనరాదనుకుంటాను. ఇంకా బాగా పసిమిచంద్రవంక అంటే భేషుగ్గా ఉంటుంది. చవితిదినము కన్నా చవితనాడు అన్నది బాగుంటుందని నా అభిప్రాయం. మీది గణం ప్రకారం సరైనదే.
    November 28, 2011 10:15 PM


శ్యామలీయం చెప్పారు...

    నరసింహమూర్తిగారు, 'చవితినాడు' అనేది దుష్టసమాసం కాదండీ. చతుర్ధి అనేది సంస్కృతం. చవితి అన్నమాట తెలుగే, చతుర్ధి నుండి పుట్టిన మాట. అయితే, దినము అనేది దినమ్ అనే సంస్కృత పదమే కదా. కా బట్టి చవితదినము అనేది దుష్టసమాసం . కాని చవితినాడు అనేది సరైన ప్రయోగమే.
    November 29, 2011 8:31 AM


అజ్ఞాత చెప్పారు...

    చవితి అనేది తెలుగు కాబట్టి చవితి దినము అనకూడదా ? చూడబోతే ' వినాయక చవితి ' అనేది కూడా దుష్ట సమాసమే అనేలా ఉన్నారు . అయినా తెలుగు పదం తరువాత సంస్కృతం రావచ్చని సారు గారికి తెలీదా ? ఒక వేళ చవితి తెలుగే అనుకున్నా , దినం సంస్కృతమే అయినా , తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చు . కాబట్టి చవితి దినము అనవచ్చు . ఇలా వచ్చీ రాని పాండిత్యంతో తప్పుడు పాఠాలు చెప్పడం మహా పాపం . అయ్యా శంకరయ్య గారు , మీ బ్లాగు కి నేనో పాఠకుణ్ణి మాత్రమే నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు . దయచేసి ఇలాంటి తప్పుడు పాఠాల్ని బోధింపజేయకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది .
    - రాం మోహన్ శర్మ .
    November 30, 2011 12:19 PM

శ్యామలీయం చెప్పారు...

    చాలా ఆలస్యంగా గమనించాను. ఈ అజ్ఞాత గారు నన్ను మహా పాపిని చేయటం చూడటం జరిగింది. నేనేమీ పరమపుణ్యాత్ముడనని భ్రమలో లేను కాబట్టి ఆశ్చర్యపోవటం లేదు. ఎవరిక కైనా అపోహ ఉంటే మన్నించాలి. అజ్ఞాత గారు అనుమాన పడుతున్నట్లు నేనేమీ పాఠాలు చెప్పటం లేదిక్కడ. అలా చెప్పేందుకు నేను కవినీ గాను పండితుడనూ కాను. ఈ విషయం యీ బ్లాగులో వారికి ఇప్పటికే ఒకటి రెండు సార్లు విన్నవించటం జరింగింది. 'నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు'నని అన్నారు అజ్ఞాతగారు. నాకేమీ కవితాధార ఉట్టిపడిపోతోందన్న భ్రమ నాకేమీ లేదు. నాకు పెద్దగా తెలుగురాదని నాకు అజ్ఞాతగారు చెప్పకముందే తెలుసు, బ్లాగుమిత్రులకూ తెలుసు. తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చునన తెలియజేసినందుకు కృతజ్ఞుడను.
    December 02, 2011 2:11 PM

శ్యామలీయం చెప్పారు...

    సందేహ నివృత్తి కోసం యీ మహాపాపిబిరుదాంకితుడు వెబ్ ప్రపంచాన్ని గాలించటం జరిగింది. " నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర బ్లాగులో యీ క్రింది టపా సందేహనివృత్తి చేసింది:
    http://dracharyaphaneendra.blogspot.com/2009/03/haaramcom_31.html
    సూక్ష్మంగా అక్కడి సమాచారం:
    ఆ.ఫ.:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు.......
    ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. .........
    అజ్ఞాతగారు నాకు పాపవిముక్తి ప్రసాదిస్తారేమో చూడాలి!
    December 02, 2011 3:01 PM

కంది శంకరయ్య చెప్పారు...

    శ్యామల రావు గారూ,
    అజ్ఞాతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఇంతకుముందే విజ్ఞప్తి చేసాను. గత కొన్ని రోజులుగా నేనొక సమస్యతో సతమతమౌతూ బ్లాగుకు వచ్చే వ్యాఖ్యలను పరిశీలించలేదు. లేకుంటే ఆ వ్యాఖ్యను అప్పుడే తొలగించి ఉండే వాణ్ణి. ఈ మధ్య మన బ్లాగుమీద అజ్ఞాతల దాడి తరుచుగా జరుగుతున్నది. నిజంగా ఆ రోజు జరిగిన చర్చను నిశితంగా పరిశీలించి ఉంటే అజ్ఞాత అలా వ్యాఖ్యానించి ఉండేవారు కాదేమో? ఆనాటి చర్చావ్యాఖ్యలను అజ్ఞాత పూర్తిగా చదవలేదని కచ్చితంగా చెప్పవచ్చు.
    December 02, 2011 4:38 PM

అజ్ఞాత చెప్పారు...

    పిల్లికి ఎలుక సాక్ష్యం అని ఒకటుందండి . ఈ పై నుదాహరణ అలాంటిది . ఎందుకంటే పాలాభిషేకం ఖచ్చితంగా తప్పు . అక్కడ సంధి తప్పు . అదేం పాలాభిషేకం అని సవర్ణదీర్ఘసంధి ఎలా అవుతుంది ? కాని మర్రి వృక్షము అనవచ్చు- మర్రి తెలుగు , వృక్షము సంస్కృతం , కాని సమాసం తప్పు కాదు . రూపక సమాసం .
    అక్కడ చెప్పినట్టు సంస్కృతం వచ్చిన తరువత తెలుగు పదం తో సమాసం చేస్తేనే తప్పు అవుతుంది . వృక్ష నీడ . అని అంటే అది తప్పు . రెండు వేరు వేరు పదాలైనప్పుడు , తెలుగు ముందు వచ్చిన తరువాత సంస్కృతం రావచ్చని చిన్నప్పుడే నేర్పించే బేసిక్ పాయింటు .

    పెద్ద కుమారుడు , విన్న వాక్యం , కన్న సాక్ష్యం , తీపి జ్ఞాపకం , మంచి వ్యక్తి , ఇంటి దీపం , జంట కవిత్వం ఇలా ఎన్ని పదాలు చెప్పాలండి మీకు ? అన్నింట్లో తెలుగు దాని తరువాత సంస్కృతం తో సమాసం కాలేదా ?

    సంస్కృతం తరువాత తెలుగు తో మాత్రం సమాసం చేయకూడదని తెలుసు , ప్రాణ గొడ్డము , వానర మూక ఇల్లాంటివి .
    ఇవి తెలీకుండా పాఠం చెప్పినందుకే అలా అన్నాను , ఎవరిని నొప్పించాలని కాదు. కావాలంటే మీరింకో తెలుగు పండితుడిని అడిగి సందేహం నివృత్తి చేసుకొండి . అంతే కాని తెలియని వన్ని తప్పులు అనడం తప్పే .
    అన్నట్టు నేను అజ్ఞాత కాదు - నా పేరు రాం మోహన్ శర్మ అని పైనే చెప్పాను . వృత్తిరీత్యా తెలుగు పండితుడిని కాదు కానీ అభిమానం ఈ బ్లాగు రెగ్యులర్ గా చదువుతాను . ఇంక ఇంతకంటే చెప్పడం న వల్ల కాదు. శంకరయ్యగారికి , మనసు నొచ్చుకుని ఉంటే క్షమించండి
    December 02, 2011 7:12 PM

శ్యామలీయం చెప్పారు...
    ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
    December 02, 2011 8:37 PM

శ్యామలీయం చెప్పారు...

    అజ్ఞాత/రాం మోహన్ శర్మగారూ, నా పరిమితులు నాకూ, అందరు బ్లాగు సభ్యులకూ చక్కగా తెలుసు కాబట్టి పాఠం చెబుతున్నానుకోరెవరూ. అలాగే పెద్దలను సంప్రతిస్తాను. నన్ను మహాపాపి అంటే అన్నారు కాని, డా. ఆచార్య ఫణీంద్రగారిని మీరు యెలక అనటం వింతగా ఉంది. ఈ చర్చ సమాప్తం.
    శంకరయ్యగారు: మన్నించాలి, అజ్ఞాతగారు ముఖ్యమైన చర్చనీయాంశం లేవనెత్తినందువలనే నేను స్పందించాను. ఒక రకంగా ఇది నాకు మనస్తాపం మిగిల్చింది. నావల్ల మరొక పెద్దమనిషికి చెడ్డమాట తగిలింది. ఇక ముందు మరింత జాగ్రత్త తీసుకుంటాను.
    December 02, 2011 8:42 PM

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

    గురువుగారూ,

    నాదొక చిన్న సందేహము. పైన జరిగిన చర్చలో చూస్తే, తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చు కానీ సంస్కృత పదము తరువాత తెలుగు పదముతో సమాసము చేయలేమనివుంది.

    అప్పుడు, "పాలాభిషేకము" అనే సమాసములో "పాలు" తెలుగు పదము, "అభిషేకము" సంస్కృతపదము కదా, మరి ఎందుకు ఇది దుష్టసమాసము అయింది?? వివరించ వలసినదిగా ప్రార్థన. లేదా తెలుగుపదాలతోటి అన్యభాషా పదాలతో (సంస్కృతపదాలతో కూడా ) సమాసమెప్పుడూ దుష్టసమాసమేనా??

    గురువుగారూ, చర్చను తప్పుదోవ పట్టించేలా వుంటే ఇంకెప్పుడైన సందేహనివృత్తి చేసుకొంటాను. ఇంది ఇంతటితో వదిలేద్దాం.
    December 02, 2011 9:16 PM

శ్యామలీయం చెప్పారు...

    సంపత్కుమారులవారూ, సంస్కృతాంధ్రపదాలను యేక్రమంలోనూ కలిపి సమాసం చేయరాదని అలాచేస్తే దుష్టసమాసమని నేనూ, అలాగాక తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చునని శ్రీ రాం మోహన్ శర్మగారూ అభిప్రాయ పడ్డాము. వాడి-వేడి ప్రక్కన పెడితే, యీ విషయంలో అందరకూ ఆసక్తి ఉంది. అపండితుడనైన నేను కూడా పెద్దలను అడిగి నిష్కర్ష చేసుకోవా లనుకుంటున్నాను. వాదనకు కాదు, అలా చేయటం వలన నా భాష మరింత పరిపుష్టం అవుతుందని.
    December 03, 2011 9:59 AM

శ్యామలీయం చెప్పారు...

    సంపత్కుమారులవారూ,
    పాలు + అభిషేకము --> పాలాభిషేకము సవర్ణదీర్ఘ సంధి. ఇది చెల్లదు.
    ఇలా, తెలుగు సంస్కృత పదామధ్య సంధి చేయటం కుదరదు.
    సవర్ణదీర్ఘ సంధి కేవలం రెండు సంస్కృతపదాల మధ్య జరిగే సంధి.
    December 03, 2011 10:02 AM

మిస్సన్న చెప్పారు...

    శ్రీ శ్యామలీయమ్ గారు శ్రీ రామ్ మోహన శర్మ గార్లు
    కొద్దిగా సంయమనం పాటిస్తే వారి చర్చల ద్వారా మిత్రులందరికీ
    అమూల్యమైన భాషా జ్ఞానాన్ని అందించిన వారవుతారు.
    December 03, 2011 10:12 PM

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

    ఈ చర్చను ఆలస్యంగా ఈరోజే (24-05-2012) చూసాను.
    రాంమోహన శర్మ గారి వాదన కొంత వరకు పండితులు అంగీకరించిందే. అయితే అది పూర్తిగా ఆమోదయోగ్యమయిన వాదన కాదు. "’పాలాభిషేకం’ సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి తప్పు - అంతే కాని, తెలుగుపై సంస్కృతం రావడం వలన కాదు" అన్నారు. మరి ఉత్వ సంధి చేసి .. ’పాలభిషేకం’ అంటే సాధువవుతుందా? ’నల్ల బంగారం’ను ’నల్ల స్వర్ణం’ అంటే బాగుంటుందా? ’బుద్ధి హీనులు’ అని కాకుండా ’తెలివి హీనులు’ అంటే అందరూ ఆమోదిస్తారా? ఇవన్నీ తెలుగు సారస్వత రంగంలో -నిక్కచ్చిగా ఉండే పండితులకు, కొంత ఆధునిక దృష్టితో వెసులుబాటు కోరుకొనే పండితులకు మధ్య ఫలితం తేలకుండా  తరతరాలుగా సాగుతున్న చర్చనీయాంశాలు. శ్రవణ సుభగమైతే కొన్ని సార్లు తెలుగుల మీద సంస్కృతాలను కొందరు పండితులు ఆమోదిస్తున్నారు. అందులో నేనూ ఒకణ్ణి. ఎందుకంటే నా దృష్టిలో భాష - నిశ్చల పర్వతం కాదు .. ప్రవహించే జీవ నది. ఈ విషయాన్ని పండితులంతా గమనిస్తే మంచిది.
    అంతో.. ఇంతో పాండిత్యం గల రాంమోహన శర్మ గారు పిల్లులు, ఎలుకల సామెతలు చెప్పడం శోభించదు.
    May 24, 2012 9:20 PM "

12, మే 2012, శనివారం

ఈ మాసం పద్య కవిత : 'భైరవభట్ల' వారి "ముసలి వాని ప్రేమ లేఖ"

గతంలో ఈ బ్లాగులో వివిధ కవుల సత్కవితలను 'ఈ మాసం పద్య కవిత' శీర్షికతో ప్రచురించే వాణ్ణి. ఈ మధ్య కాలంలో అలాంటి కవితలెవరూ అందించక పోవడంతో కొన్నాళ్ళు అంతరాయం ఏర్పడింది.
కాని మొన్నీమధ్య   భైరవభట్ల కామేశ్వర రావు గారి కవితను చదివాక, దానిని మరచి పోలేక పోతున్నాను. అది నన్ను వెంటాడుతూనే ఉంది. దానికి మరింత ప్రచారం కలిగించడం 'ఆంధ్ర పద్య కవితా సదస్సు' ఉపాధ్యక్షునిగా, 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతగా భావిస్తూ ఇక్కడ ప్రచురిస్తున్నాను.
 భైరవభట్ల కామేశ్వర రావు గారికి అభినందన పూర్వక ధన్యవాదాలతో 
డా. ఆచార్య ఫణీంద్ర 

ముసలివాని ప్రేమలేఖ 
రచన: శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు







ప్రియమగు భార్య సన్నిధికి ప్రేమగ నీ పతి వ్రాయు లేఖ, ఆ
దయగల దైవమే మనల దారుణరీతిని వేరు జేసె, యీ
వయసున నొంటిగా బ్రతుకు భారము నీడ్చుట కష్టమే సుమీ!
అయినను నీ స్మృతుల్ కవితలల్లుచు కాలము నెట్టుచుంటి నే

చూచి యేళ్ళు దాటె నీ చిన్నకొడుకుని,
పక్షమయ్య పెద్దవాని గలసి
ఎవరి బ్రతుకు వారి దీ తండ్రి కోసమై
సమయమీయ నెవరి సాధ్యమగును!

కన్నకొడుకులు నన్నింత కనికరించి
వృద్ధ శరణాలయమ్మున వేసినారు
నెలకి చెరి యైదువందల నిచ్చుచుండి
రింత యైనను చేయు వారెంతమంది?

ఐన నదేమొగాని హృదయమ్మున నొక్క విషాదరేఖ, దుః
ఖానల తప్తమైనటుల ఆత్మ తపించుచునుండె, గుండెలో
యే నరమో కలుక్కుమను యే గతజీవిత జ్ఞాపకమ్ములో
మానసవీధిలో నిలచి మాటికి మాటికి గేలిసేయగా!

ప్రక్కచూపులు చూడ పసిగట్టి ఒక మొట్టి
కాయను నెత్తిపై వేయు చేయి,
గోరుచుట్టైనపుడు కొసరి గోర్ముద్దలు
ప్రేమ మీరగ తినిపించు చేయి,
పొలమారినంతనె తలచెనెవరో యంచు
తలపైని పలుమార్లు తట్టు చేయి,
నడిరేయి దడబుట్టి తడబాటుతో లేచి
నప్పుడు గుండెల నద్దు చేయి,

పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!
ఒక్క చేయి రాదె ఓదార్పు నీయగా
మ్రోడులేమొ! యెదలు బీడులేమొ!

నీడవైన నీవే నను వీడినావు
ఆదరింతురె నన్నింక అయినవారు?
కట్టె ముట్టించుటకె వేచె కన్నకొడుకు
లక్కటా! యేల జీవిత మారిపోదు?

ప్రతి ఉదయము సూర్యుడు నను,
"బ్రతికే ఉన్నావ?" అనుచు ప్రశ్నించినటుల్
మతి దోచును! సతి వీడిన
పతి జీవన్మృతుడు శుష్కవాక్యము రీతిన్!

ఇచట నావంటి వార లనేకమంది
యంత్ర జీవితమనెడి బకాసురునకు
కన్నబిడ్డల బలిజేసి ఖిన్నులగుచు
మూగమనసుల రోదించు ముసలివారు!

ఆదివారము అనుమతింతురు అతిథి జనులను లోనికిన్
ఎదురు జూతురు, ఎదురు జూతురు, ఎదురు
 జూతురు ఆశతో!
చెదరిపోవును ఆశ కాటుక చీకటుల్ చెలరేగగా
ముదుమి మనసుల మరల మరలిటు మోసపుచ్చుట న్యాయమే?

కాటికి కాలుసాచియు నకారణ మీ మమకార బంధముల్
ఏటికి సెప్పు? కాని మనసే వినదాయెను, నాది నాదనున్!
పూటకి పూట కష్టమయి పోయెను లోకపు చీకటింట యీ
నాటక, మింక చాలు, తుది నా గది తల్పులు తట్టుటెన్నడో?

నిన్ను చేరు వేళ యెన్నాళ్ళ కెన్నాళ్ళ
కనుచు, కనుచు నుంటి కాలుని దెస
క్షణము యుగములైన కాలమ్ము సాగదు
మరణమునకునైన కరుణ రాదు!

వెతలు వెళ్ళగ్రక్కి వేదన రగిలించ
వేడ్క కాదు, కాని వెఱ్ఱి మనసు
ఊరుకోదు! బాధ నోరార జెప్పగా
ఎవరు గలరు నాకు, నీవు తప్ప?

ఇప్పటికే నా బాధలు
చెప్పీ చెప్పీ మనస్సు చెడగొట్టితినా?
చప్పున నిక ముగియించక
తప్పదు...

మరి సెలవు,
                                       నీ సదా,
                                       హృదయశ్రీ.

1, మే 2012, మంగళవారం

సరస సల్లాపము - 21





చరిత్రలో దాఖలాలు లేవు గాని, కవయిత్రి మొల్లమాంబకు, తెనాలి రామకృష్ణునికి వాగ్యుద్ధాలు జరిగినట్లుగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
అలాంటిదే ఇది.
మొల్ల కుమ్మరి పిల్ల అని జగమెల్ల ఎరిగినదే. ఒకనాడు ఆమె సంతలో కుండలను పెట్టుకొని అమ్ముకొంటుంది. ఆ సమయంలో అటువైపు వచ్చిన తెనాలి రామకృష్ణుడు కొంటెతనంతో ఆమె చెంతకు చేరి, సమాన పరిమాణంలో ఉన్న రెండు కుండలను చేతితో చూపుతూ, కళ్ళతో ఆమె స్థన యుగ్మాన్ని వీక్షిస్తూ - " పిల్లా! నీ కుంభద్వయిని ఎంత కిస్తావు?" అని అడిగినాడు. 
దానికి ఆ కవయిత్రి ఇచ్చిన  సమాధానం - "నేను నీకు అమ్మనురా!"

30, ఏప్రిల్ 2012, సోమవారం

ఈనాటి పత్రికలలో...


నిన్న మేము నిర్వహించిన మా గురువుగారి జయంతి మహోత్సవ వివరాలను నేటి దినపత్రికలలో చదివి తెలుసుకోండి. - డా. ఆచార్య ఫణీంద్ర ............................................................................................................ సాక్షి :
ఈనాడు :
నమస్తే తెలంగాణ :

26, ఏప్రిల్ 2012, గురువారం

సాహిత్యాభిమానులకు స్వాగతం!


జంట నగరాలలోని సాహిత్యాభిమానులు, మహాకవి ’నండూరి రామకృష్ణమాచార్య’ శిష్యులు,అభిమానులు అందరూ 29 ఏప్రిల్ 2012 నాడు సాయంత్రం ఆరు గంటలకు సుల్తాన్ బజార్ లోనున్న ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’లో నిర్వహించబడుతున్న ఆ మహాకవి జయంతి మహోత్సవానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక మీ కోసం -
- డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

23, ఏప్రిల్ 2012, సోమవారం

పద్య కవితా పురస్కారం - 2012


వార్తా విశేషాలు : ఏప్రిల్ 2012
2012 వ సంవత్సరానికిగాను ’నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారం’ సుప్రసిద్ధ పద్యకవి శ్రీ దుగ్గిరాల రామారావుకు ప్రదానం చేయనున్నట్టు ’నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం’ ప్రధాన కార్యదర్శి ’డా. ఆచార్య ఫణీంద్ర’ ప్రకటించారు. ’అమృత కలశం’, ’ఆంధ్ర రస మంజరి’, ’కామేశ్వరీ వైభవం’ వంటి ఎన్నో సుమధుర కావ్యాలను వెలయించిన రామారావు గారు యువకవిగానే, తిరుపతి వేంకట కవులలో ఒకరైన ’చెల్లపిళ్ళ వేంకట శాస్త్రి’ గారి ఆశీస్సులను అందుకొన్నారు. చెన్నై వాస్తవ్యులుగా ఉన్నప్పుడు ఆయనకు 'ఆరుద్ర', 'ఆత్రేయ'లతో బాటు 'మద్రాసు విశ్వ విద్యాలయం' తెలుగు పండితులు అనేకులతో సాహచర్యం లభించింది. ఆ తరువాత హైదరాబాదు చేరుకొన్నాక, 'డా. సి.నారాయణ రెడ్డి', 'డా. నండూరి రామకృష్ణమాచార్య' వంటి మహాకవుల ప్రశంసల నందుకొన్నారు. దుగ్గిరాల వారు తమ 'అమృత కలశం' కావ్యానికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం' పురస్కారం అందుకొన్నారు. దుగ్గిరాల రామారావు గారికి ఈ నెల 29 నాడు హైదరాబాదులోని 'శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం'లో ’నండూరి రామకృష్ణమాచార్య 92వ జయంత్యుత్సవ సభ’లో నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని పలువురు ప్రముఖ కవి పండితుల సమక్షంలో ప్రదానం చేయబడుతుందని ఆచార్య ఫణీంద్ర వివరించారు.

19, మార్చి 2012, సోమవారం

వసంతోత్సవానికి స్వాగతం

శ్రీ నందన నామ సంవత్సర ’ఉగాది’ పర్వదిన సందర్భంగా 21 మార్చి 2012 నాడు సాయంత్రం 6 గం//లకు ’నవ్య సాహితీ సమితి’ నిర్వహణలో భాగ్యనగరంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరుపనున్న ’వసంతోత్సవం’ కార్యక్రమానికి జంట నగరాలలోని సాహిత్యాభిమానులకు ఇదే మా ఆహ్వానం. ఈ కార్యక్రమంలో వివిధ ప్రక్రియలలోని సాహితీ ప్రముఖులకు పురస్కార ప్రదానం, ప్రముఖ కవులచే ’కవి సమ్మేళనం’ ప్రధానాంశాలుగా ఉంటాయి. ’జ్ఞాన పీఠ’ పురస్కార గ్రహీత డా సి. నారాయణరెడ్డి, టి.టి.డి పూర్వ కార్య నిర్వహణాధికారి డా. కె.వి, రమణాచారి, ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొంటారు.

20, ఫిబ్రవరి 2012, సోమవారం

హాలాహల పానం


------------------------------------------------------------------------------
సురాసురుల్ చని, ''పాలవెల్లి మథింప హాలాహలంబు జనించె, ప్రాణి సందోహమున్ బ్రదికింపవే ఈశ్వరా!'' అని పరమేశుని ప్రార్థించగా -
ఆ భక్త రక్షకుడు పార్వతీదేవితో

''శిక్షింతు హాలహలమును,
భక్షింతును మధుర సూక్ష్మ ఫల రసము క్రియన్;
రక్షింతు బ్రాణికోట్లను;
వీక్షింపుము నీవు నేడు వికచాబ్జ ముఖీ!'' యనెను.

అప్పుడు

'' మ్రింగెడు వాడు విభుండని,
మ్రింగెడిదియు గరళమనియు, మేలని ప్రజకున్,
మ్రింగుమనె సర్వ మంగళ -
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!

తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీర రవంబుతో శివుడు - “లోక ద్రోహి! హుం! పోకు ర“
మ్మని కెంగేల దెమల్చి కూర్చి, కడిగా నంకించి, జంబూఫలం
బన సర్వంకషమున్ మహా విషము నాహారించె హేలాగతిన్!

కదలం బారవు పాప పేరు, లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు, నేత్రంబులు నెర్ర గావు, నిజ జూటా చంద్రుడుం గందడున్,
వదనాంభోజము వాడ, దా విషము నాహ్వానించుచో - డాయుచో -
బదిలుండై కడి సేయుచో - దిగుచుచో - భక్షించుచో - మ్రింగుచోన్ -

ఉదరము లోకంబులకును
సదనం బగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం
గుదురుకొన గంఠ బిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫల రసము క్రియన్!
---------------------------------------------------

ఈ ఘట్టాన్ని ఇంతకన్నా భావుకతతో, ఇంతకన్నా హృద్యంగా ఎవరైనా విరచించగలరా?
బమ్మెర పోతరాజుకు జేజేలు!
అందరికి ‘శివరాత్రి‘ పర్వదిన శుభాకాంక్షలు!

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సాహితీ మిత్రులకు స్వాగతం


మిత్రులు బి.ఎస్. రామకృష్ణ గారు [ executive editor, sakshi t.v. ఫోన్ నం.9505555060 ] అందించిన ఈ ఆహ్వానాన్ని మన్నించి సాహితీ ప్రియులంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన.
- డా. ఆచార్య ఫణీంద్ర

4, ఫిబ్రవరి 2012, శనివారం

నా స్మృతి పథంలో ..

[మా గురుదేవులు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారు తమ ఆత్మకథలో వ్రాసుకొన్న విషయం ఇది. చదివి ఆయన పద్య కవితా పారమ్యాన్ని గ్రహించి ఆనందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర ]




ఒకసారి అమలాపురంలో అష్టావధానం చేసేటప్పుడు నన్ను పృచ్ఛకుడు వేసిన ప్రశ్న.
" అవధాని గారూ! మీ స్మృతిపథాన తొలి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని పద్యంగా చెప్పండి. "
అది గడ్డు ప్రశ్న. కాని అది అవధాన సభ. కోరినది చెప్పక తప్పదు. అందుకే అప్పటికప్పుడు కొంటెగా ఒక సన్నివేశాన్ని కల్పించి పద్యం చెప్పాను.

" పాటలు పాడి నన్ను పసి బాబును ఊయలలోన ఊచుచున్
ఆటలు నేర్పు దాదిని రహస్యముగా పొదరింటి లోనికిన్
పైట చెరంగు బట్టి పరవాడెవడో తరలించు దృశ్యమున్
మాటలు వచ్చినంతటనె మాతకు చెప్పదలంచినాడనే! "

ఆ పృచ్ఛకుడు అన్నాడు. " అవధాని గారూ! నేను కోరినది అతిశయోక్తి లేని అచ్చమైన సత్యాన్ని. అదే ’ఉత్పలమాల’లో అదే ’ట’కార ప్రాసతో మీ జీవన స్మృతిపథంలోని తొలి సన్నివేశాన్ని ఉటంకిస్తూ మరో పద్యం చెప్పండి. "
అప్పుడు నేను ఆశువుగా చెప్పిన పద్యం -

" స్ఫోటక బాధచే ఒడలు సోలి పరుంటిని తల్లి ప్రక్కలో -
మాటికి మాటికిన్ మరల మంచముపై కెగబ్రాకు తేలు నన్
వ్రేటును వేయకుండ తన వ్రేళులతో విదలించి, ఎన్నియో
కాటులు తిన్న తల్లి కృప - కారణ జన్ముడనై తరించెదన్! "

ఆ సత్యం సభను మిక్కిలి ఆకర్షించింది. తల ఊపుతూ ఒక సదస్యుడు లేచి తన చేతి ఉంగరం నా చేతికి తొడిగాడు హర్షధ్వానాల మధ్య.
---***---

23, జనవరి 2012, సోమవారం

సరస సల్లాపము - 20



చాల నాళ్ళ క్రితం ప్రముఖ కవి 'ఉండేల మాలకొండారెడ్డి'తో ఒక కవి మిత్రుడు - తనకు రావలసిన పురస్కారం ఫలానా వారి సిఫార్సుతో వేరే కవికి వెళ్ళిపోయిందని చెప్పుకొని బాధపడ్డాడట. అప్పుడు మాలకొండారెడ్డి కవి -
'' చూడు నాయనా! ఈ లోకమే అంత! -
క్రింద ఉన్నది భువి -
పైన ఉన్నది రవి -
నడుమ ఉన్నదంతా ‘ పైరవి ’! '' అని ఆ కవిని ఓదార్చారట.

20, జనవరి 2012, శుక్రవారం

సరస సల్లాపము - 19



హైదరాబాదులోని ఆంధ్రమహిళాసభ కళాశాలలో కడిమెళ్ళ వరప్రసాద్ గారి అష్టావధానం జరుగుతున్నది. నాతోబాటు సాహితీమిత్రులు కొందరు పృచ్ఛకులుగా కూర్చొని ఉన్నాం.
దత్తపది అంశం నిర్వహిస్తున్న పృచ్ఛకుడు - ” చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ” అన్న పదాలిచ్చి భారతార్థంలో పద్యం చెప్పమన్నారు.
అవధాని - ” మొదటి మూడు పదాలను గురించి విన్నాను గాని, నాలుగో పదమేంటో నాకు అర్థం కాలేదు ” అన్నారు.
అప్పుడు అవధానికి సభాసమన్వయకర్త ’ ప్రాన్స్ ’ అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేసారు.
ఇంతలో నేను అందుకొని - ” అదేనండి! ప్రాన్స్ అంటే ప్రాణులు ” అన్నాను.
సభలో అందరూ పగలబడి నవ్వారు.

13, జనవరి 2012, శుక్రవారం

సరస సల్లాపము - 18





1974 - 75ల నాటి మాట -
నల్లని జుత్తు(హెయిర్ డై చేసిందే లెండి), తెల్లని జుబ్బా వేసుకొని ట్రిమ్ గా ఉన్న గీత రచయిత ఆత్రేయ ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆఫీస్ నుండి రెమ్యూనరేషన్ తీసుకొని బయటకు వస్తున్నారు. బయట అప్పుడప్పుడే ఫీల్డ్ లోకి వస్తున్న నడి వయస్కుడు .. కాస్త నలుపు, తెలుపు జుత్తు ... కొద్దిగా బట్టతల ఉన్న రచయిత కనబడి నమస్కరించారు. ఆయనను వేటూరి సుందరరామమూర్తిగా గుర్తించిన ఆత్రేయ - ” ఏమిట్రా ఆ తెల్ల జుత్తు? కాస్త రంగు రాసుకొని ట్రిమ్ గా కనిపిస్తే నాలుగు చాన్సులొస్తాయి. నన్ను చూడు .. ముసలాడిని - ఎంత ట్రిమ్ గా ఉన్నానో! " అన్నారు. వేటూరి నవ్వుతూ -” మీతో పోటీ పడగలనా గురువుగారు? ” అన్నారు.
రెండేళ్ళ తరువాత ’సిరిసిరి మువ్వ’, ’అడవి రాముడు’ పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. మళ్ళీ ఆ ఇరువురు కవి దిగ్గజాలు ఒక స్టూడియోలో తారసపడ్డారు. ఈ మారు వేటూరి ఉన్న కాస్త జుత్తును చక్కగా డై చేసి ట్రిమ్ గా ఉన్నారు. ఆత్రేయ పూర్తిగా తెల్ల జుత్తు, మాసిన జుబ్బాతో కనిపించారు. వేటూరి ఆత్రేయతో - ” ఏంటి గురువుగారు! నా జుత్తుకు రంగు రాసుకొమ్మని చెప్పి, మీరు రాసుకోలేదే? ” అని అడిగారు. ఆత్రేయ కాస్త పెదవి విరిచి - ” సరే .. ! నువ్వు రాయడం మొదలు పెట్టాక, నేనెక్కడ రాస్తున్నానురా? " అన్నారు. వేటూరి శిరస్సు వంచి నమస్కరించారు.

11, జనవరి 2012, బుధవారం

సరస సల్లాపము - 17



నగరంలోని ’త్యాగరాయ గానసభ’లో ఒక ప్రసిద్ధ సంస్థ నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని, కవులమంతా సరదాగా మాట్లాడుకొంటూ రోడ్డెక్కాం. పక్కనే ఉన్న ’సుధా దర్శని’ హోటల్లో ”టీ త్రాగుదాం రండి” అంటూ కవులందరినీ ఆహ్వానించాను. హోటల్లోకి వెళ్ళాక - ”నేను టీ తీసుకొంటాను. మీకు ’టీ’ యా? ’కాఫీ’ యా?” అని అడిగాను. వెంటనే కవి మిత్రుడు ’దత్తాత్రేయ శర్మ’ - ”మేమంతా ’టీ’చరులమే!” అన్నారు. అందరం నవ్వుకొంటూ ’టీ’ సేవించాం.