23, ఆగస్టు 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ... ( ఆగస్టు 2009 )

బాల గణేశునికి వందనం
( ఈ మాసం పద్య కవిత )
" అంకము జేరి శైలతనయా స్తన దుగ్ధము లాను వేళ, బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి, యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ ! "




ఇది ’ మను చరిత్రం ’ లో అల్లసాని పెద్దన కవి వ్రాసిన ప్రసిద్ధ గణేశ స్తుతి పద్యం.
అందరిలా మామూలుగా స్తుతిస్తే అది అల్లసాని వారి పద్యం ఎలా అవుతుంది ?
అందుకే పెద్దన కవి అందులో విశేషమైన భావుకతను జోడించి కమనీయమైన స్తుతి పద్యంగా తీర్చిదిద్దాడు.
ఇక ఆ పద్యంలోనారసి చూద్దాం -
బాల గణేశుడు పార్వతీ దేవి ఒడికి చేరి ఆమె పాలు త్రావుతూ, బాల్య చాపల్యంతో తన తొండంతో ఆమె మరొక చన్నును అందుకోబోయి, అదెక్కడుందో కనరాక, అడ్డుగా ఆమె మెడలో ఆభరణంగా ఉన్న నాగరాజును చూచి,"ఇదేమిటి - తామర తూడా?" అన్న అనుమానంతో తాకి చూచే గజాననుని తన ఇష్ట సిద్దికై కొలుస్తానంటాడు కవి.
ఎంత రమణీయమయిన భావన !
ఈ వినాయక చవితి పర్వదినం నాడు ఈ పద్యాన్ని పఠించిన వారందరికీ ఆ విఘ్ననాయకుని కరుణా కటాక్షం ప్రాప్తించి, అభీష్ట సిద్ధి కలుగు గాక !
- డా. ఆచార్య ఫణీంద్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి