9, ఆగస్టు 2009, ఆదివారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( ఆగస్టు 2009 )



’ ఉత్పలమాల ’ పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 10 వ అక్షరం.
ఇప్పుడొక భావాన్ని ఇస్తాను. దాన్ని ’ ఉత్పలమాల ’ పద్యంలో ఇమిడ్చే ప్రయత్నం చేయండి.
" పాండవులు కూడా సహోదరులే. పాపమని దయజూపి, వారితో యుద్ధమేదీ ఏర్పడవద్దని యెంచుతూ, ఏవో ఐదు ఊళ్ళు, అవీ ... ఎండిన భూములున్నవైనా, ఎందుకూ కొరగానివైనా, నీ గుండెను నిండు చేసుకొని దానం చేయ్ - ఓ సుయోధనా ! " అని శ్రీ కృష్ణుడు రాయబారంలో దుర్యోధనునితో అన్న మాటలను ’ ఉత్పలమాల ’ పద్యంలో పెట్టండి.
మీ అభ్యాస ఫలితంగా వచ్చిన పద్యాలను వ్యాఖ్యలుగా అందించండి. తప్పొప్పులను నేను తెలియజేసి సరిదిద్దగలను. ఇలా సన్నివేశ పరమైన అంశాలను పద్యాల్లో పెట్టగలిగితే, రేపు కావ్యాలను వ్రాయగలిగే శక్తి మీకు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ? ఉపక్రమించండి.

10 కామెంట్‌లు:

  1. పాండవు పుత్రులేవురను వైరుల సేయకు రాజనందనా
    నిండుగ నూట ఐదుగురు నెయ్యము తోడను కూడి యుండగన్
    నిండగు మానసమ్మునను నివ్వుము వారికి ఊళ్ళు ఐదిటిన్
    ఎండిన బీడులైన మరి ఎందుకు నేర్వని చౌడు లైననూ

    రిప్లయితొలగించండి
  2. హరి గారు !
    చాలా బాగా వ్రాసారు. అభినందనలు !
    చిన్న చిన్న అంశాలను సరిదిద్దుతాను.

    " పాండవులు " అంటేనే పాండు రాజు పుత్రులని అర్థం. కాబట్టి మళ్ళీ పుత్రులని వ్రాయకూడదు.
    దాన్ని " పాండుకుమారు లేవురిని " అని మారిస్తే సరిపోతుంది.
    " ఇవ్వుము " కన్న " ఈయుము " బాగుంటుంది. అలాగే
    " చౌడులైననూ " అనకుండా " చౌడులైననున్ " అనాలి.
    ఇంకా, 4వ పాదాన్ని 3వ పాదంగా మారిస్తే, స్పష్టత పెరుగుతుంది.
    ఇప్పుడు మీ పద్యాన్ని గమనించండి.

    పాండుకుమారు లేవురిని వైరుల సేయకు రాజనందనా !
    నిండుగ నూట ఐదుగురు నెయ్యము తోడను కూడి యుండగన్,
    ఎండిన బీడులైన మరి ఎందుకు నోచని చౌడులైననున్ -
    నిండగు మానసమ్మునను నీయుము వారికి ఊర్ల నైదిటిన్ !

    మరొకమారు అభినందనలతో ...

    రిప్లయితొలగించండి
  3. ఆచార్యా,

    మీ సవరణలు అద్భుతం. మీ సూచనల వలన నేను చాలా నేర్చుకో గలుగు తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. వారలు నీకు సోదరులు వారల తోడ రణంబు పాడియే?
    కోరిన భాగమో, యదియు కూడని వేళ పురమ్ములైదిటిన్
    ధారుణి యందునిచ్చి మరి దారుణముల్ తొలగింపవే నృపా!
    భూరి దయా గుణంబు కురు భూవర నైజము, నేడు తప్పునే?

    రిప్లయితొలగించండి
  5. సత్యనారాయణ గారు!
    తిక్కన పద్యమో లేక తిరుపతి వేంకట కవుల పద్యమో అంటే నమ్మేంత కమ్మగా అల్లారు పద్యాన్ని.
    మీకు నా అభినందన చందనాలు!

    రిప్లయితొలగించండి
  6. పాండవు లన్నదమ్ములని పాప మటంచు కృపన్ వహించి యే
    భండన మేర్పడన్ వలదు వారలతో నని యెంచి వారికై
    యెండివ భూములుండినను యెందుకు గానివి యూళ్ళవైదు నీ
    గుండెను నిండొనర్చియును కోరి యొసంగుము కౌరవేశ్వరా!

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారు !
    మంచి ధారతో చక్కని పద్యం వ్రాసారు.
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  8. నా పూరణ :

    పాండవులున్ సహోదరులె ! పాపమటన్ దయ చూపి, వారితో
    భండన మేది యేరుపడవద్దని యెంచుచు, నైదు ఊళ్ళెవో
    ఎండిన భూములున్ గలిగి, ఎందుకునున్ కొరగానివైన, నీ
    గుండియ నిండు జేసుకొని, కూర్చుము దానము - ఓ సుయోధనా !

    రిప్లయితొలగించండి
  9. డా.కోమల రావు బారువ21 డిసెంబర్, 2010 2:32 PMకి

    వారును మీరు సోదరు లె వైరము లేల సుయోధనా వృధా
    పౌరుష మేల యుద్ధ మను మాటను వీడి దయా ర్ధ్ర చిత్త తన్
    వారికి బీడులైన కొరగానివి యై నను నూ ళులై దు సొం
    పార నొసంగినన్ కురు నృపాల భవత్సములుందురే భువిన్

    రిప్లయితొలగించండి
  10. డా.కోమలరావు బారువ22 డిసెంబర్, 2010 7:49 PMకి

    * దయ చేసి ఈ పద్యాన్ని సరిచేయ గలరు **
    సీ.. కొమ్మ ప్రాయపు వేళ కోకఁ గట్టిన రీతి
    వనములన్ని చిగిర్చి వన్నె జూ పె
    పువ్వుఁ బో డి పయోద ముల కెనయౌనన
    విరవాదిగుత్తులు విఱుగ బూసె
    అలికులవేణి వేనలి మాబోంట్ల కు సమమౌ
    నే యంచు అలికులం బేగు దెంచె
    విరిఁబోడి మృదువాణి సరిరాదు మా కంచు
    పంచమములు కూసె పంచమమ్ము

    తే.గీ. వన్నె మీర లేఁజిగురాకు వలువ కట్టి
    యిరుల వంటి పెన్నెఱుల క్రొవిరులు వెట్టి
    పరవ శించి కోయిల పంచ మమ్ము పాడ
    పుడమి పులకించె వనలక్ష్మి పొలయు వేళ

    రిప్లయితొలగించండి