22, జూన్ 2009, సోమవారం

వార్తా విశేషం ... ( జూన్ 2009 )



---------------------------------------------------------------------------------


నండూరి రామకృష్ణమాచార్య 89వ జయంతి సభ


లోగడ ప్రకటించినట్టుగా 29 ఏప్రిల్ 2009 నాడు హైదరాబాదులోని నారాయణగూడలో YMCA హాలులో " నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " మరియు " నవ్య సాహితీ సమితి " సంస్థల సంయుక్తాధ్వర్యంలో కీ. శే. డా || నండూరి రామకృష్ణమాచార్య 89 వ జయంతి సభ ఎంతో వైభవంగా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన " త్రివేణి " ఆంగ్ల పత్రికా సంపాదకులు ఆచార్య ఐ.వి.చలపతి రావు " నండూరి రామకృష్ణమాచార్యులు తెలుగు పద్య కవిత్వ రంగంలో వైతాళికు " లని, అంతే కాకుండా " ఆయన బహుభాషా కోవిదు " లని కీర్తించారు. ఆంగ్లంలో ఆయన రచించిన "మహా భారత " బహుళ ప్రసిద్ధమని ఆయన ప్రశంసించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య టి. కిషన్ రావు మాట్లాడుతూ " నండూరి వారు ముక్తక పద్యాలలో ఆధునిక సమాజానికి అద్దం పట్టిన మహాకవి " అని శ్లాఘించారు. సభలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం సంపాదకులు, ప్రముఖ పద్య కవి శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యులను నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం క్రింద ఆయనకు నాలుగు వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువ ప్రదానం చేసారు. ప్రముఖ విమర్శకులు, ఉస్మానియా విశ్వ విద్యాలయం రిటైర్డ్ డీన్ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య ఎస్.వి.రామారావు నండూరి వారి స్మారక ప్రసంగం చేస్తూ, నండూరి వారి "ఆలోచనం" గ్రంథంలోని రచనా వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు గానం చేసిన నండూరి వారి " శీర్ణ మేఖల " పద్య కవితా గానం "హైలైట్" గా నిలిచింది. సభలో ఇంకా ప్రముఖ పద్య కవులు ఆచార్య వి.ఎల్.ఎస్. భీమ శంకరం , శ్రీ చిల్లర కృష్ణ మూర్తి , నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు శ్రీ కె. సాగర్ రావు, కోశాధికారి శ్రీ ఆత్మకూరి గాంధీ , టి.టి.డి. వేదాంత వర్ధనీ కళాశాల ప్రిన్సిపాల్ డా || నండూరి విద్యారణ్య స్వామి పాల్గొని రామకృష్ణమాచార్యుల సాహితీ మూర్తిమత్వాన్ని ప్రస్తుతించారు. నండూరి వారిచే రచించబడిన పద్యాల పఠన పోటీలో విజేతలైన విద్యార్థులకు ఈ సభలో ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేయబడింది. ఈ మహాసభకు నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి డా || ఆచార్య ఫణీంద్ర , నవ్య సాహితీ సమితి అధ్యక్షులు శ్రీ వేమరాజు విజయకుమార్ సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.

_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకులు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి