2, అక్టోబర్ 2010, శనివారం

సరస సల్లాపము - 6













’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’



1950వ దశాబ్దిలోని మాట.
మా గురువుగారు ’నండూరి రామకృష్ణమాచార్య’ గారిని భీమవరంలో ఒక సాహిత్య సంస్థ ఘనంగా సన్మానించాలనుకొంది. మా గురువుగారి గురువుగారు ’పింగళి లక్ష్మీకాంతం’ గారిని సన్మాన కర్తగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ...
ఇంతలో ఒక దుర్వార్త ... మహాకవి, గురువులకే గురువు ’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’ గారు పరమపదించారని నిర్వాహకులకు తెలిసింది. వెంటనే ఒక వార్తాహరుని మా గురువుగారి వద్దకు పంపారు. " చెళ్ళపిళ్ళ వారు మరణించిన సందర్భంలో సన్మాన కార్యక్రమం జరుపడం బాగుండదు. ఎలాగు ... లక్ష్మీకాంతం గారు వస్తున్నారు కాబట్టి, వారి ఆధ్వర్యవంలోనే ఆ సభను చెళ్ళపిళ్ళ వారి సంతాప సభగా జరుపాలనుకొంటున్నాం. మీరూ తప్పకుండా రావాలి " అని అతడు చెప్పాడు. నిండు యవ్వనంలో అప్పుడప్పుడే ’కీర్తి’ రుచి చూస్తున్న మా గురువుగారికి ఈ వార్త అశనిపాతంలా తగిలింది.
ఇంతలో లక్ష్మీకాంతం గారు మా గురువుగారి ఇంట్లోనే దిగారు. చిన్నబోయి ఉన్న శిష్యుని నుండి విషయం తెలుసుకొన్న లక్ష్మీకాంతం గారు, " సరే ! నువ్వయితే పద ! చూద్దాం ! " అని శిష్యుని వెంటదీసుకొని బయలుదేరారు.
సభ ప్రారంభమయింది. పింగళి లక్ష్మీకాంతం గారు ప్రసంగిస్తున్నారు ...
" చెళ్ళపిళ్ళ వారు జగద్గురువులు. నేను వారి శిష్యుణ్ణి అయినందుకు గర్విస్తున్నాను. ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాచీన యుగానికి భరత వాక్యం; నవీన యుగానికి నాందీ వాక్యంలాంటి వారు. వారికి మరణం లేదు. ఆ మాటకు వస్తే, ప్రతిభకు మరణం ఉండదు. అది ఒక జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. నిన్నటి వరకు మా గురువుగారిలో ఉన్న ప్రతిభ, ఈ రోజు నాలో, తరువాత నా శిష్యుడు నండూరి రామకృష్ణమాచార్యలో ప్రకాశిస్తూనే ఉంటుంది. అంచేత మా శిష్యుణ్ణి సన్మానిస్తే, పైనున్న మా గురువుగారు తనను సన్మానించినట్టుగా సంతోషిస్తారు. పాపం ! ఈ నిర్వాహకులు నండూరి రామకృష్ణమాచార్యను సన్మానించుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకొన్నట్టున్నారు. ఇప్పుడా కార్యక్రమాన్ని జరుపుకొందాం ! " అని లక్ష్మీకాంతం గారు నిర్వాహకుల వైపు తిరిగారు. నిర్వాహకులు కాసేపు అవాక్కయి, తరువాత తేరుకొని, సన్మాన సామాగ్రిని ఆయన ముందుంచారు. లక్ష్మీకాంతం గారు శిష్య వాత్సల్యంతో తన చేతుల మీదుగా నండూరి వారిని ఘనంగా సన్మానించారు. తరువాత లక్ష్మీకాంతం గారు, " ఇన్నాళ్ళు నేను ’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’ గారి శిష్యునిగా చెప్పుకొని జీవించాను. ఇక ఈ రోజు నుండి ’నండూరి రామకృష్ణమాచార్య’ గురువుగా చెప్పుకొని గర్విస్తాను. " అని తన ప్రసంగానికి ముక్తాయింపు పలికి, కూర్చున్నారు.

4 కామెంట్‌లు: