10, జులై 2011, ఆదివారం

సరస సల్లాపము - 10



ఆత్రేయ - వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించేవారని ప్రతీతి.
హీరో కృష్ణంరాజు ’అమర దీపం’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి. మహాకవి ఆత్రేయను ’హోటల్ చోళ’ అన్న స్టార్ హోటల్లో పెట్టి, సకల సౌకర్యాలు సమకూర్చి, మంచి పాటలు వ్రాసిమ్మని కోరా రాయన.
పది రోజులు గడిచాయి. ఆత్రేయ సకల భోగాలను అనుభవిస్తూ హాయిగా తింటున్నారు, పంటున్నారు గానీ ఒక్క పాటా.. చివరికి ... ఒక్క పల్లవిని కూడా వ్రాసివ్వలేదు. కృష్ణంరాజు మొహమాటానికి మరో ఐదు రోజులు వేచి చూసారు. అయినా, కవిగారి నుండి ఉలుకు లేదు.. పలుకు లేదు. హోటల్ బిల్లు తడిసి మోపెడయింది.
హీరో- కం- నిర్మాత కృష్ణంరాజుకు తెగ కోపం వచ్చింది. వెంటనే ఆత్రేయను ప్రక్కనే ఉన్న అర కొర వసతుల ’పల్లవ హోటల్’ లోని రూమ్ కు మార్చారు.
ఆత్రేయ రెండు రోజుల్లోనే అన్ని పాటలు వ్రాసిచ్చి, రూం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అద్భుతమైన ఆ పాటలను చూసుకొన్న కృష్ణంరాజు మనసు నొచ్చుకొని ఆత్రేయ ఇంటికి వెళ్ళి, కృతజ్ఞతలు చెప్పి, ఆసక్తిగా "’చోళ’ లో పదిహేను రోజులున్నా బయటకు రాని పల్లవులు ’పల్లవ’లో రెండు రోజుల్లోనే ఎలా వచ్చాయి మాష్టారూ?" అని అడిగారు. ఆత్రేయ నవ్వుతూ, "చోళులకు, పల్లవులకు పడదురా! చోళ సామ్రాజ్యం నుండి బయట పడ్డాక, పల్లవులు పరుగెత్తి వచ్చాయి" అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి